Illegal Mining in Telangana : తెలంగాణలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ మైనింగ్ (Illegal Minerals mining)దందాను అరికట్టేందుకు రంగం సిద్ధమైంది. లీజు తీసుకున్నది ఒకచోటయితే ఆ చుట్టుపక్కలా తవ్వకాలు సాగిస్తుండటం తవ్వితీసిన ఖనిజానికి రాయల్టీ, సీనరేజ్ చెల్లించకుండా అమ్మేసుకొని సొమ్ము చేసుకుంటుండటం ఏళ్ల తరబడిగా సాగుతోంది. ఖనిజాలను దాచేసి సాగుతున్న ఆ దందాపై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది. ఖజానాకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించి కఠినంగా వ్యవహరించాలని ఆదేశించిడంతో మైనింగ్ అధికారులు గతంలో ఎన్నడూలేని విధంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు.
లీజుప్రాంతాల్లో జరిగిన మైనింగ్, ఖనిజాల్ని రవాణా చేస్తున్న వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తుండగా పలు అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఈనెల తొలి 15 రోజుల్లోనే సగటున రోజుకు 60 చొప్పున కేసులునమోదయ్యాయి. లీజుదారులు తవ్వితీసిన ఖనిజానికి మేజర్ మినరల్ అయితే రాయల్టీ రూపంలో మైనర్ మినరల్ అయితే సీనరేజ్ పేరిట రాష్ట్ర ప్రభుత్వానికి కొంత మొత్తం చెల్లించి వేబిల్లు తీసుకోవాలి.
'అక్రమమైనింగ్ ద్వారా 600 కోట్లు ఆర్జించారు.. మీపై ఏం చర్యలు తీసుకోవాలి..?'
Illegal Minerals Mining in Telangana : అయితే పలువురు లీజుదారులు రాయల్టీ, సీనరేజ్ ఎగవేతకు పాల్పడుతూ ఖనిజాన్ని తీసి అమ్మేసుకుంటున్నారు. అనేక గనుల నుంచి వేబిల్లులు లేకుండానే తరలిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడటంతో కేసులు నమోదు చేస్తున్నారు. మరికొన్నిచోట్ల అనుమతి పొందిన లీజు స్థలాన్ని దాటేసి పక్కనున్న ప్రభుత్వ భూముల్లో అక్రమంగా కంకర, గ్రానైట్, క్వార్ట్జ్, ఇసుక వంటివాటిని తవ్వుతున్నారు. అనుమతి తీసుకున్నా పరిమితికి మించి తవ్వి తీస్తున్నారు. కొన్నిచోట్ల లీజు గడువు దాటినా యథేచ్ఛగా తవ్వకాలు సాగుతున్నాయి. అక్రమాలకు పాల్పడేవారు ప్రైవేట్ నిర్మాణాలకు వాటిని సరఫరా చేస్తున్నారు.
రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అక్రమ మైనింగ్ (Illegal Mining in Telangana) తీవ్రత అధికంగా ఉన్నట్లు గనుల శాఖ నిర్ధారించింది. ముఖ్యంగా ఆ జిల్లాల్లోని క్వారీల నుంచి కంకర తీసి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భవన నిర్మాణాలకి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోనూ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అక్రమాలను అరికట్టేందుకు గనుల శాఖ సిద్ధమవుతోంది.
సంగారెడ్డి జిల్లాలో పేదల భూములపై క్రషర్ వ్యాపారుల కబంధహస్తం
రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ వద్ద రిజిస్టర్ చేసుకున్న లారీలకే రీచ్ల నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు అనమతి ఇస్తున్నారు. లీజుప్రాంతాలు, క్వారీల నుంచి ఖనిజాల్ని తీసుకెళ్లే ప్రతి వాహనాన్ని గనుల శాఖలో రిజిస్టర్ చేసుకునే నిబంధన తీసుకురానున్నారు. ఖనిజాల్ని రవాణాచేసే వాహనాలకి జీపీఎస్ అమర్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని గనులశాఖ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక యాప్ తీసుకురానున్నట్లు తెలిసింది. మైనింగ్ లీజుప్రాంతాన్ని అక్షాంశాలు, రేఖాంశాలతో పక్కాగా గుర్తించేలా జియో కోఆర్డినేట్ చేస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. గని నుంచి ఖనిజాన్ని తీసుకెళ్లే వాహనాలు గమ్యస్థానం చేరేవరకు ట్రాకింగ్ చేయబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
mining permits: విధ్వంసానికి అనుమతి.. ఇష్టారాజ్యంగా గుత్తేదార్ల మైనింగ్