ETV Bharat / state

పల్నాడు జిల్లాలో 'కుటుంబ అవినీతి కథా చిత్రం' - ఇసుకేస్తే రాలనంత అవినీతి!

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 19, 2024, 7:24 AM IST

YSRCP Leaders Sand Mafia in Palnadu District: పరమేశ్వరుడి నామాల్లో ఒక పేరు పెట్టుకున్నారు ఆ ప్రజాప్రతినిధి. కానీ ఆయన చేసేవి మాత్రం పరమ దుర్మార్గమైన పనులు. అంతులేని ధన దాహంతో కృష్ణ నదిని తోడేస్తున్నారు. ఇసుకలో కోట్లాది రూపాయలు జల్లెడ పట్టుకుంటున్నారు. ఈ దోపిడీపర్వంలో 'అన్న'కూ భాగముంది. ఆ ప్రజాప్రతినిధి అక్రమాల్లో ఆయన భార్య, కుమారుడు తోడూనీడలా ఉంటూ వ్యవహారాలు చక్కపెడుతున్నారు. పల్నాడు జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గంలో నిత్యం ప్రదర్శితమవుతున్న 'కుటుంబ అవినీతి కథా చిత్రం'లో దౌర్జన్యాలు, దోపిడీ, సహజవనరుల మేత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

YSRCP_Leaders_Sand_Mafia_in_Palnadu_District
YSRCP_Leaders_Sand_Mafia_in_Palnadu_District

పల్నాడు జిల్లాలో 'కుటుంబ అవినీతి కథా చిత్రం' - ఇసుకేస్తే రాలనంత అవినీతి!

YSRCP Leaders Sand Mafia in Palnadu District : పల్నాడు జిల్లాలోని ఒక కీలక నియోజకవర్గానికి ఆయన స్థానికేతరుడు. కానీ ప్రజలు ఆదరించడంతో ముఖ్య ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు అక్రమాల కొండగా రూపాంతరం చెంది జనానికి గుదిబండలా మారారు. ఇసుక, మట్టి, బినామీ లారీలు, కాంట్రాక్టులు, అటవీ భూముల ఆక్రమణ, బెదిరింపులు, దాడులు, వేధింపులు ఇలా చెప్పుకొంటూపోతే ఈయన లీలలు చాలానే ఉన్నాయి. పార్టీ అధికారంలోకి రాగానే ఆయన కన్ను కృష్ణా నది ఇసుకపై పడింది. ఇసుక కాంట్రాక్టు సంస్థపై తన అనుచరులతో తిరుగుబాటు చేయించి ఉమ్మడి గుంటూరు జిల్లాలో తవ్వకాలను చేజిక్కించుకున్నారు. ప్రజాప్రతినిధి కుమారుడు, ఆయన మిత్రులు ఈ దందాను పర్యవేక్షించడానికి గుంటూరులో కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. ఇసుక రవాణాకు ఏకంగా నదిలోనే రోడ్డు వేయించారు. ఇందుకోసం కృష్ణా పక్కనే వేంకటేశ్వరుడు కొలువై ఉన్న పవిత్రమైన కొండను తవ్వి రాళ్లు, మట్టిని తీసుకెళ్లారు.

నదీ ప్రవాహానికి అడ్డుకట్ట: ఇసుక తవ్వకాల పేరిట కృష్ణా నదీలో అడ్డకట్ట వేసి ప్రవాహ గతినే మార్చేశారు. వరదల సమయంలోనూ సొమ్ము చేసుకోవాలనే ఆలోచనత నదీ తీరంలో ఇసుక కొండలను సృష్టించారు. చింతపల్లి, కొత్తపల్లి, చామర్రు, కోనూరు, మల్లాది, దిడుగు, ముత్తాయపాలెం, అమరావతి, వైకుంఠపురం, ప్రకాశం బ్యారేజీకి దిగువనున్న గుండిమెడ, పెదకొండూరు, గొడవర్రు, అత్తలూరివారిపాలెం, వల్లభాపురం, మున్నంగి, పిడపర్తిపాలెం, బొమ్మువానిపాలెం, గాజుల్లంక, పెదలంక ఇసుక రీచ్‌లలో రాత్రిపగలు తవ్వకాలు కొనసాగించారు.

