ETV Bharat / state

నిరుపేద ఔత్సాహికులకు చిత్రకళలో ఉచిత శిక్షణ - ఆకట్టుకుంటున్న 'ఐకోనోఫ్రేమ్ 2024' - Story on Drawing Master Vikramraj

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 29, 2024, 3:56 PM IST

Icono Frame 2024 in Hyderabad
Special Story on Drawing Master Vikramraj

Special Story on Drawing Master Vikramraj : చేతిలో చిల్లిగవ్వ లేకున్నా చెక్కుచెదరని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాడు ఆ యువకుడు. తనలోని కళా ప్రతిభకు సాన పెట్టుకోవాలని ఫైన్‌ ఆర్ట్స్‌లో చేరాడు. దొరికిన పనల్లా చేసుకుంటూ డిగ్రీ పూర్తిచేశాడు. అద్భుత కళాఖండాలు సృష్టిస్తూ చిత్రకారుడిగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో కళారంగంలో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఇటీవలే హైదరాబాద్‌లో "ఐకోనోఫ్రేమ్ 2024" పేరిట కళాకృతులు ప్రదర్శించి ఆకట్టుకున్నాడు. తన ద్వారా వేల మంది విద్యార్థులను ఆర్ట్స్‌ వైపు నడిపిస్తూ చిత్రకళ కోసం పాటుపడుతున్న ఆ ఔత్సాహిక కళాకారుడి కథేంటో ఇప్పుడు చూద్దాం.

నిరుపేద ఔత్సాహికులకు ఆర్ట్​లో ఉచిత శిక్షణ - ఆకట్టుకుంటున్న 'ఐకోనోఫ్రేమ్ 2024'

Special Story on Drawing Master Vikramraj : సమాజాన్ని తన చిత్రకళతో ప్రభావితం చేయాలని సంకల్పించాడు ఈ యువకుడు. అందుకోసం "ఐకోనోఫ్రేమ్ 2024" పేరిట హైదరాబాద్‌లో ప్రముఖు మీడియా దిగ్గజాల కళాకృతులతో ప్రదర్శన నిర్వహించాడు. ఆదర్శనీయ వ్యక్తులుగా కీర్తించబడే వారి గురించి భావితరాలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశాడు విక్రమ్‌రాజ్. భవిష్యత్తులోనూ విభిన్న థీమ్‌లతో ఎగ్జిబిషన్‌లు నిర్వహించి ప్రజాచైతన్యం కోసం పాటుపడాలనే దృఢ నిశ్చయంతో సాగుతున్నాడు. జీవకళ ఉట్టిపడేలా చిత్రాలను సృష్టించిన విక్రమ్‌రాజ్‌ స్వస్థలం వరంగల్ జిల్లాలోని పరకాల.

చిత్రకళలో ఉచిత శిక్షణ : కేజీ నుంచీ పీజీ వరకూ ఇతడి చదువంతా గురుకుల, ప్రభుత్వ కళాశాలల్లోనే గడిచింది. కళలపై చిన్నప్పటి నుంచే అమితాసక్తి పెంచుకున్న విక్రమ్‌రాజ్‌, హైదరాబాద్‌లోని జీఎన్​ఎఫ్​ఏ(JNAFA) విశ్వవిద్యాలయంలో బీఎఫ్​ఏ, ఎంఎఫ్​ఏ పూర్తిచేశాడు. ఆర్ట్స్‌లో పీజీ పూర్తిచేసిన విక్రమ్‌రాజ్‌కు మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లోని గురుకుల పాఠశాలలో డ్రాయింగ్ మాస్టర్‌గా ఉద్యోగం లభించింది. జీవితం సాఫీగా సాగిపోతున్నా భావితరాలను కళాకారులుగా తీర్చిదిద్దాలనే తపన తనని వేధించేది. అందుకే ఒక పక్క ఉద్యోగం చేస్తూనే, ఔత్సాహికులకు చిత్రకళలో ఉచిత శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు.

