ETV Bharat / politics

మల్కాజిగిరి స్థానంపైనే ప్రధాన పార్టీల గురి - ఈ సారి ఓటరు చూపు ఎటువైపో? - Parties Focus On malkajgiri MP Seat

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 30, 2024, 2:50 PM IST

Political Parties Focus On malkajgiri MP Seat
Political Parties Focus On malkajgiri MP Seat

Political Parties Focus On Malkajgiri MP Seat : మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం కావడంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయంగా తిరిగి పుంజుకోవడానికి తోడ్పడిన నియోజకవర్గం ఇది. ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పట్టు సాధిస్తే మిగతా వాటిపైనా దాని సానుకూల ప్రభావం పడే అవకాశం ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, జోరుమీదున్న బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఎత్తుకు పైఎత్తు వేస్తున్నారు.

Political Parties Focus On Malkajgiri MP Seat : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అంతర్భాగమైన మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు లక్ష్యంగా మారింది. ఇక్కడ ఎలాగైనా పాగా వేయాలని ప్రధాన పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఇక్కడ పోరు హోరాహోరీగా ఉండనుంది. రాష్ట్రంలో 'మినీ ఇండియాగా' భావించే మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. 38 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్న ఈ పార్లమెంటు స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఎవరికి వారే గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో జోరు పెంచారు.

మూడు పార్టీల దృష్టీ ఆ స్థానం పైనే : కాంగ్రెస్ పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని చూస్తుంటే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో వచ్చిన ఫలితాలనే బీఆర్ఎస్ ఆశిస్తోంది. మోదీ చరిష్మాతో కాషాయ జెండా ఎగరేయాలని కమలదళం కూడా కృషి చేస్తోంది. మూడు ప్రధాన పార్టీలు మల్కాజిగిరిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో అక్కడ ఈసారి ఎన్నికలు ఎంతో రసవత్తరంగా మారాయి. కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజిగిరి గిరి, ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలు మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి.

గెలుపే దిశగా మూడు పార్టీల అడుగులు : 2019లో మల్కాజిగిరి స్థానంలో కాంగ్రెస్ గెలుపొందింది. ఇప్పటి వరకు ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ ఖాతా తెరవలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందడంతో ఆ పార్టీ అదే ఊపుతో లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. మోదీ చరిష్మానే బీజేపీ నమ్ముకుంది. మూడు ప్రధాన పార్టీలు గెలుపుపై దృష్టిపెట్టడంతో పోరు ఉత్కంఠంగా మారింది.

హస్తం పార్టీ హ్యాట్రిక్ సాధించేనా? : ఇప్పటికే ఈ స్థానంలో మూడుసార్లు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు గెలుపొందింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఈ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీ తరఫున పోటీ చేసిన చామకూర మల్లారెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంత్‌రావుపై 8176 ఓట్లతో గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి బరిలో నిలిచి గెలుపొందారు. రాజకీయంగా పడిపోయిన తనకు గెలుపునందించి నిలబెట్టి అప్పటి ప్రభుత్వంపై పోరాడే శక్తినిచ్చారని దీని ఫలితంగానే ఈ రోజు ముఖ్యమంత్రి నయ్యానంటూ సెంటిమెంట్‌తో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. తనలాగే కాంగ్రెస్‌ అభ్యర్థిని మరోసారి ఆదరిస్తే మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో పరిశ్రమలు, ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసి అభివృద్ధిపరుస్తానని హామీ ఇస్తున్నారు.

'మల్కాజిగిరి' మాదంటే మాదంటూ తలపడుతున్న ప్రధాన పార్టీలు - ఓటర్లు పట్టం కట్టేదెవరికో? - Lok Sabha Elections 2024

Congress Strategy To win Malkajgiri Seat : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయంగా ఎంతో పట్టున్న మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డి సతీమణి, వికారాబాద్ జడ్పీ ఛైర్మన్ సునీతా మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ మల్కాజిగిరి టికెట్ ఇచ్చింది. ఆమెను గెలిపించడానికి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి బాధ్యుడిగా నియమించి పార్టీ శ్రేణులతో ఎప్పటికప్పుడు మంతనాలు సాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి సైతం తనను ఎంపీగా గెలిపించడానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలతో నేరుగా మాట్లాడుతున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీల్లో కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని దక్కించుకోలేకపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ హావా కొనసాగినా ఇక్కడ మాత్రం కారు వేగాన్ని అడ్డుకోలేకపోయింది. ఇది ప్రతికూల అంశమే అయినా బీఆర్ఎస్​కు చెందిన పలువురు నాయకులను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకొని అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

