ETV Bharat / state

రాయలసీమలో రణరంగం - దాడులతో ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసిన వైఎస్సార్​సీపీ - YSRCP Leaders Terrorized Voters

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 10:43 PM IST

YSRCP Leaders Terrorized Voters with Attacks In Rayalaseema: రాయలసీమలో వైఎస్సార్​సీపీ నేతలు రెచ్చిపోయారు. అరాచకాలు, దౌర్జన్యాలతో ఓటర్లను భయబ్రాంతులకు గురిచేశారు. పలుచోట్ల కూటమి ఏజెంట్లను కిడ్నాప్‌ చేశారు. ఇదేంటని నిలదీసిన వారిపై ఇష్టారీతిన దాడులకు తెగబడ్డారు. పోలింగ్‌ బూత్‌ల్లోకి ప్రవేశించి దొంగ ఓట్లు వేసేందుకు యత్నించారు. అడ్డుకోవాల్సిన అధికారులు సైతం అధికార పార్టీ నేతలకు కొమ్ముకాశారని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

ysrcp_leaders_terrorized_voters
ysrcp_leaders_terrorized_voters (Etv Bharat)

YSRCP Leaders Terrorized Voters with Attacks In Rayalaseema: అనంతపురం రూరల్ మండలం రాచనపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సిండికేట్‌ నగర్‌ పోలింగ్‌ బూత్‌లోనికి వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కుటుంబీకురాలు నయనతారెడ్డిని ఎలా అనుమతిస్తారని ప్రశ్నించిన టీడీపీ నాయకులపై రాళ్ల దాడి చేశారు. ఉరవకొండలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని పలు పోలింగ్ కేంద్రాల్లో వైఎస్సార్​సీపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి తనయుడు ప్రణయ్ రెడ్డి తన అనుచరలతో కలిసి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. అక్కడే కూర్చోని మైనార్డీ ఓటర్లను భయాందోళనలకు గురిచేసి పోలింగ్‌ను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారు.

తాడిపత్రి మండలం బొడాయిపల్లి గ్రామంలో ఏడు రోజుల బాలింత అయిన తన భార్యను ఓటు వేయించడానికి తీసుకెళ్తున్న టీడీపీ నేత కృష్ణమూర్తిపై వైఎస్సార్​సీపీ నాయకులు రాళ్ల దాడి చేశారు. పోలీసులే కృష్ణమూర్తిని పట్టుకొని దాడికి పాల్పడేలా చేశారని బంధువులు ఆరోపించారు. ఒకానొక సమయంలో రాళ్లదాడికి భయపడిన పోలీసులు చుట్టుపక్కల ఇళ్లలో దాక్కునే పరిస్థితి దాపరించింది. అనంతపురంలోని గుల్జార్ పేట కాలనీలోని పోలింగ్ బూత్​లోకి వైఎస్సార్​సీపీ మహిళ కార్పొరేటర్ నాగ వినీత దౌర్జన్యంగా ప్రవేశించడంపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్‌ అభ్యంతరం తెలిపారు. దీనిపై ఫిర్యాదు చేసినా పీవో చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉరవకొండలో టీడీపీ తరపున ప్రచారానికి వెళ్లిన ముస్లిం మహిళపై దాడికి పాల్పడిన వైఎస్సార్​సీపీ నాయకులపై కేసు నమోదైంది. టీడీపీ తరపున ప్రచారం చేస్తే కుటుంబాన్ని లేకుండా చేస్తామని బెదిరించారు.

అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం దళావాయిపల్లిలోని 192 పోలింగ్ కేంద్రంలో జనసేన ఏజెంట్‌పై దాడి చేసి వైఎస్సార్​సీపీ వర్గీయులు లాగిపడేశారు. నిరసనగా గ్రామస్థులు ఈవీఎంలను పగలగొట్టారు. ఇతర పార్టీ ఏజెంట్లు లేకుండా పోలింగ్‌ ఎలా నిర్వహిస్తారని పీవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా పాపక్క గారి పల్లెలో టీడీపీ ఏజెంట్లపై వైఎస్సార్​సీపీ నాయకులు దాడికి తెగపడ్డారు. పోలింగ్ స్టేషన్ వద్ద డీఎస్పీ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నడుమ పోలింగ్‌ నిర్వహించారు. పుట్టపర్తి నియోజకవర్గం సింగరాయపల్లిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించేందుకు వెళ్లిన కూటమి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పై వైఎస్సార్​సీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. పోలింగ్‌ కేంద్రం పరిశీలనకు రావద్దంటూ నిలవరించారు. పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడంతో గొడవ సద్దుమణిగింది.

