ETV Bharat / sports

మూడో టెస్ట్​కు సర్వం సిద్ధం - రాజ్​కోట్ ఎవరిదో?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 15, 2024, 7:29 AM IST

Updated : Feb 15, 2024, 9:24 AM IST

IND VS ENG Third Test : ఇంగ్లాండ్​తో జరుగుతోన్నటెస్టు సిరీస్‌లో కీలక సమరానికి వేళైంది. మూడో టెస్ట్ మ్యాచ్ నేటి(ఫిబ్రవరి 15) నుంచి ప్రారంభం కానుంది. మిడిల్‌ ఆర్డర్‌లో అనుభవం లోపించడం టీమ్‌ఇండియాకు పెద్ద సవాల్‌ అనే చెప్పాలి. దేశవాళీ పరుగుల యంత్రం సర్ఫరాజ్‌ ఖాన్‌ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేయడం విశేషం.

మూడో టెస్ట్​కు సర్వం సిద్ధం - రాజ్​కోట్ ఎవరిదో?
మూడో టెస్ట్​కు సర్వం సిద్ధం - రాజ్​కోట్ ఎవరిదో?

IND VS ENG Third Test 2024 : చాలా కాలంగా సొంతగడ్డపై టీమ్‌ ఇండియా తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. అయితే ఈ సారి మాత్రం ఇంగ్లాండ్‌ నుంచి గట్టి పరీక్షను ఎదుర్కొంటోంది. తొలి టెస్టును కోల్పోయింది. అయితే విశాఖ టెస్టులో మాత్రం గెలిచి సిరీస్‌ను సమం చేసింది. పిచ్‌లు స్పిన్‌కు సహకరించని నేపథ్యంలో రెండు జట్ల మధ్య మ్యాచ్​ మరింత ఆసక్తికరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లోనే రాజ్‌కోట్‌ వేదికగా గురువారం మూడో టెస్ట్ మ్యాచ్​ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఇరు జట్ల బలాబలాలను తెలుసుకుందాం.

మిడిల్‌ ఆర్డర్ సమస్య : హైదరాబాద్‌లో ఓటమిని అందుకున్న భారత జట్టు ఆ వెంటనే కోలుకుని యశస్వి జైస్వాల్‌, బుమ్రాల అదిరే ప్రదర్శనతో విశాఖపట్నంలో పైచేయి సాధించింది. తద్వారా సిరీస్‌ను సమం చేసింది. అయితే మిడిల్‌ ఆర్డర్‌ ప్రదర్శనపై మాత్రం ఆందోళన కొనసాగుతోంది. అనుభవం లేని బ్యాటర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కోహ్లీ, రాహుల్‌ దూరంతో కాస్త ఇబ్బందిని ఎదుర్కొంటున్న భారత్‌కు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఫామ్‌ కూడా తోడుగా ఉంటట్లేదు. అతడు భారీ స్కోర్లను నమోదు చేయలేకపోతున్నాడు. అతడు సంయమనంతో ఆడాల్సిన అవసరం ఉంది. రాహుల్‌ గైర్హాజరీలో సర్ఫరాజ్‌ ఖాన్‌ అరంగేట్రం చేయనున్నాడు. ఇతడితో పాటు రజత్‌ పటీదార్‌ మిడిల్‌ ఆర్డర్‌ స్థానాలను భర్తీ చేయనున్నారు. వీళ్లు అనుభజ్ఞులు కాదు కాబట్టి ఇంగ్లాండ్​కు కలిసొచ్చే అవకాశం ఉంది.

