యాదాద్రిలో భక్తులకు కొత్త సౌకర్యం - రాత్రి వేళల్లో నిద్రించేందుకు డార్మిటరీ ప్రారంభం
Published : Mar 15, 2024, 5:34 PM IST
Dormitory Services Opening in Yadagirigutta : యాదాద్రిలో భక్తుల కోసం మరో సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. రాత్రి సమయంలో నిద్ర చేయడం కోసం డార్మిటరీ హాల్ సిద్ధమైంది. ఇవాళ ప్రభుత్వ విప్ ఆలేరు బీర్ల ఐలయ్య ఆలయ అధికారులతో కలిసి ప్రారంభించారు. అదే విధంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ధార్మిక సాహిత్య మహాసభలను సైతం ప్రారంభించారు. అనంతరం శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేసవి కాలం వస్తుండడంతో భక్తుల సౌకర్యార్థం షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ గతంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి రాత్రి కొండపైన నిద్ర చేసి మొక్కులు చెల్లించేవారన్నారు. గత ప్రభుత్వంలో ఆలయ అభివృద్ధి పేరు మీద పాత ఆచారాలను పాటించకుండా, వాటికి స్థలాలు లేకుండా చేశారని దుయ్యబట్టారు. అందుకే గత సంప్రదాయాలు, ఆచారాలను ఒక్కొక్కటిగా అమలులోకి తీసుకొని వస్తున్నామన్నారు. ఇటీవలే మొక్కులు చెల్లించుకునేందుకు కొబ్బరికాయలు కొట్టే స్థలాన్ని ప్రారంభించారు.