YS Sharmila allegations: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల కడప పార్లమెంటు పరిధిలో రెండో విడత ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. బద్వేలు నియోజకవర్గం కాశినాయన మండలం వడ్డెమాను నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. బద్వేలు కాంగ్రెస్ అభ్యర్థి విజయజ్యోతి, మాజీ ఎమ్మెల్యే కమలమ్మ సమక్షంలో షర్మిల ఇంటింటి ప్రచారం చేపట్టారు. ప్రజలందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ... హస్తం గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన వైఎస్ షర్మిల మరోసారి వివేకా హత్య అంశాన్ని ప్రస్తావించారు. వివేకానందరెడ్డి ఎంత మంచి మనిషో మీకు అందరికీ తెలుసు అలాంటి మంచి మనిషిని పొట్టన పెట్టుకున్నారని షర్మిల ఆరోపించారు. హత్య చేయించిన వాళ్లకే మళ్లీ టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. ఇంతకంటే అన్యాయం ఉంటుందా ? అని ప్రశ్నించారు. హత్య అవినాష్ రెడ్డి కుటుంభం చేయించింది. అని అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. గూగుల్ లోకేషన్స్ వాళ్ళ ఇంటివైపు చూపిస్తున్నాయని తెలిపారు. హత్యకు ముందు పెద్ద ఎత్తున డబ్బు డీలింగ్ చేసినట్లు సీబీఐ చెప్పిందని గుర్తు చేశారు. రూ.40 కోట్ల డీల్ మాట్లాడి హత్యకు ప్లాన్ చేశారని షర్మిల ఆరోపించారు.
5 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడని ఆక్షేపించారు. కర్నూలులో అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయాలని చూస్తే రక్షించారని పేర్కొన్నారు. అడుగడుగునా హంతకులకు జగన్ అండగా ఉంటున్నారని దుయ్యబట్టారు. హంతకులను కాపాడుతున్నారని మండిపడ్డారు. మళ్ళీ హంతకులు గెలవాలా? హంతకులు మళ్ళీ చట్ట సభలోకి వెళ్లాలా ? అని ప్రశ్నించారు.
హంతకులు చట్ట సభల్లో వెళ్ళొద్దని తాను ఎంపీ గా పోటీ చేస్తున్నట్లు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఒకవైపు న్యాయం ఉంది. మరోవైపు అధర్మం ఉంది, ఈ వైపు వైఎస్ఆర్ బిడ్డ, ఆ వైపు వివేకా హత్య కేసు నిందితుడు ఉన్నాడు.. ఎవరికి ఓటేస్తారో తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు. అవినాష్ రెడ్డి ఎంపీగా 5 ఏళ్లు ఉండి ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు. కనీసం కడప స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేసింది లేదని పేర్కొన్నారు. ఎంపీగా ఈ ప్రాంత సమస్యల కోసం ఏనాడూ పార్లమెంట్ లో మాట్లాడింది లేదని షర్మిల విమర్శించారు.
వైఎస్ఆర్ ఆశయాలను జగన్ ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించిన షర్మిల, జగన్.. వైఎస్ఆర్ వారసుడు ఎలా అవుతారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పంట పరిహారం, ధరల స్థిరీకరణ నిధి పేరిట మోసం చేశారని మండిపడ్డారు. అధికారం అనుభవించి ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదని మండిపడ్డారు.