ETV Bharat / politics

13 స్థానాల్లో కాంగ్రెస్​కు విజయం వరించే ఛాన్స్​ - ఆ నాలుగు స్థానాలు మాత్రం కష్టమే! - LOK SABHA ELECTION 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 9, 2024, 10:05 AM IST

Congress Wins in 13 MP Seats in Telangana : అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ను గద్దె దించి అధికార పగ్గాలు చేపట్టిన హస్తం పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో అంతకుమించిన ఫలితాలొస్తాయని అంచనా వేస్తోంది. 3 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకపోయినా ఇప్పటికైతే రాష్ట్రంలో సానుకూల వాతావరణం ఉన్నట్లు పార్టీ అంతర్గత సర్వేలు వెల్లడిస్తున్నాయి. 4 నియోజకవర్గాల్లో పరిస్థితి కష్టంగా ఉన్నా మిగతా 13చోట్ల మాత్రం గెలుపు అవకాశాలున్నట్లు పార్టీనేతలు చెబుతున్నారు. ఉగాది తర్వాత క్షేత్రస్థాయి ప్రచారానికి అభ్యర్థలు, పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు.

Congress Wins in 13 Parliamentary Constituencies in Telangana
Congress Wins in 13 Parliamentary Constituencies in Telangana

13 స్థానాల్లో కాంగ్రెస్​కు విజయం వరించే ఛాన్స్​ - ఆ నాలుగు స్థానాల్లో రావడం కష్టమే

Congress Wins in 13 MP Seats in Telangana : దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక్కటైన తెలంగాణ నుంచి మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్​ నాయకత్వం తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు అభ్యర్థుల ఎంపికలోనూ అధిష్ఠానం ఆచితూచి వ్యవహరిస్తూ 17 నియోజకవర్గాలకు గానూ 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా ఖమ్మం, కరీంనగర్​, హైదరాబాద్​ నియోజకవర్గాల్లో ఏకాభిప్రాయం రాలేదు.

Khammam Congress MP Ticket : ఖమ్మం విషయంలో మంత్రులు తమకంటే తమకు టికెట్​ కావాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అభ్యర్థి ఎంపికపై పీటముడి వీడటంలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి మధ్య పోటీ తీవ్రంగా నెలకొనగా అటు తెరపైకి కొత్త పేర్లు వచ్చాయి. పొంగులేటి వియ్యంకుడు రఘురామిరెడ్డి, రచనాచౌదరి, రాజేంద్రప్రసాద్‌, ఉస్మానియా విద్యార్థి నేత లోకేశ్‌ యాదవ్‌ల పేర్లనూ ఖమ్మం నుంచి బరిలోకి దించే అంశంపై పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఖమ్మం టికెట్‌ ప్రకటన ఆధారంగానే కరీంనగర్‌ టికెట్‌ ఎవరికి ఇవ్వాలన్నదానిపై ఆధారపడి ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మంలో ఓసీకి టికెట్‌ ఇస్తే కరీంనగర్‌లో బీసీకికానీ, వెలమ సామాజికవర్గానికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్ టికెట్‌ డీసీసీ అధ్యక్షుడు సమీర్‌ ఉల్లాకు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే ప్రకటించిన 14 నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థుల పార్టీ నేతల సమన్వయంతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఉగాది పండుగ తర్వాత నియోజకవర్గాల్లో ప్రచార కోలాహలం మొదలవుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు.

కరీంనగర్​ అభ్యర్థిపై కాంగ్రెస్ అధిష్ఠానం త్వరగా నిర్ణయం తీసుకోవాలి : పొన్నం ప్రభాకర్

బీఆర్​ఎస్​ పాలన లోపాలే అస్త్రాలుగా : నెల రోజులపాటు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించడం, జాతీయ మేనిఫెస్టో(Congress Manifesto)తోపాటు వంద రోజుల రాష్ట్ర ప్రభుత్వ పాలన, ఇప్పటి వరకు అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, గత ప్రభుత్వ వైఫల్యాలు, అప్పులు చేసిన తీరును ఇంటింటికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నాయకత్వం యోచిస్తోంది. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలు ప్రాథమికంగా బయట పెట్టిన విషయాన్ని కూడా జనంలోకి తీసుకెళ్లాలని భావిస్తోంది.

అదేవిధంగా ధరణి(Dharani Problems) సమస్యల పరిష్కారానికి ప్రభుత్వపరంగా తీసుకుంటున్న చర్యలు, ఆరు గ్యారంటీల అమలు, నిరుద్యోగులకు ఉద్యోగ నియామక ప్రకటనలు, ఇప్పటి వరకు భర్తీ చేసిన 30వేల ఉద్యోగాలు, జాబ్‌ క్యాలెండర్‌ తదితర అంశాలను ప్రచారానికి వినియోగించుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాల చెల్లింపు, రైతుబంధు దాదాపు 93శాతం నిధులు రైతుల ఖాతాల్లో వేయడం లాంటి అంశాలను కూడా ప్రచారస్త్రాలుగా ఉపయోగించుకునేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు.

13 స్థానాల్లో కాంగ్రెస్​ గెలుపు ఖాయం : ఇక లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Polls 2024) ప్రజల నాడీపై కాంగ్రెస్ నాయకత్వం ఇటీవల అంతర్గత సర్వేలు జరిపింది. ఇందులో మెదక్‌, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ లోక్‌సభ నియోజక వర్గాల్లో మాత్రమే పార్టీకి అనుకూల పరిస్థితిలేదని స్పష్టమైనట్లు గుర్తించారు. మిగిలిన 13 లోక్​సభ నియోజకవర్గాల్లో అభ్యర్ధులు ఎవరున్నా పార్టీ గెలుపు అవకాశాలు మాత్రం మెరుగ్గా ఉన్నాయని సర్వేలో వెల్లడైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆదిలాబాద్‌ అత్రం సుగుణకు, నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి, పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణకు, మహబూబాబాద్‌లో కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌ కచ్చితంగా గెలుస్తారని భావిస్తున్నారు.

Congress Plan for Lok Sabha Election : కరీంనగర్‌లో అభ్యర్ధిని ప్రకటించకపోయినా అక్కడ ప్రస్తుతం ఉన్న ఇతర పార్టీల అభ్యర్థులపై సానుకూలత లేకపోవడం తమకు కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. వరంగల్‌లో కడియం కావ్యకు, భువనగిరిలో చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, నల్గొండలో కుందూరు రఘువీర్‌ రెడ్డి, జహీరాబాద్‌లో సురేష్‌ షెట్కర్‌, చేవెళ్లలో రంజిత్‌రెడ్డికిలకు అనుకూల వాతావరణం ఉన్నట్లు సర్వే(Congress Survey)లో తేలినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఖమ్మంలో ముగ్గురు మంత్రులు తమ కుటుంబ సభ్యుల టికెట్‌ కోసం పోటీ పడుతున్నప్పటికీ ఇక్కడ ఎవరికి టికెట్‌ ఇచ్చినా గెలిచే అవకాశం ఉందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

తుక్కుగూడ సభకు అనూహ్య స్పందన - కాంగ్రెస్ శ్రేణుల్లో నయా జోష్​ - 14 సీట్లకు ఇక ఢోకా లేదు!

ఐదు గ్యారంటీలతో గెలుపుపై గురి- 8కోట్ల కుటుంబాలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.