ETV Bharat / politics

దిల్లీ మద్యం కుంభకోణం కేసు - 7 రోజుల ఈడీ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 16, 2024, 6:34 PM IST

7 days ED Custody for MLC Kavitha : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో శుక్రవారం అరెస్ట్‌ చేసిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు నేడు దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఆమెను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరగా, 7 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ నెల 23న తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు.

MLC Kavitha
7 days ED Custody for MLC Kavitha

7 days ED Custody for MLC Kavitha : దిల్లీ లిక్కర్‌ కేసులో శుక్రవారం కవితను అరెస్ట్‌ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు, ఇవాళ దిల్లీలోని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఆమెను హాజరుపరిచారు. రాత్రంతా ఈడీ కార్యాలయంలోని ప్రత్యేక సెల్‌లో ఉంచిన అధికారులు, వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్‌ నాగ్‌పాల్‌ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించగా, ఈడీ తరఫున న్యాయవాదులు స్పెషల్ పిపి ఎన్.కె మట్టా, ఈడీ స్పెషల్ కౌన్సిల్ జోసెబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. తొలుత వాదనలు వినిపించిన కవిత న్యాయవాది విక్రమ్ చౌదరి, సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీని దర్యాప్తు సంస్థ పూర్తి స్థాయిలో ఉల్లంఘించి అరెస్టు చేసిందని కోర్టు దృష్టికి తెచ్చారు. కవితకు సమన్లు ఇచ్చినప్పుడు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశామన్న ఆయన, గతేడాది సెప్టెంబర్ 15న ఈడీ తరఫున సమన్లు ఇవ్వబోమని, అరెస్ట్‌ చేయబోమని సుప్రీంకు చెప్పారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టులో గతేడాది సెప్టెంబర్ 15న అదనపు సోలిసిటర్ జనరల్ మౌఖికంగా చెప్పిన మాటను దర్యాప్తు సంస్థ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఈడీ ఇచ్చిన సమన్లు, నమోదు చేసిన కేసును నిలిపేయాలని సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్‌పై ఓవైపు విచారణ జరుగుతుండగానే, కవితను అరెస్ట్‌ చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు.

ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు - సెల్​ఫోన్లు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

కవిత తరఫు న్యాయవాది వాదనల అనంతరం ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుసేన్ వాదనలు వినిపించారు. ఏ న్యాయస్థానమూ తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. సెప్టెంబర్ 15న చేసిన ప్రకటనలో వచ్చే 10 రోజుల్లో మాత్రమే సమన్లు ఇవ్వబోమన్నామే కానీ, మొత్తం విచారణకు కాదు అని చాలా స్పష్టంగా అదనపు సోలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టులో చెప్పారని కోర్టుకు నివేదించారు. ఒక ఆర్డర్ అనుకూలంగా ఉంటే, అది నిరవధిక కాలానికి అన్వయించుకోవద్దని పేర్కొన్నారు. ఇతరులకు ఇచ్చిన ఉత్తర్వులను తమకు అన్వయించుకోవద్దని సూచించారు. ఒక మధ్యంతర ప్రకటనను ఆ 10 రోజులకు కాకుండా, మొత్తానికి వర్తించుకోవడం వారికే మంచిది కాదని పేర్కొన్నారు. సర్వోన్నత న్యాయస్థానంలో ఇచ్చిన ఒక ప్రకటనను కోర్టు ఉల్లంఘనగా భావించడానికి వీల్లేదని ఉన్న సెక్షన్లను ఈడీ న్యాయవాది కోర్టుకు వివరించారు. తీవ్ర చర్యలు తీసుకోవద్దని ఎలాంటి ఉత్తర్వులు లేవని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో ఏఎస్‌జీ చెప్పిన 10 రోజుల గడువు ఎప్పుడో ముగిసిందని అన్నారు. ఆ తర్వాత ఎన్నోసార్లు కోర్టులో విచారణ జరిగిందని, వాదనలు వినిపించినా సెప్టెంబర్ 15న ఇచ్చిన అండర్ టేకింగ్‌నే ప్రస్తావిస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు.

ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడీ - పలువురు నేతల రియాక్షన్

కవితను అరెస్ట్‌ చేయడానికి కారణాలన్నీ రిమాండ్ రిపోర్టులో చెప్పామన్న ఈడీ తరఫు న్యాయవాది, శుక్రవారం సాయంత్రం 5 గంటల 43 నిమిషాలకు అరెస్ట్ చేరినట్లు చెప్పారు. కవితను సూర్యాస్తమయం తర్వాత అరెస్ట్‌ చేశారని చెప్పడం తప్పన్న ఈడీ న్యాయవాది, సూర్యాస్తమయానికి ముందే అరెస్ట్‌ చేసినట్లు 5 గంటల 40 నిముషాలకు సంతకం చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇండో స్పిరిట్ సంస్థ ప్రతినిధి అరుణ్ పిళ్లై చెప్పిన అనేక విషయాలు కవిత ప్రమేయాన్ని చూపుతున్నాయన్న ఈడీ న్యాయవాది, 33 శాతం లాభాలు మేడంకు వెళతాయని బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై, రాఘవ మాగుంట సహా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు కవిత భాగస్వామ్యాన్ని చెబుతున్నాయని అన్నారు. విచారణలో కవిత తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆయన, కొన్ని డిజిటల్ పరికరాలు ధ్వంసం చేశారని వివరించారు.