BRS Focus ON Malkajgiri MP Seat : ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా మల్కాజిగిరి సీటును దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉంది. ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, కంటోన్మెంట్, మల్కాజిగిరి, ఉప్పల్, మేడ్చల్, ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటీవల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. ఇదే ఊపు ఎంపీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని ప్రణాళిక రచించంది. బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు. ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన లక్ష్మారెడ్డి ఆర్నెళ్ల క్రితం వరకు కాంగ్రెస్‌ నాయకుడిగానే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్‌ ఆశించి భంగపడి బీఆర్ఎస్​లో చేరారు. స్థానిక నినాదంతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

BRS Strategy To Win Malkajgiri MP Seat : ఇప్పటికే ఏడుగురు బీఆర్ఎస్ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి తరఫున వారి వారి నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేసేలా కేసీఆర్, కేటీఆర్ బాధ్యతలు అప్పజెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి వల్లే మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో మెట్రో, పై వంతెనలు, ఐటీ కంపెనీలు, పరిశ్రమలు ఏర్పడ్డాయని కేటీఆర్ ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఇటీవల చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ప్రధాన ప్రతిపక్షానికి మింగుడు పడటం లేదు. ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్‌, బీజేపీలో చేరుతున్నారు. నాయకులు వెళ్లినా కార్యకర్తలు ఓటర్లు మాత్రం మా వెంటే ఉన్నారని నాయకత్వం ధీమాగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు వేసిన ఓటర్లే ఎంపీ ఎన్నికల్లోనూ అండగా ఉంటారని నమ్ముతోంది.

మోదీ చరిష్మానే నమ్ముకున్న బీజేపీ : మోదీ చరిష్మాతో ఇప్పటికే జోష్‌లో ఉన్న బీజేపీ మల్కాజిగిరి సీటును తమ ఖాతాలో వేసుకుంటామనే ధీమాతో ఉంది. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ ఓటర్లు ఎంతో చైతన్యవంతులని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశవ్యాప్తంగా చేసిన అభివృద్ధి పనులే పార్టీ గెలుపునకు దోహదపడతాయని భావిస్తున్నారు. బీజేపీ నుంచి సీనియర్ నేత ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు. రాజకీయ అనుభవం, పలుకుబడి సైతం ఆయనకు కలిసొచ్చే అంశం.

మోదీ రోడ్​షోతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం : కాంగ్రెస్‌, బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న అభ్యర్థులతో పోలిస్తే రాజకీయ అనుభవం ఈటల రాజేందర్‌కు అదనపు బలంగా భావించొచ్చు. కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి ఓటమి తర్వాతే మల్కాజిగిరిలో ఎంపీగా గెలుపొందారని ఈటల రాజేందర్ సైతం ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో హజురాబాద్‌, గజ్వేల్‌ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూసి ఎలాగైనా లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందాలనే కసితో ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఓటర్లు సైతం ఈటల రాజేందర్‌ను ఆదరిస్తారని కమలదళం నమ్మకంగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. మోదీ రోడ్‌షోతో వాళ్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోవడం ప్రతికూలంగా మారింది. కానీ రామమందిర నిర్మాణం, మోదీ చేసిన అభివృద్ధి పనులు యువతను ఎంతో ఆకట్టుకున్నాయని పాజిటివ్ ఓటింగ్‌తో గెలుపు ఖాయమనే ధీమాలో బీజేపీ శ్రేణులున్నాయి.

మల్కాజిగిరిపై కాంగ్రెస్ గురి - భారీ మెజార్టీతో గెలిచేందుకు స్పెషల్ ఆపరేషన్ - lok sabha elections 2024

మల్కాజిగిరి నియోజకవర్గంపై ప్రధాన పార్టీల ఫోకస్ - ఎవరికీ రెండో ఛాన్స్ ఇవ్వని ప్రజలు - ఈసారి గెలుపు ఎవరిదో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.