ETV Bharat / politics

ప్రాసల నేత 'పైసా'చికత్వం - అ'ధర్మ' బాటలో వైఎస్సార్సీపీ నేత అరాచకాలు - YSRCP Leaders Irregularities

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 11:30 AM IST

irregularities
irregularities

YSRCP Leaders Irregularities: ఆ ప్రజాప్రతినిధి పేరులోనే ధర్మం ఉంది. అలాగని ఆయన ధర్మమార్గంలోనే నడుస్తున్నారనుకుంటే పొరబాటే. ధనం కోసం ధర్మాన్ని విడిచారు. అధర్మ బాటలో అరాచకాలు సృష్టిస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో ప్రతి పనికో రేటు ఉంటుంది. బేరసారాలు, వసూళ్లు నిత్యకృత్యం. పాటలతో జగన్‌ భజన చేసే అధర్మ ప్రభువు లీలలు అన్నీఇన్నీ కావు.

అనకాపల్లి జిల్లాలో ప్రాసల నేత 'పైసా'చికత్వం- అ'ధర్మ' బాటలో అరాచకాలు సృష్టిస్తున్న వైఎస్సార్సీపీ నేత

YSRCP Leaders Irregularities: ఉత్తరాంధ్ర ముఖద్వారంలోనే ఆ నియోజకవర్గం ఉంటుంది. కొత్త జిల్లా కేంద్రం అనకాపల్లికి మరింత దగ్గర. పేరెన్నికగన్న సహకార చక్కెర కర్మాగారం ఆ 'చోట'వరంగా ఉంది. శారదా, పెద్దేరు, గోస్తనీ, ఒంటేరు నదులు ఈ ప్రాంతం మీదుగా ప్రవహిస్తుంటాయి. ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధి చేతల్లో కన్నా ప్రసంగాల్లో దిట్ట. వైఎస్సార్సీపీలో మిగిలిన నేతలంతా మాటలతో జగన్‌ భజన చేస్తే ఆ నేత మాత్రం పాటలు అందుకుంటారు.

అప్పుడప్పుడూ ముఖానికి రంగులద్దుకుని నాటక ప్రదర్శనలూ ఇస్తుంటారు. ఇంత ప్రతిభ ఉన్న ఆయన ధనం కోసం ధర్మాన్ని వదిలేశారు. ఈయన నియోజకవర్గమంతా వెనకబడిన ప్రాంతం. అధిక శాతం ప్రజలు చిన్నాచితకా పనులు చేసుకుంటూ సాధారణ జీవితం గడుపుతుంటారు. అలాంటి చోట కూడా 'పైసా'చికత్వంతో జనాన్ని గగ్గోలు పెట్టిస్తున్నారు. మద్యం దుకాణంలో పనిచేసే సిబ్బంది నుంచి అంగన్‌వాడీ కొలువుల భర్తీ వరకు అన్నీ బేరసారాలే.

రాష్ట్రంలో జె-ట్యాక్స్‌ - మార్కాపురంలో అదనంగా కె-ట్యాక్స్‌ - అక్రమాల్లో అన్నదమ్ములు పోటీ - YSRCP Leaders Irregularities

ఉద్యోగుల బదిలీలకూ ముడుపులు చెల్లించాల్సిందే. విశాఖలోనే నివాసం ఉంటూ చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వచ్చి వెళ్తుంటారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా అధికారం చెలాయిస్తుంటారు. పద్యాలు, పాటలు పాడే ఆ ప్రజాప్రతినిధి గ్రామాల్లో నారదుడి అవతారం ఎత్తుతున్నారు. ఊళ్లలో ఉండే ఉండే చిన్న స్థాయి నేతల మధ్య తగువులు పెట్టి పబ్బం గడుపుకుంటున్నారు.

పెద్దేరు నది నుంచి ఇసుక తవ్వకాలకు అనుమతి లేదు. అలాంటి చోట ఒక పంచాయతీ కార్యదర్శిని నియమించి ఇసుక అక్రమ రవాణాకు తెరలేపారు. ఈ దందాపై ప్రతిపక్ష నాయకులు గొడవ చేయడంతో ఆ అక్రమ వ్యవహారానికి కొన్నాళ్ల కిందట తెరపడింది. తర్వాత ఆ కార్యదర్శిని ఇన్‌ఛార్జిగా మేజర్‌ పంచాయతీకి బదిలీ చేశారు. ఈ ప్రజాప్రతినిధి అండతో అక్కడా పెద్దఎత్తున వసూళ్లు మొదలెట్టారు. ఇంటి నిర్మాణ అనుమతి కావాలంటే ముడుపులు సమర్పించుకోవాల్సిందే. తమ పార్టీ మనుషులైనా సరే లేఅవుట్‌ వేస్తే కచ్చితంగా వాటా ఇవ్వాల్సిందే.

ఎవరైనా ససేమిరా అంటే సదరు లేఅవుట్‌ ముందు ఆ స్థలానికి పంచాయతీపరంగా ఎటువంటి అనుమతుల్లేవంటూ బోర్డులు పెట్టిస్తారు. సొమ్ములందిన తర్వాతే ఆ హెచ్చరిక బోర్డులను తీసేయిస్తారు. ఇలా కార్యదర్శిని అడ్డం పెట్టుకుని ముక్కుపిండి మరీ వసూలు చేస్తుండటంతో నూతన గృహాల నిర్మాణాలు అంటేనే చోడవరంవాసులు గాబరా పడుతున్నారు. పనులు చేయకున్నా పంచాయతీ ఖాతా నుంచి 10 లక్షలు డ్రా చేసేశారని తెలిసి వార్డు సభ్యులు తిరుగుబాటు చేశారు.

