ETV Bharat / state

'కాళేశ్వరం ప్రాజెక్టు' వ్యవహారంపై ప్రభుత్వ నిర్ణయం ఏంటి : హైకోర్టు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 3, 2024, 8:58 AM IST

High Court Notices Telangana Govt on Kaleswaram : మేడిగడ్డపై సీబీఐ విచారణ జరిపించాలని దాఖలైన పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

telangana High Court
telangana High Court

High Court Notices Telangana Govt on Kaleswaram : మేడిగడ్డ పిల్లర్ల (Medigadda Barrage) కుంగుబాటు కేసును సీబీఐకి అప్పగించడం, కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు లిమిటెడ్‌ సేకరించిన నిధుల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. రాత పూర్వకంగా రెండు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జయశంకర్‌ భూపాపల్లి జిల్లా మహాదేవ్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు సీబీఐకి బదలాయించేలా ఆదేశించడం సహా ఆ విషయంపై చర్యలు తీసుకునేలా తెలంగాణ సర్కార్‌ను ఆదేశించాలంటూ కాంగ్రెస్ నేత జి.నిరంజన్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

దీనిపై నంబర్‌ కేటాయించేందుకు రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. మేడిగడ్డతో పాటు ఇతర బ్యారేజీల భద్రతకు అన్ని చర్యలు తీసుకునేలా జాతీయ డ్యామ్ భద్రతా మండలికి ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్‌ కోరారు. కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సేకరించిన కోట్ల రూపాయల వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని పిల్‌లో తెలిపారు. దీనిపై ప్రభుత్వ వివరణ కోసం రెండు వారాల గడువు కావాలని అదనపు అడ్వకేట్‌ జనరల్‌ కోరగా, ధర్మాసనం అనుమతిస్తూ విచారణ వాయిదా వేసింది.

'ఆ ఉద్యోగాల్లో మహిళలకు 100% రిజర్వేషన్- అది రాజ్యాంగ ఉల్లంఘనే'

మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) అక్రమాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేలా సీబీఐకి ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. న్యాయవాది బి.రాంమోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ సూరేపల్లి నంద విచారణ చేపట్టారు. కాళేశ్వరానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలతో గత సెప్టెంబర్‌లో ఫిర్యాదు చేసినా సీబీఐ కేసు నమోదు చేయలేదని పిటిషనర్‌ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. పిటిషన్‌లో ప్రజాప్రయోజనాలకు సంబంధించిన అంశాలూ ఉన్నందున పిల్‌తో జత చేసి ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని న్యాయమూర్తి సునంద రిజిస్ట్రీని ఆదేశించారు.

High Court Notices to Govt on Toddy Shops in Hyderabad : మరో కేసుకు సంబంధించి హైదరాబాద్‌ సహా పట్టణ ప్రాంతాల్లో కల్లు దుకాణాల ఏర్పాటుకు అనుమతించడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 50 కిలోమీటర్ల పరిధిలో తాటిచెట్లు అందుబాటులో లేకున్నా హైదరాబాద్‌తో పాటు పట్టణ ప్రాంతాల్లో కల్లు దుకాణాలను అనుమతిస్తూ, 2014లో ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ సుపరిపాలన వేదిక దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ చేపట్టింది.

ధరణి పోర్టల్​ను కొనసాగిస్తారా? లేదా? - స్పష్టత ఇవ్వండి : హైకోర్టు

కల్తీ కల్లు వల్ల పలువురు మృతి చెందడంతో 50 కిలోమీటర్ల పరిధిలో తాటివనాలు లేని ప్రాంతాల్లో ప్రభుత్వం కల్లు దుకాణాలు మూసివేసిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అయితే సర్కార్ తిరిగి 100 దుకాణాల ఏర్పాటుకు అనుమతించిందని గుర్తు చేశారు. ఆ జీవోను కొట్టివేయడం సహా ప్రభుత్వం కల్లు దుకాణాలను మూసివేతకు చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం సీఎస్‌, రెవెన్యూ, ఎక్సైజ్‌శాఖల ముఖ్య కార్యదర్శులు, ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ కమిషనర్లకు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్

మున్సిపల్ ఛైర్మన్ల అవిశ్వాసాల జోక్యానికి హైకోర్టు నిరాకరణ - సర్పంచులకు సైతం చుక్కెదురు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.