Icono Frame 2024 in Hyderabad : బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఆర్ట్‌ కోర్సుల్లో చేరేలా తోడ్పాటు అందిస్తున్నాడు. 2013 నుంచి వేలమందిని ఈ కళ వైపు నడిపించి జీవితంలో స్థిరపడేందుకు కృషి చేశాడు విక్రమ్‌రాజ్‌. సమాజానికి స్ఫూర్తి పంచాలనే ఉద్దేశంతో చాలా ఏళ్లుగా పెయింటింగ్ ప్రదర్శనలు నిర్వహిస్తున్నాడు. తాజాగా హైదరాబాద్‌లోని మాదాపూర్ స్టేట్ ఆర్ట్‌ గ్యాలరీలో "ఐకోనోఫ్రేమ్ 2024" ఎగ్జిబిషన్ నిర్వహించాడు. మీడియా రంగంలో ప్రముఖులుగా పేరొందిన వారి కళాకృతులను ప్రదర్శించి చూపరులను ఆకట్టుకున్నాడు. ఈ ప్రదర్శన విజయవంతం కావడంతో రాబోయే రోజుల్లో సరికొత్త థీమ్‌లను ఎంచుకుని విరివిగా ప్రదర్శనలను నిర్వహిస్తానని అంటున్నాడు.

డ్రాయింగ్ మాస్టార్‌ కాకముందు : ప్రపంచ నలుమూలల సమాజానికి సమాచారం అందించి మానవళిని మేల్కొలిపే మాధ్యమం మీడియా అని, అందుకే ఐకాన్‌గా పరిగణించి చిత్రాలతో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశానని అంటున్నాడు విక్రమ్‌రాజ్‌. డ్రాయింగ్ మాస్టార్‌గా చేరకముందు కొన్నాళ్లు సినిమా, మీడియా రంగాల్లో ప్రకటనలు, మార్కెటింగ్, కమ్యూనికేషన్‌ విభాగంలో పనిచేశాడు విక్రమ్‌. చిత్రకారుడుగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు. కాలిగ్రఫీ(Calligraphy)లోనూ పురస్కారాలు దక్కించుకున్నాడు.

స్ఫూర్తి ప్రదాతగా రామోజీరావు : అలాగే ఈనాడు సంస్థ అధినేత రామోజీరావు(Ramoji Rao) తనకు స్ఫూర్తి ప్రదాత అని చెబుతున్నాడు. సమాజ శ్రేయస్సు కోసం పాటు పడాలని నిబద్ధత కృషి చేస్తున్న విక్రమ్‌ను చూస్తే గర్వంగా ఉందంటున్నారు ప్రొఫెసర్ సుందరకుమార్‌, మధు నందాలు. పదేళ్లుగా ఎందరో విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసి కళారంగంవైపు మళ్లేలా ప్రోత్సహిస్తున్నాడు విక్రమ్‌రాజ్‌. బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఫైన్‌ ఆర్ట్స్‌లో రాణించేలా చేయడమే తన ధ్యేయమని చెబుతున్నాడు.

'నేను 2013 నుంచి ఇప్పటి వరకు దాదాపు 2400పైగా పిల్లలకు నేర్పించా. అందులోని 21 మంది విద్యార్థులు గత సంవత్సరంలోనే బీఎఫ్​ఏ సీట్లు సాధించారు.'- విక్రమ్‌రాజ్‌, చిత్రకారుడు.

హైదరాబాద్​లో ఆర్టిక్స్ ఎగ్జిబిషన్ 2024 - కళలను ప్రపంచస్థాయిలో చాటి చెప్పేలా ప్రదర్శన

పెయింటింగ్‌లో రాణిస్తున్న ప్రభుత్వ టీచర్‌ - 35 ప్రపంచ స్థాయి అవార్డులు కైవసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.