పంచాయతీ కార్యదర్శిపై భార్యాభర్తల దాడి - ఆ విషయంలో ప్రశ్నించినందుకే - Attack On Panchayat Secretary
Published : May 4, 2024, 5:03 PM IST
Husband And wife Attack On Panchayat Secretary : నీటి పైప్లైన్ను ఎందుకు ధ్వంసం చేశారని ప్రశ్నించిన పంచాయతీ కార్యదర్శిపై భార్యాభర్తలు దాడికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న అధికారిపై దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తనపై దాడికి పాల్పడిన వారిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ జరిగింది
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం దుబ్బతండ గ్రామంలో నేనవాత్ దేవీసింగ్ తన కుటంబంతో నివాసం ఉంటున్నారు. అతని భార్య నీల. అయితే తమ ఇంటికి కుళాయి నీరు రావడం లేదని భావించిన ఆ భార్యాభర్తలిద్దరూ కోపంతో కాలనీకి వచ్చే నీటి పైప్లైన్ను ధ్వంసం చేశారు. ఈ సమాచారం ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి సాయికుమార్ దృష్టికి వెళ్లింది. పైప్లైన్ ధ్వంసం చేసిన భార్యాభర్తలను అలా ఎందుకు చేశారని ప్రశ్నించిన ఆయనపై వారిద్దరూ దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. తనపై దాడికి పాల్పడిన దంపతులపై ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా సాయికుమార్ తెలిపారు.