ETV Bharat / state

ఆ కూరగాయలు, ఆకు కూరల సాగును అడ్డుకోండి - రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు - Sewage Water Vegetables cultivation

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 26, 2024, 3:36 PM IST

Telangana High Court On Sewage Water Vegetables cultivation : హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని చెరువుల మురుగు నీటితో కూరగాయల సాగును అడ్డుకోవడానికి వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మురుగు నీటితో సాగైన కూరగాయలు, ఆకు కూరలు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని, అందువల్ల అవి మార్కెట్లోకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

High Court on Vegetables cultivation
Telangana High Court On Sewage Water Vegetables cultivation

కూరగాయల్లో కనిపించని విషం - రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చిన హైకోర్టు

Telangana High Court On Sewage Water Vegetables cultivation : కూరగాయల కోసం మార్కెట్‌కు వెళతాం. తాజా వాటి కోసం వెతుకుతాం. వెతికి వెతికి మంచివి, పుచ్చులు లేనివి ఎంచుకుంటాం. ఇంటికి తీసుకువెళ్లి బాగా శుభ్రం చేసి వండుకుంటాం. తాజా కూరగాయలు వండుకున్నాం అన్న సంతృప్తితో భోజనం చేస్తాం. అయితే ఇది నిజం కాదు. ఎంతో జాగ్రత్తగా శుభ్రమైన కూరగాయలు కొనుగోలు చేశామని అనుకుంటున్నా, విష పదార్థాలతో కూడిన కూరగాయలు కూడా మన వంటింట్లోకి చేరుతున్నాయి. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Sewage Water Vegetables cultivation : హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో కలుషితమయమైన చెరువుల నీటితో కూరగాయలు, ఆకు కూరల సాగును అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మురుగు నీటితో సాగైన కూరగాయలు, ఆకు కూరలు ప్రజారోగ్యంపై ప్రభావం చూపిస్తాయని, అందువల్ల ఇవి మార్కెట్‌లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జన బాహుళ్యంలోకి కలుషిత నీటితో పండిన కూరగాయలు వస్తున్నాయా అనే అంశం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే ఇది ఒక్క హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు మాత్రమే కాదు, దేశంలోని అనేక ప్రాంతాల్లో సాగడం కలవరపెడుతోంది.

మురుగునీటితో కూరగాయలు పండిస్తున్నారా? రాష్ట్రప్రభుత్వానికి నోటీసులిచ్చిన హైకోర్టు

కలుషిత నీటితో సాగయ్యే కూరగాయల్లో చేరుతున్న విష పదార్థాల గురించి గతంలో పలు అధ్యయనాలు భయంకరమైన వాస్తవాలను వెల్లడించాయి. హైదరాబాద్‌ చుట్టుపక్కల మూసీ నీటితో సాగు అవుతున్న కాయగూరల్లో ప్రమాదకర ఆర్సెనిక్‌, కాడ్మియం, లెడ్‌ వంటి విష పదార్థాలు ఉన్నట్లు ఇవి తేల్చాయి. బెంగళూరు, భోపాల్, వారణాసి నగరాల చుట్టుపక్కల కలుషిత జలాలతో పండించిన బీన్స్‌, కొత్తి మీర, పాలకూర, వంకాయ వంటి కూరగాయల్లో భార లోహాల ఆనవాళ్లు పరిమితికి మించి వెలుగు చూశాయి.

వాటి మూలంగా క్యాన్సర్ల ముప్పు పెచ్చుమీరుతోంది. చర్మవ్యాధులూ సంభవిస్తున్నాయి. తాజా కూరగాయలు అని నమ్మి, మనం కొని వండుకు తింటూ ఉంటే అవి మనకు తెలియకుండానే ఇలా విష పదార్థాలను శరీరంలోకి పంపిస్తున్నాయి. పోషకాలను అందించడానికి బదులు, కొత్త రోగాలు వచ్చేందుకు కారణం అవుతున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ పరిస్థితి లేకున్నా, అనేక చోట్ల మాత్రం ఈ సమస్య తాండవిస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.

మురుగునీటితో సాగైన కూరగాయలు : దేశంలో కలుషిత జల వనరుల వల్ల కూరగాయలు విషతుల్యం కావడానికి కారణాలు అనేకం ఉన్నాయి. జనాభా పెరుగుదల, గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు, ఫలితంగా పట్టణాలు ఇరుకుగా మారి నిర్మాణాల కోసం నదులు, చెరువులు, కుంటలు, సరస్సులు వంటి నీటి వనరుల ఆక్రమణ ప్రధాన కారణం. ఆక్రమణలు పోను మిగిలి ఉన్న నీటి వనరుల చుట్టూ జనావాసాలు, పరిశ్రమలు పెరిగి అవి కాలుష్యమయంగా మారుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చిన హైకోర్టు : గృహ, పారిశ్రామిక, వాణిజ్య సముదాయ వ్యర్థాల విచ్చలవిడి పారబోతతో నదులు, చెరువులు కాలుష్యం బారిన పడుతున్నాయి. ముంచెత్తుతున్న మురుగు నీరు, విష వ్యర్థాలు, ఇష్టారీతిన కబ్జాలు దేశవ్యాప్తంగా చెరువులకు మరణ శాసనం లిఖిస్తున్నాయి. నదీ జలాలను విషతుల్యంగా మార్చేస్తున్నాయి. పర్యవసానంగా ఆయా నదీ పరీవాహక ప్రాంతాల్లో పంట భూములు నిస్సారంగా మారుతున్నాయి. భూగర్భ జలాలూ పనికి రాకుండా పోతున్నాయి. ఆ నీటితో పండిన కూరగాయలు, ఆకు కూరలు విషతుల్యమై ప్రజారోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయి.

