ETV Bharat / state

డ్రగ్స్​ కేసులో మరో ట్విస్ట్​ - విచారణకు శుక్రవారం కాదు సోమవారం వస్తానన్న దర్శకుడు క్రిష్

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 29, 2024, 10:11 PM IST

Radisson Drugs Party Case Updates : గచ్చిబౌలి రాడిసన్​ హోటల్‌ డ్రగ్స్‌ కేసు తీగలాగితే డొంక కదిలిన చందంగా సాగుతోంది. రోజుకో కొత్త వ్యక్తి ఈ కేసుతో సంబంధం ఉన్నట్టుగా తేలుతున్నారు. దీంట్లో భాగంగా ఇప్పటికే పలువురిని రిమాండ్‌కు తరలించగా ఏ9 నిందితుడిగా ఉన్న నీల్‌ విదేశాలకు పారిపోయాడని, మరికొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Radisson Drugs Party Case Updates
డ్రగ్స్​ కేసులో మరో ట్విస్ట్​ - విచారణకు శుక్రవారం కాదు సోమవారం వస్తానన్న దర్శకుడు క్రిష్

Radisson Drugs Party Case Updates : రాడిసన్ హోటల్ డ్రగ్స్‌ కేసులో బుధవారం డ్రగ్‌ పెడ్లర్‌ సయ్యద్‌ అబ్బాస్‌ అలీ జఫ్రీని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. గురువారం ఏ4 నిందితుడిగా ఉన్న రఘు చరణ్‌కు నార్కోటిక్ పరీక్షలు నిర్వహించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ పరీక్షలకు సంబంధించి నివేదికలు(Reports) గురువారం రానున్నట్లు సమాచారం. కాగా, ఈ కేసులో పరారీలో ఉన్న లిషి సోదరి కృషిత గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో లిషితకు నోటీసులు వచ్చిన రోజు నుంచి కనిపించడం లేదని మిస్సింగ్‌ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సయ్యద్ అబ్బాస్‌ అలీ విచారణలో భాగంగా మీర్జా వహీద్‌ బేగ్‌ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు చెప్పడంతో వహీద్‌ను గురువారం పోలీసులు విచారించి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. వహీద్‌ను విచారించే క్రమంలో అతను ఇమ్రాన్ సహా మరో వ్యక్తి నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులకు వెల్లడించారు. ఇమ్రాన్‌ నుంచి వహాద్‌కు, అక్కడి నుంచి అబ్బాస్‌కు, అతడి నుంచి వివేకానంద డ్రైవర్ గద్దల ప్రవీణ్‌కు తర్వాత వివేకాకు చేరుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కాగా, ఇమ్రాన్ సహా మరో వ్యక్తిని అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. వీరికి డ్రగ్స్‌ సంబంధించి ఇంకా ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే కోణంలో పూర్తి దర్యాప్తు సాగుతోందని వెల్లడించారు.

మొదటిరోజు నుంచి ఈ కేసులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ప్రముఖ సినీ దర్శకుడు జాగర్లమూడి క్రిష్‌(Krish). ఈనెల 24వ తేదీన జరిగిన డ్రగ్ పార్టీలో క్రిష్‌ సైతం పాల్గొన్నట్లు డ్రగ్‌ పెడ్లర్‌ అబ్బాస్‌ వెల్లడించాడు. కాగా క్రిష్‌ను విచారణకు హాజరుకావాలని పోలీసులు కోరారు. ముందు శుక్రవారం రోజున హాజరవుతానని చెప్పిన క్రిష్‌, సోమవారం రోజు వస్తానని సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఏదేమైనా ఈ కేసులో రోజుకో కొత్త విషయంతో కీలక మలుపులు తిరుగుతోంది.

Drug Bust in Gachibowli Radisson Hotel : హైదరాబాద్‌లోని రాడిసన్ హోటల్లో మంజీరా గ్రూప్ డైరెక్టర్‌ గజ్జల వివేకానంద్‌ స్నేహితులతో కలిసి ఈ నెల 24న డ్రగ్స్‌ పార్టీ ఏర్పాటు చేశాడు. 3 గ్రాముల కొకైన్‌ తెప్పించుకొని హోటళ్లోని 2 గదుల్లో పార్టీ చేసుకున్నారు. సమాచారం అందుకున్న మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు అర్ధరాత్రి హోటల్‌కు చేరుకోగా, వారంతా అక్కడి నుంచి పారిపోయారు. గదుల్లో కొకైన్ ఆనవాళ్లు గుర్తించిన పోలీసులు, వివేకానంద్ ఇంటికెళ్లి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో డ్రగ్స్‌ తీసుకున్నట్లు వివేకానంద అంగీకరించాడు.

రాడిసన్ డ్రగ్స్​ కేసులో ఊహించని ట్విస్టులు - రేపు విచారణకు దర్శకుడు క్రిష్

రాడిసన్‌ డ్రగ్స్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం - ప్రధాన నిందితుడి నుంచి కీలక విషయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.