ETV Bharat / politics

ఎంపీ టికెట్టు విషయంలోనే వివేకాను సీఎం జగన్‌ చంపించారు: దస్తగిరి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 6, 2024, 9:53 AM IST

Updated : Mar 6, 2024, 2:13 PM IST

Viveka_Murder_Case_Approver_Dastagiri_Comments_on_CM_Jagan
Viveka_Murder_Case_Approver_Dastagiri_Comments_on_CM_Jagan

Viveka Murder Case Approver Dastagiri Comments on CM Jagan: మాజీ మంత్రి వైఎస్‌ వివేకాను సీఎం జగన్‌ చంపించారని అదే కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఆరోపించారు. వివేకా కేసులో అప్రూవర్‌గా మారడంతో తనను బెదిరస్తున్నారని ఇటీవల కడప జైల్లో చిత్రహింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. జైలులో జరిగిన ఘటనలపై విచారణ చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులకు, సీబీఐకి దస్తగిరి లేఖ రాశారు.

ఎంపీ టికెట్టు విషయంలోనే వివేకాను సీఎం జగన్‌ చంపించారు: దస్తగిరి

Viveka Murder Case Approver Dastagiri Comments on CM Jagan: వివేకా హత్య వెనక సీఎం జగన్, ఎంపీ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఉన్నారని అప్రూవర్‌ దస్తగిరి అన్నారు. అప్రూవర్‌గా మారిన తనపై బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హత్యకేసులో అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ చిత్రహింసలకు గురిచేశారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఓ కేసు విషయంలో తాను నాలుగు నెలల పాటు కడప జైల్లో రిమాండ్‌లో ఉన్నప్పుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డి కలిసి బెదిరించారని తెలిపారు.

వారు చెప్పినట్లు వినకపోతే ప్రాణాలతో ఉంచమని, నరికేస్తాం అంటూ హెచ్చరించారని వివరించారు. సీబీఐ ఎస్పీ రాంసింగ్‌కు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పాలని కోరారని, దానికి అంగీకరించకపోవడంతో ఆవేశంతో ఊగిపోతూ చైతన్యరెడ్డి తీవ్ర స్థాయిలో బెదిరించారని, జైలు అధికారులూ చిత్ర హింసలు పెట్టారని కడప ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో దస్తగిరి వెల్లడించారు. కడప జైల్లో జరిగిన ఘటనలపై విచారణ జరపాలని కోరుతూ సీబీఐ, జైళ్లశాఖ డీజీ, కడప ఎస్పీ, నాంపల్లి సీబీఐ కోర్టు జడ్జి, తెలంగాణ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు లేఖలు రాశారు.

వివేకాను హత్య చేయించిన జగన్​కు ఓటు అడిగే హక్కు ఉందా?: దస్తగిరి

గతేడాది అక్టోబరు 30 నుంచి 31 వరకు ఎర్రగుంట్ల సీఐ ఈశ్వరయ్య, డీఎస్పీ నాగరాజులు తనపై ఉన్న అట్రాసిటీ కేసు అడ్డం పెట్టుకుని వివేకా హత్యకు సంబంధించి అవినాష్‌రెడ్డికి అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని బెదిరించినట్లు దస్తగిరి లేఖలో పేర్కొన్నారు. అప్రూవర్‌గా మారడానికి సీబీఐ ఎస్పీ రాంసింగ్‌ తనను కొట్టి ఒప్పించారని కోర్టులో చెప్పాలని పోలీసు అధికారులు ఒత్తిడి చేశారని చెప్పారు. దానికి అంగీకరించకపోవడంతో అరెస్టు చేసి జైలుకు పంపారని వివరించారు.

నవంబరులో వైద్య శిబిరం పేరిట చైతన్యరెడ్డి కడప జైల్లో ఎస్‌ఎస్‌ఆర్‌ బ్యారెక్‌లో తనను కలిసి హెచ్చరించారని దస్తగిరి తెలిపారు. తన భార్య మీడియాతో మాట్లాడి ఆరోపణలు చేస్తున్న విషయం తెలుసుకున్న జైలు అధికారులు తనను చిత్రహింసలు పెట్టారని వివరించారు. 14 రోజుల పాటు 24 గంటలూ లాకప్‌లోనే ఉండే విధంగా చేసి హింసించారని, తాను భరించలేక లాకప్‌లో ఉన్న దుప్పట్లతో ఉరేసుకుని చనిపోతానని చెప్పడంతో జైలు సూపరింటెండెంట్‌ కాసేపు బయటికి వదిలి మళ్లీ లాకప్‌లో పెట్టారని లేఖలో ప్రస్తావించారు.

వివేకా హత్యతో గత ఎన్నికల్లో లబ్ది - ఈసారీ అదే కుట్రతో పావులు కదుపుతున్నారు : దస్తగిరి

జైలులో తనను చైతన్యరెడ్డి కలిసినప్పటి సీసీ టీవీ ఫుటేజీ బయటపెట్టాలని దస్తగిరి డిమాండ్‌ చేశారు. తనను బెదిరించి 20 కోట్ల రూపాయలు ఆఫర్‌ చేసిన విషయంతోపాటు జైలు అధికారులు హింసించిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సీబీఐని కోరారు. సాక్షి పత్రికలో అసత్య వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ టికెట్టు విషయంలోనే వివేకా హత్య జరిగిందని దస్తగిరి పునరుద్ఘాటించారు.

ప్రస్తుతం పశ్చాత్తాపంతో అప్రూవర్‌గా మారాను కాబట్టే జై భీమ్‌ భారత్‌ పార్టీ తరఫున పులివెందులతో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని దస్తగిరి తెలిపారు. వివేకాను చంపిన తనకు ఓటు అడిగే హక్కు లేదంటున్నారని, బాబాయ్‌ను చంపిన జగన్‌కు ఓటు అడిగే హక్కు ఉంటుందా అని నిలదీశారు.

Last Updated :Mar 6, 2024, 2:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.