దీంతో అందరికీ దుకాణాలు నిర్మించుకునేందుకు పంచాయతీ స్థలాలు ఇస్తామంటూ ఆ ప్రజాప్రతినిధి తాత్కాలికంగా వారికి సర్దిచెప్పారు. ఆయన అనుచరుడు హోటల్‌ కట్టుకుంటానంటే చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్​ ఎదురుగా ఉన్న పంచాయతీ స్థలాన్ని కట్టబెట్టేశారు. ఇందులో న్యాయస్థానం ఆదేశాలూ ఉల్లంఘించారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఇంటి నిర్మాణం మొదలుపెట్టిన ఆ ప్రజాప్రతినిధి అందుకోసం విరాళాలు సేకరించే కార్యక్రమం చేపట్టారు.

నిధుల సమీకరణ బాధ్యతను ఓ కార్పొరేషన్‌ కమిటీ సభ్యుడికి అప్పగించారు. పార్టీ కార్యక్రమమైనా, సొంత పని అయినా పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌వోలు, అధికారులతోనే ఖర్చు చేయిస్తారు. ఇటీవల బుచ్చయ్యపేట మండలంలో సామాజిక సాధికారిక బస్సు యాత్రను నిర్వహించారు. ఈ సభ నిర్వహణకు స్థానిక పంచాయతీ నుంచి 30 వేలు బిల్లు పెట్టగా కొంతమంది వార్డు సభ్యులు వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గారు.

విశాఖలో అధికార పార్టీ కీలక నేత సమావేశానికి జనాన్ని తరలించే ఖర్చులో సగం వరకూ కార్యకర్తలతోనే పెట్టించారు. ఈ నియోజకవర్గంలో దాదాపు రోడ్లన్నీ గోతులమయమే. చోడవరం నుంచి పీఎస్‌పేట మీదుగా కేబీ రోడ్డు బాగు చేయిస్తానని హామీ ఇచ్చినా అసలు పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రధాన రహదారి బీఎన్‌ రోడ్డులో ప్రయాణమంటేనే జంకాల్సిన పరిస్థితి. తన ఇలాకాలో రోడ్ల దుస్థితి ఎలా ఉన్నా ఆయన కార్యాలయానికి మాత్రం చక్కగా సిమెంటు రోడ్డును వేయించుకున్నారు. ఇందుకోసం గడప గడపకు కార్యక్రమంలో భాగంగా వచ్చిన నిధుల్లోంచి 25 లక్షలు వినియోగించారు. వర్షాకాలంలో వరద ముంచెత్తకుండా ఆయన కార్యాలయం పక్కనే ఉన్న కాల్వ కట్టనూ బలోపేతం చేయించుకున్నారు.

నాడు అప్పులతో సతమతం - నేడు సిరులతో కళ కళ! - YSRCP Leader Irregularities

ఆ ప్రజాప్రతినిధికి నలుగురు అన్నదమ్ములు. అందులో ఒకరు ఈయన వ్యవహారాలన్నీ చూసుకుంటూ షాడోగా ఎదిగారు. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ముందు తమ్ముడిని కలిసిన తర్వాతే ఫైల్‌ ముందుకు కదులుతుంది. ముడుపులు ముట్టజెప్పడమే కాదు ఆయన చెప్పిన చోట చిట్టీలు కట్టాలి. ప్రభుత్వ ఉద్యోగులు, పార్టీ కార్యకర్తలతోనూ బలవంతంగా చిట్టీలు కట్టించి కమీషన్లు దండుకుంటున్నారు. పట్టణంలోని నాలుగు ప్రధాన దేవాలయాలకూ ప్రజాప్రతినిధి తమ్ముడే గౌరవ అధ్యక్షుడు.

ఆ ఆలయాలపై పెత్తనం చెలాయిస్తుంటారు. కనిపించిన స్థలాలను కబ్జా చేయడంలోనూ ఆయన తమ్ముడు నేర్పరి. 'యథా రాజా తథా ప్రజా' అన్నట్లు ప్రజాప్రతినిధి అనుచరులూ సెటిల్‌మెంట్లు, ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నారు. రావికమతానికి చెందిన యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఓ ప్రధాన అనుచరుడు లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. ఆ ఉద్యోగాలు ఎంతకూ రాకపోవడంతో బాధితులందరూ సదరు ప్రజాప్రతినిధిని బహిరంగంగానే నిలదీశారు.

ఈ ఊహించని పరిణామానికి ఖంగుతిన్న ఆయన వారిపై కేకలు వేసి దుర్భాషలాడారు. మరో అనుచరుడు ఏకంగా మండల పరిషత్‌కు చెందిన స్థలాన్నే ఆక్రమించాడు. గ్రానైట్‌ క్వారీ యజమానుల నుంచి ముక్కుపిండి మరీ నెలవారీగా మామూళ్లు వసూళ్లు చేస్తున్నారు. బీఎన్‌ రోడ్డు వేయడానికి వచ్చిన గుత్తేదారు నుంచి భారీగా ముడుపులు డిమాండ్‌ చేయడంతోనే పనుల్లో జాప్యం జరుగుతోందనే ఆరోపణలున్నాయి. ఇక్కడ చేపట్టే ఏ అభివృద్ధి పనిలోనైనా ఈ ప్రజాప్రతినిధికి కమీషన్‌ అందాల్సిందే. అవి వసూలు చేసే బాధ్యతను నాలుగు మండలాలకు చెందిన అధికారులకే అప్పజెప్పడం ఆ ప్రజాప్రతినిధి తెంపరితనానికి నిదర్శనంగా నిలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.