ETV Bharat / state

తుది దశకు చేరిన చంద్రబాబు ఎన్నికల ప్రచారం - సాయంత్రం శ్రీవారి దర్శనం - chandrababu naidu election campaign

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 11, 2024, 12:58 PM IST

Chandrababu Naidu Election Campaign: టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం తుది దశకు చేరింది. విధ్వంస పాలనకు చరమగీతం పాడి ఏపీని మళ్లీ గాడిలో పెడదాం అనే నినాదంతో కాలికి బలపం కట్టుకుని ఆయన రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. నేటితో ప్రచార పర్వానికి ముగింపు పలకనున్నారు. సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకోనున్నారు.
chandrababu election campaign
chandrababu election campaign (ETV Bharat)

handrababu Naidu Election Campaign: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు రికార్డు స్థాయి పర్యటనలు జరిపారు. ఏడు పదుల వయస్సు దాటినా రెట్టింపు కసితో అలుపెరగని యువకుడిలా గతం కంటే ఎక్కువగా సభలు, రోడ్‌షోలు, సమావేశాల్లో పాల్గొన్నారు. విరామం, విశ్రాంతి అనేది లేక్కచేయకుండా రోజుకు 3 నుంచి 5 సభల్లో పాల్గొంటూనే, అంతర్గత సమావేశాలు, కూటమి పార్టీలను సమన్వయం చేసుకున్నారు. ఎండ, వాన లెక్క చేయకుండా వందల, వేల కిలోమీటర్లు అవలీలగా ప్రయాణం చేస్తూ ప్రచారం సాగించారు.

ఇతర రాజకీయ పార్టీల నేతలకు భిన్నంగా చంద్రబాబు ప్రచారం సాగిందనే చెప్పాలి. ఒక్క ప్రజాగళం పేరుతోనే దాదాపు 90 నియోజకవర్గాల్లో సభలు, రోడ్‌షోలు నిర్వహించారు. కొవిడ్‌ సమయంలో తప్ప ఐదు ఏళ్లు ప్రజల్లోనే మమేకమై గడిపారు. ప్రజా సమస్యలపై పోరాటంలో ప్రతి ప్రాంతంలో పెద్ద ఎత్తున పర్యటనలు చేపట్టారు. ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై అలుపెరగని పోరాటం చేశారు. పన్నులు, విద్యుత్‌ ఛార్జీల పెంపు, ధరల మంటపై రెండేళ్ల క్రితం బాదుడే బాదుడుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు.

2022లో 19 నియోజకవర్గాల్లో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించిన చంద్రబాబు, గత ఏడాది ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో విస్తృత పర్యటనలు జరిపారు. 29 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో ప్రజా చైతన్య యాత్రలు చేపట్టారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై కర్నూలు నుంచి పాతపట్నం వరకు 13 జిల్లాల్లో 3వేల కిలోమీటర్లకు పైగా రోడ్డు మార్గాన పది రోజుల పాటు నిర్విరామంగా పర్యటించారు. ప్రాజెక్టుల వారీగా జగన్‌ విధ్వంసాన్ని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లతో ఎండగట్టారు.

ఉద్యోగులెవరూ జగన్​కు ఓటు వేయలేదు- నేడు పాసుపుస్తకాల నకళ్ళు దహనానికి చంద్రబాబు పిలుపు - cbn on Postal Ballot Voting

చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా గత ఏడాది సెప్టెంబర్‌లో వైఎస్సార్సీపీ కేసులు పెట్టి వేధించడంతో పాటు అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెట్టి నిర్భందించింది. బెయిల్‌పై విడుదల అయ్యక మళ్లీ రోడ్డెక్కిన చంద్రబాబు, మునుపటి కంటే గట్టిగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం సాగించారు. గత ఏడాది జనవరి 5 నుంచి రా కదలి రా పేరుతో 25 పార్లమెంట్‌ నియోజకర్గాల్లో చంద్రబాబు భారీ సభలు నిర్వహించారు. మినీమేనిఫేస్టోలో భాగంగా ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఎన్నికల సమయంలో మార్చి 27 నుంచి ప్రజాగళం పేరుతో విస్తృత పర్యటనలు శ్రీకారం చుట్టారు.

తుపాన్ల సమయంలో క్షేత్రస్థాయికి వెళ్లి రైతులు, బాధిత ప్రజలను పరామర్శించారు. అకాల వర్షాల సమయంలో గోదావరి జిల్లాల్లో 4 రోజులు పాటు బస చేసి మరీ ధాన్యం కొనుగోళ్ల కోసం పోరాటం చేశారు. నేటితో ఎన్నికల ప్రచారం ముగిసేసరికి దాదాపు 90 నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలు పూర్తిచేసుకోనున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి చేపట్టిన పర్యటనలను విశ్లేషిస్తే 4 నెలల్లో 114 నియోజవకర్గాల్లో చంద్రబాబు పర్యటనలు సాగాయి. ప్రత్యర్థి పార్టీల ప్రచారం కనీసం ఈ దరి దాపుల్లో కూడా లేదు.

జగన్‌ పాలన విభజన కంటే రెట్టింపు బాధ - ప్రభుత్వ వ్యతిరేకతలో ఫ్యాన్‌ కనుమరుగు: చంద్రబాబు - Chandrababu Naidu Interview

ప్రచార పర్వం చివరి రోజుకు చేరినందున నిన్న, ఇవాళ ఆరు సభలను చంద్రబాబు చేపట్టారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మాచర్ల పర్యటన రద్దు అయినప్పటికి వీడియో సందేశం ద్వారా బహిరంగ సభకు హాజరైన ప్రజలతో మాట్లాడగలిగారు. గన్నవరంలో జోరు వర్షంలోనూ తడిసి ముద్దవుతూ చంద్రబాబు ప్రసంగించారు. తన కోసం వేచి చూస్తున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తల కోసం కార్యక్రమం రద్దు చేయకుండా వర్షంలోనే ప్రసంగిస్తూ ఉత్సాహాన్ని నింపారు.

దాదాపు రెండు గంటల సేపు ఏకధాటిగా వర్షం కురుస్తున్నా, భద్రతా సిబ్బంది వారిస్తున్నా, వర్షంలోనే తడుస్తూ సభ ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయన వచ్చేంత వరకు జనం తడుస్తూ వేచి చూశారు. దాదాపు 30 నిమిషాల సేపు ప్రసంగించారు. తన కోసం వర్షంలో వేచి చూడటం, భారీ వర్షాన్ని లెక్క చేయకుండా దుకాణాల కింద, భవనాలపై,ఆటోల్లో వాహనాల్లో వేచి చూసిన వారిని చూసి సంతోషం వ్యక్తం చేశారు.

మోదీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల దూకుడు - ఎప్పుడు కలిసినా విజయ కేతనమే - TDP Janasena Bjp Friendship in AP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.