ఇసుక కాంట్రాక్టులతో వేల కోట్లు దోచుకున్న వైఎస్సార్సీపీ నేతలు : పట్టాభి

కేసులతో బెదిరింపులు : నదీ తీర గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగితే కేసుల పేరుతో బెదిరించారు. రోజూ వేయి లారీలకుపైగా ఇసుకను తరలించారు. పరిమితికి మించి నింపుతూ అదనంగా వసూలు చేశారు. ఒక్కో రీచ్‌ నుంచి ఇసుక తవ్వకాల ద్వారా రోజుకి 10 లక్షల మేర అక్రమాదాయం పొందారు. ఈ లెక్కన 10 రీచ్‌లకు కలిపి రోజుకి కోటి చొప్పున నెలకు 30 కోట్లు పొందారు. 16 నెలలపాటు నిరాటంకంగా ఇసుక తవ్వకాలు సాగించడం ద్వారా 480 కోట్లు అక్రమంగా ఆర్జించారు. అందులో వైకాపా పెద్దలకు 320 కోట్లు చెల్లించి ఆయన 160 కోట్లు పొందారనే చర్చ జోరుగా సాగుతోంది.

ట్రాన్స్​పోర్టు సంస్థ ఏర్పాటు చేసి: ఇసుక రవాణాను సైతం ఈ ప్రజాప్రతినిధి పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. తన కుమారుడి మిత్రుడు, అతని బంధువు పేర్లతో ఒక ట్రాన్స్‌పోర్టు సంస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా నాడు-నేడు, జగనన్న కాలనీలకు ఉచిత ఇసుకను తరలించారు. లారీలకు సీరియల్‌ లేకుండా నేరుగా రీచ్‌లోకి వెళ్లి నింపుకొచ్చేవి. ఇందులో కొన్నింటిని లెక్కల్లో చూపకుండా సొమ్ము చేసుకున్నారు. పల్నాడు ప్రాంతంలోని సిమెంటు కంపెనీలు, గుత్తేదారులు, బిల్డర్లతో ఒప్పందాలు చేసుకుని ఇసుక తరలించేవారు. బినామీ ట్రాన్స్‌పోర్టు ద్వారా నెలకు 50 కోట్ల వరకు ఆర్జించారు. 16 నెలల్లో ఖర్చులు పోగా 40 కోట్లు వెనకేసుకున్నారు.

ఆయన దారిలోనే స్థానిక నేతలు: ప్రజాప్రతినిధి మేతను స్ఫూర్తిగా తీసుకున్న స్థానిక వైసీపీ నేతలు కూడా నదీ తీరంతోపాటు వాగులు, చెరువుల్లో మట్టి తవ్వి జేబులు నింపుకొన్నారు. ఆయన అనుచరుల్లో ఒకరు క్రోసూరు మండలంలో 50 ఎకరాల అటవీ భూములను చదును చేసి ఎకరా లక్ష చొప్పున అమ్ముకున్నారు. రేషన్‌బియ్యం దందా, మద్యం గొలుసు దుకాణాలను ఆయా మండలాల నేతలకు అప్పగించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నియోజకవర్గంలో 250 ఎకరాలను సేకరించింది. ఇందులోనూ ప్రజాప్రతినిధి చక్రం తిప్పారు. రైతులతో ముందుగానే ఒప్పందం చేసుకుని ఎకరం ధర 15 లక్షల నుంచి 20 లక్షలుగా పలుకుతున్న భూముల్ని ఎకరాకు 50 లక్షల నుంచి 55 లక్షల చొప్పున ప్రభుత్వానికి అంటగట్టారు.

ఈడీకి ఏపీ కనిపించదా - అధికార పార్టీ ఇసుక దందా ఎన్ని వేలకోట్లో!

రోడ్డు పనుల్లోనూ: రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమకాగానే అనుచరులను పంపించి తన వాటాను వసూలు చేయించారు. ఒక గ్రామంలో 7.10 ఎకరాల భూమిని ఈ నేత అనుచరులు కొన్నారు. ఆ భూమినే ప్రభుత్వానికి భూసేకరణలో ఇచ్చారు. అందులోని కొంతభూమి గుంటూరులోని ఒక బ్యాంకు తనఖాలో ఉంది. దీనిపై బ్యాంకు అధికారులు సీఐడీకి ఫిర్యాదు చేయడంతో బకాయిలన్నీ చెల్లించేశారు. ఈ ప్రజాప్రతినిధి తన పరిధిలోని ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ రోడ్ల పనులను తమ బినామీ గుత్తేదారు సంస్థకు ఇప్పించారు. 149 కోట్లకుపైగా అంచనాతో చేపట్టిన రోడ్డు టెండర్లలో ఇతరులెవరూ పాల్గొనకుండా అడ్డుపడ్డారు. రెండు కంపెనీలే టెండర్లు వేసేలా చూసి పనులను దక్కించుకున్నారు. వారు వేసిందే రోడ్డు అన్నట్లుగా పరిస్థితి తయారైంది.