బ్యాటుతో వికెట్‌కీపర్‌ కేఎస్‌ భరత్‌ విఫలమైన నేపథ్యంలో అతడి స్థానంలో ఉత్తర్‌ప్రదేశ్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌ ఆడే ఛాన్స్ ఉంది. జురెల్‌ దేశవాళీ క్రికెట్​ 15 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 46.47 యావరేజ్​తో పరుగులు సాధించాడు. రాజ్‌కోట్‌లో పిచ్‌ ఎలాగో స్పిన్‌కు విపరీతంగా సహకరించదు. అది అరంగేట్రం జురెల్‌కు కలిసొస్తుంది. జడేజాపై భారీ అంచనాలే ఉన్నాయి. అతడు బంతితో మాత్రమే కాదు కొత్త కుర్రాళ్లు వచ్చిన నేపథ్యంలో మిడిల్‌ ఆర్డర్‌లో మరింత బాధ్యత తీసుకోవాల్సి. అయితే యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌ మంచి ఫామ్‌లో ఉండటం టీమ్‌ఇండియాకు సంతోషాన్నిచ్చే అంశం.

బౌలింగ్‌లో మరోసారి బుమ్రా దూకుడు చూపించడం భారత్‌కు ఎంతో ముఖ్యం. మొదటి రెండు టెస్టుల్లో అతడు గొప్ప ప్రదర్శన చేశాడు. స్పిన్నర్లు ఆశించినంతగా రాణించని నేపథ్యంలో సిరీస్‌లో ఇప్పటివరకు భారత్‌ను ఆదుకుంది అతడే. అతడితో కలిసి సిరాజ్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌ బాధ్యతలను పంచుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు ఇంగ్లాండ్‌ స్పిన్నర్ల కన్నా వెనుకబడ్డ భారత స్పిన్నర్లు ఈ మ్యాచ్‌లోనైనా రాణించాల్సిన అవసరం ఉంది. జడేజా, అశ్విన్‌లకు తోడుగా కుల్‌దీప్‌ మూడో స్పిన్నర్‌గా ఆడే ఛాన్స్​లు ఉన్నాయి.

ఇద్దరు పేసర్లతో : గత టెస్టులో ఓడినప్పటికీ ఇంగ్లాండ్‌ ఆత్మవిశ్వాసంతో ఈ రాజ్‌కోట్‌ టెస్ట్​కు సిద్ధమైంది. బ్యాటింగ్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై బజ్‌బాల్‌ వ్యూహాన్ని కొనసాగించేలా కనిపిస్తోంది. తొలి రెండు టెస్టుల్లో ఒకే పేసర్‌తో బరిలోకి దిగిన ఆ జట్టు ఈ సారి ఇద్దరు పేసర్లను తీసుకుంది. స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ను తప్పించి మార్క్‌ వుడ్‌కు అవకాశం ఇచ్చింది. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఎలాంటి మార్పులూ లేవు. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌కు ఇది 100వ టెస్టు కావడం విశేషం.

టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకోవడానికి అశ్విన్‌కు మరో ఒక్క వికెట్​ అవసరం.

టెస్టుల్లో 700 వికెట్లను చేరుకోవడానికి అండర్సన్‌ మరో 5 వికెట్లు తీయాలి.

తుది జట్లు భారత్‌ (అంచనా): రోహిత్‌, యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, రజత్‌ పటీదార్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, జడేజా, ధ్రువ్‌ జురెల్‌/భరత్‌, అశ్విన్‌, కుల్‌దీప్‌, బుమ్రా, సిరాజ్‌

ఇంగ్లాండ్‌ : క్రాలీ, డకెట్‌, ఒలీ పోప్‌, జో రూట్‌, బెయిర్‌స్టో, స్టోక్స్‌, ఫోక్స్‌, రెహాన్‌ అహ్మద్‌, హార్ట్‌లీ, మార్క్‌ వుడ్‌, అండర్సన్‌.

క్రికెట్ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్ - రోహిత్‌ సారథ్యంలోనే టీ20 ప్రపంచకప్‌

హార్దిక్‌ పాండ్యకు ఊరట - 'రంజీల్లో ఆడాల్సిన అవసరం లేదు'

Last Updated :Feb 15, 2024, 9:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.