భారత్‌లో 323 నదులకు సంబంధించి 351 ప్రవాహ ప్రాంతాలు కాలుష్యమయంగా మారినట్లు అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. పశు కళేబరాలు, సగం కాలిన మృతదేహాలు, క్రిమి సంహారకాలు పెద్ద ఎత్తున చేరడంతో జీవ నదులు నిర్జీవంగా మారుతున్నాయి. ప్రమాదకర రసాయనాల ప్రభావంతో ఒక్క హైదరాబాద్‌లోనే వంద చెరువులు మరణావస్థకు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వ‌్యర్థాల పారబోతతో కొల్లేరు సరస్సు లాంటివి కళ కోల్పోయాయి.

Sewage Water Vegetables cultivation : గంగానది ప్రక్షాళనకు రూ.వేల కోట్లతో నమామి గంగే కార్యక్రమాన్ని చేపట్టినా, వ్యర్థాల వెల్లువకు అడ్డుకట్ట పడటం లేదు. దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల మురుగు నీటిలో 70 శాతానికి పైగా నేరుగా సరస్సులు, నదుల్లోకి వచ్చి చేరుతోందని నీతి ఆయోగ్‌ నివేదిక వెల్లడించింది. ఈ దారుణ పరిస్థితిపై సుప్రీంకోర్టు గత ఏడాది తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అయినా ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక కరవైంది. దేశంలో ప్రధాన నదులైన కృష్ణా, గోదావరి సహా శబరి, పెన్నా, మానేరు, మూసీ వంటి నదుల్లో నీటి నాణ్యత తీసికట్టుగా మారిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్ధారించడం ఆందోళన కల్గిస్తోంది.

High Court on Vegetables cultivation : జల వనరుల కాలుష్యంపై కోర్టులు, ట్రైబ్యునళ్ల ఆదేశాలు, పర్యావరణవేత్తల ఆందోళనలు, దుర్వాసన భరించలేక స్థానికుల గగ్గోలు, ఇలా ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నా చెరువుల దుస్థితి మారడం లేదు. అధికారుల్లో చిత్త శుద్ధి లేకపోవడం వల్ల మురుగు నీటితో నిండిపోతున్నాయి. నేరుగా ట్రంకులైన్లు వేసి మరీ మురుగును వాటిల్లో కలిపేస్తున్నారు. వాస్తవానికి మురుగు శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి, నీటిని శుద్ధి చేశాకే వదలాల్సి ఉన్నా అలా చేయడం లేదు. దీనికి తోడు పరిశ్రమల వ్యర్థాలు నాలాల్లో కలిసి నేరుగా చెరువులు, నదుల్లోకి చేరుతూ ఉండటంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. వీటి చుట్టు పక్కల నివసించే ప్రజలు ఘాటు వాసనలు, దోమలతో నరకయాతన అనుభవిస్తున్నారు. ఇందుకు ఉదాహరణ హైదరాబాద్‌లోని చెరువులు. నగరంలోని దాదాపు 15 చెరువులు కాలుష్యమయంగా మారాయి.

కాలుష్యానికి కారణం అవుతున్న పరిశ్రమలు : కాలుష్యంతో జల వనరులు కూరగాయల సాగుకు పనికి రాకుండా పోవడం మాత్రమే కాదు కనీసం స్నానానికి కూడా పనికిరానంతగా గరళంగా మారడం దేశ ప్రజల ఆరోగ్యానికి గొడ్డలిపెట్టు వంటిదే. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా అధికార యంత్రాంగం మేలుకోవాలి. తూతూ మంత్రం చర్యలను పక్కన పెట్టి ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పటిష్ఠ చర్యలకు సిద్ధం కావాలి. జలవనరుల కాలుష్యానికి మూల కారణాలను గుర్తించి సరిదిద్దాలి.

కాలుష్యానికి కారణం అవుతున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలి. మురికి కూపంగా మారిన మూసీ నది ప్రక్షాళనకు తెలంగాణ సర్కారు పూనుకున్నా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇదే సంకల్పం రావాలి. జలవనరులను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలూ తమ వంతు పాత్ర పోషించాలి. అప్పుడే నదులకు జీవం వచ్చేది. జలవనరులు స్వచ్ఛమైన నీటితో ఆర్థిక, ఆరోగ్య భారతానికి దోహదపడేది. కూరగాయల సాగుకు కలుషిత నీటిని వాడుతున్నారు అనే మాటలు వినాల్సి రావడం తప్పేది.

'మొక్కలు పెంచడమంటే నాకు ప్రాణం - ఆ ఆలోచనే నన్ను సేంద్రీయ వ్యవసాయంవైపు అడుగులు వేయించింది'

Plants Cultivation: పర్యావరణంపై ప్రేమ.. ఇంటిని మొక్కలతో నింపేసిన దంపతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.