ఎదిరిస్తే అక్రమ కేసులే: ఆ ప్రజాప్రతినిధి అక్రమాలను ప్రశ్నించినా ఎదురు తిరిగినా అక్రమ కేసులు పెట్టి వేధిస్తారు. ఎన్నికలప్పుడు తమకు ఓట్లు వేయలేదని ఒక ఎస్సీ కాలనీలోని బడుగులపై దాడిచేసి కేసులు పెట్టించారు. మరో గ్రామంలో మైనారిటీ నేతపై రౌడీషీట్‌ తెరిపించారు. రాజధాని మహిళా రైతులు అమరేశ్వరుని దర్శనానికి అమరావతి వెళ్తుండగా లేమల్లె వద్ద బస్సుపై దాడి చేశారు. ప్రతిఘటించిన టీడీపీ కార్యకర్తలపైనే హత్యాయత్నం కేసులు పెట్టించి రౌడీషీట్లు తెరిపించారు. తాడికొండ అడ్డరోడ్డు వద్ద ధర్నాలో ఉన్న టీడీపీ శ్రేణులపై రాళ్లు వేయించారు. తనను ప్రశ్నించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుపై కేసు పెట్టి అనుచరులతో దాడి చేయించారు. ఎదురుతిరిగిన వైసీపీ నేతపై హత్యాయత్నం కేసు బనాయించి అతడికి అండగా ఉన్న వ్యక్తిపైనా పీడీ యాక్ట్‌ నమోదు చేయించి జిల్లా బహిష్కరణ చేయించారు.

సహకరించని అధికారులపై వేధింపులు: ఇసుక రీచ్‌లలో అక్రమాలపై సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారని టీడీపీ కార్యకర్తను చిత్రహింసలు పెట్టారు. ఎస్టీ కాలనీ గృహాల్లో వాలంటీరు 30 లక్షల అవినీతికి పాల్పడ్డాడని పోస్టు పెట్టినందుకు మరో టీడీపీ కార్యకర్త ఇంటిపై దాడికి తెగబడ్డారు. అమరావతి-బెల్లంకొండ రోడ్డు గురించి ప్రశ్నించారని ఇద్దరు ముస్లిం యువకులను కేసుల్లో ఇరికించారు. చెరువులో మట్టి తవ్వకాలపై ఫిర్యాదు చేసినందుకు ఓ మాజీ సర్పంచిపై దాడులు చేశారు. ఇసుక అక్రమ తవ్వకాలపై మరో సర్పంచి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. అధికారులు పరిశీలిస్తున్న సమయంలో న్యాయవాదులు, గ్రామస్థులపై పోలీసుల సమక్షంలో దాడులు జరిగాయి. మాట వినడంలేదని మండల స్థాయి అధికారిని బదిలీ చేయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సహకరించలేదని పలువురిని బదిలీ చేయించారు. వీరి ఒత్తిళ్లు తట్టుకోలేక ఓ తహసీల్దారు బదిలీ చేయించుకున్నారు.

ఆయన వెనుక అన్నీ ఆమే: ఈ ప్రజాప్రతినిధి సహధర్మచారిణి ఆయనకు షాడోగా వ్యవహరిస్తున్నారు. ఆమె ఏకంగా అధికారులతోనూ సమీక్షలు నిర్వహిస్తారు. ఉద్యోగుల బదిలీల్లోనూ కలగజేసుకుంటారు. డ్వాక్రా మహిళలకు 'ఆసరా (Aasara)' చెక్కుల పంపిణీ సభలోనూ అన్నీ తానై వ్యవహరించారు. ఇంటింటికీ తిరుగుతూ కుక్కర్లను పంపిణీ చేసి.. తన భర్తకు అండగా నిలవాలని కోరారు. అంగన్‌వాడీలు, ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, పాస్టర్లు, ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు, యానిమేటర్లు, వాలంటీర్లతోనూ సమావేశాలు ఏర్పాటు చేసి తమను గెలిపించాలని కోరుతున్నారు. ఈ ప్రజాప్రతినిధి తనయుడు ఇటీవల ఒక మండలంలో కొందరిని వెంటబెట్టుకుని వెళ్లి టీడీపీ కార్యకర్తపై దాడి చేసి, వీరంగం చేసినా కేసు నమోదు కాలేదు. ఈ అక్రమాల్లో ఆయన కుమారుడు తండ్రికి ఏమాత్రం తీసిపోవడం లేదు.

కృష్ణా నదిలో అక్రమ తవ్వకాలు - అడ్డుకోవాలని కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.