ETV Bharat / state

వెనకబడిన వర్గాలకే టీడీపీ-జనసేన తొలి జాబితాలో పెద్దపీట

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 25, 2024, 6:46 AM IST

TDP-Janasena First List for AP Elections-2024: కూటమి ప్రకటించిన అభ్యర్థుల్లో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారు. వారికి 18 స్థానాలు కేటాయించారు. కుటుంబానికి ఒక్క సీటు సూత్రంతో కొందరికి ఒక్క స్థానం మాత్రమే ఇచ్చారు. అయితే వీరిలో కొన్ని కుటుంబాలకి మినహాయింపు ఇచ్చారు. మరోవైపు ఉమ్మడి జాబితాలో రాయలసీమలో 55 అసెంబ్లీ స్థానాలుంటే 31 స్థానాలకు కూటమి అభ్యర్థుల్ని ప్రకటించింది. కోస్తాలో 120 నియోజకవర్గాలకు 68 చోట్ల సీట్ల ప్రకటించారు.

tdp_first_list_candidates
TDP-Janasena First List for AP Elections-2024

వెనకబడిన వర్గాలకే టీడీపీ జనసేన తొలి జాబితాలో పెద్దపీట

TDP-Janasena First List for AP Elections-2024: తెలుగుదేశం, జనసేన అభ్యర్థుల జాబితాలో వెనకబడిన వర్గాలకు పెద్దపీట వేశారు. 99 మంది అభ్యర్థుల్లో 18మంది బీసీలు ఉన్నారు. ఇఛ్చాపురం, టెక్కలి, అమదాలవలస, గజపతినగరం, విశాఖ పశ్చిమం, నర్సీపట్నం, తుని, రాజమహేంద్రవరం సిటీ, ఆచంట, నూజివీడు,పెడన, మచిలీపట్నం, రేపల్లె, మైదుకూరు, పత్తికొండ, రాయదుర్గం,పెనుకొండ, అనకాపల్లి స్థానాల్లో బీసీలకు అవకాశం కల్పించారు. వీరిలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారు 17 మందికాగా జనసేన నుంచి మాజీ మంత్రి కొణతల రామకృష్ణ ఉన్నారు.

రాష్ట్రంలో మొత్తం 29 ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలుండగా తొలి జాబితాలోనే 20 మందిని ప్రకటించారు. ఆ 20 మంది తెలుగుదేశం పార్టీ వారే. వీరిలో 10మంది మొదటిసారి ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. వారిలో పి. గన్నవరం నుంచి మహాసేన రాజేష్‌, తిరువూరు నుంచి కొలికపూడి శ్రీనివాసరావు సామాజిక కార్యకర్తలు. జగన్‌ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై వివిధ రూపాల్లో పోరాడుతున్నారు.

టీడీపీ-జనసేన మొదటి జాబితాకి తాడేపల్లి ప్యాలెస్ కంపించింది: బోండా ఉమా

కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి సేవలందిస్తున్న విజయ బోనెల పార్వతీపురం నుంచి అనూహ్యంగా టికెట్‌ దక్కించుకున్నారు. చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్‌ ప్రవాసాంధ్రుడు. ఈయన స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారు. పామర్రు నుంచి బరిలోకి దిగుతున్న వర్లకుమార్‌ రాజా పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కుమారుడు. యర్రగొండపాలెం నుంచి బరిలో ఉన్న ఎరిక్షన్‌బాబు సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఎదిగారు. సూళ్లూరుపేట టికెట్‌ దక్కించుకున్న నెలవల విజయశ్రీ వృత్తిరీత్యా వైద్యురాలు.

మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం కూతురు. కోడుమూరు నుంచి బరిలో ఉన్న దస్తగిరి వృత్తిరీత్యా న్యాయవాది. మడకశిరలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు సునీల్‌కుమార్‌కి అవకాశం ఇచ్చారు. ఆయన దంత వైద్యుడు. గంగాధర నెల్లూరు నుంచి పోటీలో ఉన్న థామస్ బయోటెక్నాలజీలో పీహెచ్‌డీ చేశారు. ఏడు ఎస్టీ నియోజకవర్గాలకుగానూ కురుపాం, సాలూరు, అరకులకు తెలుగుదేశం అభ్యర్థుల్ని ప్రకటించింది.

సీఎం జగన్ ఓడిపోవడానికి, పారిపోవడానికి సిద్ధంగా ఉండాలి: కాలవ శ్రీనివాసులు

ఒక్క కుటుంబంలో ఒక్కరికే టికెట్​: తెలుగుదేశం తరపున పోటీచేసే వారిలో పలువురు రాజకీయ నేపథ్యం కల కుటుంబాల నుంచి వచ్చారు. వీరిలో కొంత మంది తొలిసారి పోటీలో దిగుతుండగా మరికొంత మందికి గతంలో పోటీచేసిన అనుభవం ఉంది. ఒక్క కుటుంబానికి ఒక టికెట్‌ మాత్రమే ఇవ్వాలన్న విధాన నిర్ణయానికి కట్టుబడి కొంతమంది నాయకుల కుటుంబాల్లో ఇద్దరు ముగ్గురు టికెట్లు ఆశించినా ఒకరికే పరిమితం చేసింది.