'ట్రాన్సిట్‌ వారెంట్‌ లేకుండా ఎలా అరెస్టు చేస్తారు' - ఈడీ అధికారులతో కేటీఆర్‌ వాగ్వాదం

శుక్రవారం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో జరిగిన సోదాల్లో మొత్తం 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, సోమవారం మరికొందరిని విచారణకు పిలిచామని కోర్టుకు తెలిపారు. క్రైమ్ జరిగిన తీరు, ఇండో స్పిరిట్స్‌కు వచ్చిన లాభాలు, ఆధారాలు చెరిపేసేందుకు చేసిన ప్రయత్నం, డిజిటల్ డేటా ధ్వంసం చేసిన తీరు, అన్ని పీఎంఎల్ఏ కింద కేసు దర్యాప్తు చేయడానికి అనుకూలమైనవని పేర్కొన్నారు. సోదాలు జరుగుతున్న సమయంలో సోదరుడిని, బంధువునంటూ కొందరు సోదాలు జరిగే చోటకు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారని, మొత్తం వీడియో రికార్డు చేసి పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టారని అన్నారు. సోదాల సమయంలో కవిత, కవిత భర్త, వాళ్ల సహాయకుల ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, అన్ని విషయాలు పంచనామా నివేదికలో పేర్కొన్నట్లు కోర్టుకు వివరించారు.

కవిత అక్రమ అరెస్టును సుప్రీంకోర్టులో తేల్చుకుంటాం : హరీశ్‌రావు

ఈడీ న్యాయవాది వాదనల తర్వాత మరోసారి వాదనలు వినిపించిన కవిత న్యాయవాది, సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి, మరో పిటిషన్‌కు జత చేసిన తర్వాత అరెస్టు చేశారని కోర్టుకు తెలిపారు. ఈడీ అధికారులు రాతలో ఒకటి, మనసులో మరొకటి, చేతల్లో ఇంకొకటి చూపుతున్నారన్న కవిత తరఫు న్యాయవాది, ఈ కేసులో ఒక ఛార్జిషీట్‌తో పాటు 3 సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లు దాఖలు చేశారని అన్నారు. సీబీఐ సీఆర్‌పీసీ 160 కింద నోటీసులు ఇచ్చి, 2022 డిసెంబర్‌లో ఇంటికి వచ్చి విచారించిందన్న ఆయన, కవితను సీబీఐ సాక్షి అంటుంటే, ఈడీ మాత్రం నిందితురాలు అంటోందని అన్నారు. ఇందులో ఏది నిజమని ప్రశ్నించారు. పీఎంఎల్‌ఏ చట్టం సీఆర్‌పీసీ సెక్షన్లు వర్తిస్తాయని చెపుతుండగా, ఈడీ అధికారులు మాత్రం అవి వర్తించవంటున్నారని అన్నారు. ఒక మహిళను అరెస్టు చేసి, 30 కిలోమీటర్లు పైగా తీసుకువెళ్తే తప్పకుండా ట్రాన్సిట్ రిమాండ్ తీసుకోవాలి కానీ, అదేదీ లేకుండానే అరెస్టు చేసి హైదరాబాద్ నుంచి దిల్లీ తరలించారని అన్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్‌పై విచారణ జరుగుతుంది, మధ్యంతర ఉత్తర్వులున్నాయి, దర్యాప్తునకు సహకరిస్తుండగా ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు.

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ - నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు

ఈడీ తరఫున మరోసారి వాదనలు వినిపించిన జోయబ్ హుసేన్, తీవ్ర చర్యలుండవని ఎప్పుడు, ఎక్కడ అండర్ టేకింగ్ ఇవ్వలేదని వాదించారు. 10 రోజుల పాటు సమన్లు జారీ చేయబోమని మాత్రమే చెప్పామన్న ఈడీ, అది చాలా కాలం క్రితమే అయిపోయిందని అన్నారు. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే ఈ ఏడాది జనవరి 3న సమన్లు జారీ చేశామని పేర్కొన్నారు. ఈ సమన్లను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసుంటే, ఆ పిటిషన్‌ ఎక్కడుందో చెప్పాలన్నారు. 24 గంటల్లో సంబంధిత కోర్టులో హాజరు పరచలేకపోతే, అప్పుడు ట్రాన్సిట్ రిమాండ్ తీసుకోవాలని వివరించారు. ఆథరైజ్డ్‌ అధికారి ఎవరూ లేరన్న వాదనలు సైతం అర్థరహితమన్న ఈడీ తరఫు న్యాయవాది, ప్రజా బాహుళ్యంలో ప్రముఖంగా ఉన్న మహిళ విచారణ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని పేర్కొన్నారు. అనంతరం కవితను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ న్యాయవాది కోరగా, 7 రోజుల పాటు విచారించేందుకు న్యాయమూర్తి అంగీకరించారు. ఈ నెల 23న మధ్యాహ్నం తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించారు.

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.