నాటు బాంబులు, పెట్రోల్ సీసాలతో దాడులతో రక్తసిక్తమైన పల్నాడు - YSRCP attacks in Palnadu

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని పార్థసారధి నగర్ పోలింగ్ కేంద్రంలో ఓటర్లు నొక్కాల్సిన బటన్‌ను వైఎస్సార్​సీపీ నాయకుడే నొక్కడంపై బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్‌ కేంద్రంలోకి ఎలా అనుమతిస్తారని ఆర్వోని ప్రశ్నించారు. తప్పులు ప్రశ్నించిన వారిపైనే పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడం దారుణమన్నారు. బత్తలపల్లి మండలం మల్లవంతపు చర్లపల్లిలో టీడీపీ సానుభూతిపరులను ఓటు వేయకుండా వైఎస్సార్​సీపీ నాయకులు అడ్డుకున్నారు. ఇదేంటని ప్రశ్నించినవారిపై దాడికి తెగబడ్డారు. తనకల్లు మండలం దేవలం తండాలో వృద్ధురాలిని ఫ్యాన్‌ గుర్తుకు ఓటువేయాలని ఓపీఓ సూచించడంపై గ్రామస్థులు పీవో దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించకపోవడంతో పోలింగ్‌ కేంద్రం వద్ద ఆందోళన చేశారు. ఎట్టకేలకు ఓపీఓను విధుల నుంచి తప్పించడంతో ఆందోళన విరమించారు.

కర్నూలు శ్రీరామ నగర్ పోలింగ్ బూత్ వద్ద టీడీపీ కార్యకర్తలపై వైఎస్సార్​సీపీ నాయకులు దాడి చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో ప్యాపిలి ఎస్సై జగదీశ్వర్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలింగ్ కేంద్రం వద్ద మార్కెట్ యార్డ్ చైర్మన్ నారాయణమూర్తిపై చేయి చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కర్నూలు జిల్లా ఆదోనిలో వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సాయి ప్రసాద్‌ రెడ్డి ఫోటోతో కూడిన స్లిప్‌లను ఓటర్లకు పంపిణీ చేసినందుకు అతనిపై కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ స్లిప్‌లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్సార్​సీపీ నాయకుల ఆగడాలు మితిమీరి పోయాయి. మైదుకూరు, రైల్వే కోడూరు, రాయచోటి నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు ఏజెంట్లను లక్ష్యంగా చేసుకొని వైఎస్సార్​సీపీ అల్లరి మూకలు దాడులకు పాల్పడ్డాయి. రాయచోటి నియోజకవర్గం చౌటుపల్లిలో టీడీపీ కార్యకర్తలపై వైఎస్సార్​సీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఎనిమిది ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. మైదుకూరు నియోజకవర్గంలోని చాపాడు, ఖాజీపేటలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను వైఎస్సార్​సీపీ కార్యకర్తలు బయటకు లాగి విచక్షణ రహితంగా దాడి చేశారు. పుల్లంపేట మండలంలో జనసేన కార్యకర్తల్ని కిడ్నాప్ చేశారు. ఆగ్రహించిన గ్రామస్థులు ఈవీఎంలను ధ్వంసం చేశారు.