కోట్ల కుటుంబంలో సూర్యప్రకాశ్‌ రెడ్డికి డోన్, కేఈ కుటుంబంలో శ్యాంబాబుకు పత్తికొండ, పరిటాల కుటుంబంలో సునీతకు రాప్తాడు, భూమా కుటుంబంలో అఖిలప్రియకు ఆళ్లగడ్డ నియోజకవర్గాలను కేటాయించింది. ఈ కుటుంబాల నుంచి వీరితో పాటు ఇతరులు కూడా టికెట్లు ఆశించినా, అధిష్ఠానం ఒక్కరికే అవకాశం ఇచ్చింది.

అంబరాన్నంటిన టీడీపీ- జనసేన నేతల సంబరాలు

ఈసారి కూడా అయ్యన్నకే: మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు గత ఎన్నికల్లో తనకు, తన కుమారుడు విజయ్‌కు టికెట్లు అడిగారు. అప్పుడు అయ్యన్నకు మాత్రమే టికెట్‌ ఇచ్చారు. ఈసారి రెండు సీట్లు ఇవ్వలేకపోతే, తనకు బదులు కుమారుడు విజయ్‌కు కేటాయించాలని కోరారు. ఈసారి కూడా మీరే పోటీ చేయండంటూ అయ్యన్నకే నర్సీపట్నం టికెట్‌ను ఖరారు చేసింది.

తాడిపత్రి నుంచి జేసీ తనయుడు : అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబం నుంచి గత ఎన్నికల్లో దివాకర్‌రెడ్డి కుమారుడు పవన్‌ అనంతపురం లోక్‌సభ స్థానంలో, ప్రభాకర్‌రెడ్డి తనయుడు అస్మిత్‌రెడ్డి తాడిపత్రి అసెంబ్లీ నుంచి బరిలో నిలిచారు. ఈసారి తాడిపత్రిలో అస్మిత్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు. జేసీ అల్లుడు దీపక్‌రెడ్డి రాయదుర్గం నుంచి పోటీకి ఆసక్తి కనబరిచారు. అక్కడ గతంలో ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులుకే టికెట్‌ ఇచ్చారు.

అశోక్‌ గజపతిరాజు కుటుంబం నుంచి 2019లో అశోక్‌ విజయనగరం లోక్‌సభ స్థానానికి, ఆయన కుమార్తె అదితి విజయలక్ష్మి విజయనగరం అసెంబ్లీ సీటుకు పోటీ చేశారు. ఈసారి పోటీ చేయనని అధిష్ఠానానికి అశోక్‌ చెప్పినట్లు తెలిసింది. ఆ కుటుంబం నుంచి అదితి మాత్రమే విజయనగరం అసెంబ్లీ బరిలో దిగనున్నారు.

తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్న అభ్యర్థులు వీరే

లోకేశ్​ మరోసారి మంగళగిరి నుంచే: పార్టీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబాలకు మినహాయింపునిచ్చారు. కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేయనుండగా, మంగళగిరి నుంచి లోకేశ్‌ మరోసారి బరిలో దిగనున్నారు. చంద్రబాబు వియ్యంకుడైన నందమూరి బాలకృష్ణకు మరోసారి హిందూపురం టికెట్‌ ఖరారు చేశారు. బాలకృష్ణ రెండో అల్లుడైన శ్రీభరత్‌కు విశాఖపట్నం లోక్‌సభ స్థానాన్ని కేటాయించే అవకాశముంది.

కింజరాపు కుటుంబంలో అచ్చెన్నాయుడికి మరోసారి టెక్కలి టికెట్‌ దక్కింది. శ్రీకాకుళం ఎంపీ రామోహ్మన్‌నాయుడిని తిరిగి లోక్‌సభ బరిలో దింపనున్నారు. ఆయన సోదరి ఆదిరెడ్డి భవానీ రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యేగా ఉండగా, ఆమె భర్త ఆదిరెడ్డి వాసుకు ఈసారి టికెట్‌ ఖరారు చేశారు. రామ్మోహన్‌నాయుడు మామ అయిన బండారు సత్యానారాయణమూర్తిని పెందుర్తి నుంచి పోటీకి దింపే అవకాశముంది.

టీడీపీ-జనసేన తొలి జాబితాపై అభ్యర్థుల హర్షం - నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం

చీపురుపల్లి స్థానానికి పరిశీలనలో గంటా పేరు : మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, పి.నారాయణ వియ్యంకులు. వీరిద్దరూ తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. 2019ఎన్నికల్లో నెల్లూరు స్థానం నుంచి నారాయణ పోటీ చేయగా, విశాఖ ఉత్తరం నుంచి గంటా శ్రీనివాస రావు పోటీ చేశారు. ఈసారి నెల్లూరు నగర సీటును నారాయణకు కేటాయించారు. గంటా పేరును చీపురుపల్లికి పరిశీలిస్తున్నారు.

రాష్ట్ర అభివృద్ధికోసమే మా ప్రయత్నం - మాకు బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి: బాబు, పవన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.