ETV Bharat / state

సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదే - ఉద్యోగులకు సీఎం రేవంత్‌రెడ్డి హామీ

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 10, 2024, 7:18 PM IST

Updated : Mar 10, 2024, 10:36 PM IST

CM Revanth Reddy Meeting Employees Unions : విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల పోరాటంతోనే తెలంగాణ సిద్ధించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రక్తం చిందించకుండా తెలంగాణ సాధించామని మాజీ సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతారని మండిపడ్డారు. ఆయన కుటుంబంలో ఎవరి రక్తం చిందలేదేమో కానీ, రాష్ట్రం కోసం కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వారు రక్తాన్ని చిందించారన్నారు. శ్రీకాంతాచారి లాంటి వారు ఉద్యమంలో అమరులయ్యారని అన్నారు. తెలంగాణ బాపు అని కేసీఆర్ తనకు తానే చెప్పుకుంటున్నారని, అలా చెప్పుకోవడానికి కనీసం పోలికైనా ఉండాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ బాపు సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ అని, ఆయనను గౌరవించకపోతే సమాజం మనల్ని క్షమించదని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

CM Revanth Meeting Employees Unions
CM Revanth Meeting Employees Unions

CM Revanth Reddy Meeting Employees Unions : పదేళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం రాలేదని, వారి ఆవేదన వినేవారు లేక ఇబ్బందులు పడ్డారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో పొందుపరిచిందని చెప్పారు వాటిని పరిష్కరించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని రేవంత్‌రెడ్డి వివరించారు.

ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ ఉద్దేశం: సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth on Employees Unions : ఇన్నాళ్లు సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా ఉన్నది, అధికారంలో ఉన్నది కేసీఆర్ కుటుంబమేనని రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) విమర్శించారు. నిర్బంధాలతో పాలన సాగిస్తామని అనుకోవడం వారి భ్రమని మండిపడ్డారు. ఎంసీహెచ్‌ఆర్డీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. సుమారు మూడున్నర గంటల పాటు సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్‌బాబు, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంలతో పాటు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

'ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం. దీనిపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వ పాఠశాలల్లో కిందిస్థాయి సిబ్బందిని నియమిస్తాం. ఉద్యోగుల డీఏతో పాటు ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మంత్రివర్గ ఉపసంఘం శాఖల వారీగా సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటుంది. సంఘాలతో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోమని' రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌తో మాట్లాడి ప్రొఫెసర్ కోదండరాంను (Kodandaram) శాసనమండలికి పంపుతామని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆయన ఎమ్మెల్సీగా ఉంటే మండలికి గౌరవంగా ఉంటుందని అన్నారు. ఉద్యోగుల డీఏతో పాటు ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు విశ్వాసం కల్పించడానికే ఈ సమావేశం నిర్వహించామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

"ఇప్పటికే మీ సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాం. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఉద్యోగుల తరపున ప్రాతినిధ్యం ఉండాలి. తెలంగాణను ఏ ఒక్క రాజకీయ పార్టీ తామే సాధించామని చెప్పుకున్నా అది అసంబద్ధం. మూడు నెలల్లో 30,000ల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఒక్కో చిక్కుముడిని పరిష్కరిస్తూ ఉద్యోగాల భర్తీని ముందుకు తీసుకెళ్లాం. 11,000ల పైచిలుకు ఉద్యోగాలతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశాం. - రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి

రోజుకు 18 గంటలు పని చేస్తూ పాలనను గాడిలో పెడుతున్నామని రేవంత్‌రెడ్డి వివరించారు. తమ సర్కార్ మూడు నెలలు ఉంటుందని ఆరు నెలలు ఉంటుందని కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే తమాషా అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వమని తెలిపారు. పదేళ్లు హస్తం పార్టీ అధికారంలో ఉండటం ఖాయమని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

9 5శాతం మంది ఉద్యోగులు నిజాయితీగా పనిచేస్తున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. సంఘాలపై కక్షగట్టి వాటిని రద్దు చేస్తే ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేశారని తెలిపారు. శాఖల వారీగా సంఘాలు ఉండాల్సిందేనని చెప్పారు. వివిధ శాఖల్లో ఉన్న 1,100 మంది రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

ఫార్మా, లైఫ్‌సైన్స్‌ రంగ విస్తరణకు కట్టుబడి ఉన్నాం : సీఎం రేవంత్‌ రెడ్డి

'కేంద్రంతో బేషజాలకు వెళ్లం - అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హైదరాబాద్‌ అభివృద్ధి

Last Updated :Mar 10, 2024, 10:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.