సమయం ముగిసినా కొనసాగుతున్న పోలింగ్- ఓటు వేసే ఇంటికెళ్తామంటున్న జనం - Voters Crowd at Polling Centers

చాపాడు మండలం చిన్నగులువలూరులో వైఎస్సార్​సీపీ నాయకులు టీడీపీ ఏజెంట్లను బయటకు లాగి కొట్టడంపై కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కామనూరులో వైఎస్సార్​సీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బంధువులు ఏజెంట్ ఫారం లేకుండా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడంతో టీడీపీ అభ్యర్థి వరదరాజుల రెడ్డి అనుచరులు అభ్యంతరం తెలిపారు. దీంతో బయటకు వచ్చిన వైఎస్సార్​సీపీ నాయకులు వరదరాజుల రెడ్డిని దూషించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

తిరుపతి జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోలీసుల సాయంతో వైఎస్సార్​సీపీ నాయకులు రిగ్గింగ్‍ పాల్పడుతున్నారంటూ టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. పోలీసులు ఏకపక్షంగా వైఎస్సార్​సీపీ అభ్యర్థి మురళికి సహకరిస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై విచక్షణారహితంగా లాఠీఛార్జ్‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోని శివజ్యోతి నగర్ పోలింగ్‌ బూత్‌లోకి వైఎస్సార్​సీపీ కార్పొరేటర్ అనుమతి లేకుండా ప్రవేశించారని కూటమి నేతలు నిలదీయడంతో వారిపై దాడికి యత్నించారు.

పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించారు. మీడియాతో మాట్లాడుతూ ఫ్యాను గుర్తుకు ఓటు వేశానని ప్రకటించారు. పెద్దిరెడ్డి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు యత్నించారని విపక్ష నేతలు ఆరోపించారు. తిరుపతిలోని పలు ప్రాంతాలలో దొంగ ఓట్లు వేసేందుకు వైఎస్సార్​సీపీ శ్రేణులు యత్నించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. రాయల్‍ నగర్‍, ఖాదీకాలనీలలో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన యువకులను బీజేపీ, టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది.

బాంబుల మోతతో దద్దరిల్లిన తంగెడ- భయంతో గజగజలాడిన స్థానికులు - YSRCP Activists Bomb Attacks

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో మంగమ్మ అనే వృద్ధురాలు ఓటును ముందుగానే వేశారని పీవో చెప్పడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. నా ఓటు ఇంకొకరు వేయడానికి ఎలా అనుమతిస్తారని నిలదీసింది. కచ్చితంగా ఓటు వేశాకే వెళతానని భీష్మించడంతో సిబ్బంది ఆమెతో టెండర్‌ ఓటు వేయించారు. సత్యవేడు నియోజకవర్గం కండ్రిగ గ్రామంలో తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామ ప్రజలు పోలింగ్‍ బహిష్కరించారు. ఊరి బయట బైఠాయించి నిరసనకు దిగారు. సత్యవేడు నియోజకవర్గం కొవ్వకుల్లిలో పోలీసుల అత్యుత్సాహం చూపించారు. పోలింగ్‍ కేంద్రానికి వంద మీటర్ల వెలుపల ఉన్న టీడీపీ శిబిరంపై ఎస్సై ప్రతాప్ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. శిబిరంలోని కుర్చీలను ధ్వంసం చేయడంతో పాటు పలువురి కార్యకర్తలపై లాఠీఛార్జ్‌ చేయడాన్ని నిరసిస్తూ పోలీస్ వాహనాన్ని అడ్డుకుని నిరసనకు దిగారు.

చిత్తూరులో పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉన్న పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్‌పై వైఎస్సార్​సీపీ నేత దాడి చేశారు. మిట్టురు పోలింగ్ కేంద్రంలో వాలంటీర్ ఏజెంట్‌గా ఉండడాన్ని మాజీ ఎమ్మెల్యే సీకే బాబు గుర్తించి అధికారుల్ని నిలదీశారు. వాలంటీర్‌ను బయటకు పంపకపోవడంతో ఆందోళన చేపట్టారు. తిరుపతిలోదొంగ ఓట్లను అడ్డుకున్న కూటమి నేతలపై వైఎస్సార్​సీపీ నేతలు దాడికి దిగారు. సీకాం కాలేజీలోని 250 బూత్​లో దొంగ ఓట్లు వేస్తున్నారనే సమాచారం రావడంతో కూటమి నేతలు అక్కడకి చేరుకున్నారు. సుగుణమ్మ అనుచరుడ్ని వైఎస్సార్​సీపీ నేతలు తోసేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.