మల్కాజిగిరి నియోజకవర్గంపై ప్రధాన పార్టీల ఫోకస్ - ఎవరికీ రెండో ఛాన్స్ ఇవ్వని ప్రజలు - ఈసారి గెలుపు ఎవరిదో?

మల్కాజిగిరి నియోజకవర్గంపై ప్రధాన పార్టీల ఫోకస్ - ఎవరికీ రెండో ఛాన్స్ ఇవ్వని ప్రజలు - ఈసారి గెలుపు ఎవరిదో?
Election Fight in Malkajgiri Constituency : మల్కాజిగిరి నియోజకవర్గం ఈసారి ఏ పార్టీ గెలుస్తుందనేది ఉత్కంఠగా మారింది. వరసగా రెండుసార్లు విజయభేరి మోగించిన బీఆర్ఎస్.. సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పార్టీ మారడంతో వ్యూహాలకు పదును పెట్టింది. మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డిని రంగంలోకి దింపింది. కాంగ్రెస్ నుంచి మైనంపల్లి పోటీ చేస్తుండగా.. బీజేపీ నుంచి రాంచందర్రావు మూడోసారి బరిలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. విభిన్న మతాలే కాకుండా వివిధ రాష్ట్రాల ప్రజలకు నిలయమైన మాల్కాజిగిరిపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
Election Fight in Malkajgiri Constituency : మల్కాజిగిరి శాసనసభ నియోజకవర్గం.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. నాలుగు లక్షల 89 వేల 43 మంది ఓటర్లు.. ఈసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారిలో 44 శాతం యువత. మల్కాజిగిరిలో 33 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి మర్రి రాజశేఖర్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు, బీజేపీ తరఫున రాంచందర్రావు.. హోరాహోరీ తలపడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి.. తన కుమారుడు రోహిత్రావుకు మెదక్ టిక్కెట్ ఇవ్వలేదని అసంతృప్తితో బీఆర్ఎస్ను వీడి.. హస్తం పార్టీలో చేరారు. మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డిని బీఆర్ఎస్ బరిలోకి దించింది. బీజేపీ నుంచి 2014, 2018 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన రాంచంద్రావు.. ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
Telangana Assembly Elections 2023 : మౌలాలి డివిజన్లో ముస్లిం ఓట్లు 51 వేల వరకు ఉంటాయి. సైనికులకు శిక్షణ అందించే ఆర్మీ ఆర్డినెన్స్ కాప్స్-ఏఓసీ ఈ నియోజకవర్గంలోని సఫిల్గూడలో ఉండటంతో.. అనేక మంది సైనికోద్యోగులు అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. 70 వేల మంది రక్షణ శాఖ ఉద్యోగుల ఓట్లు ఉన్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడు నుంచి వ్యాపార నిమిత్తం వచ్చిన వారు అధికసంఖ్యలో ఉన్నారు. యాప్రాల్ ప్రాంతంలో తమిళుల ఓట్లు 75 వేల వరకు ఉంటాయి. ఆర్కేనగర్, ఆనంద్భాగ్ వంటి ప్రాంతాల్లో బ్రాహ్మణుల ఓట్లు 65 వేల ఉంటాయని అంచనా. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నవారు 50 వేల పైచిలుకు మంది ఉన్నారు. నియోజకవర్గంలో కీలకంగా ఉన్న వీరంతా.. మాల్కాజిగిరిలో గెలుపొటములపై ప్రభావం చూపిస్తారు.
మల్కాజిగిరి నియోజకవర్గంలో అనేక సమస్యలు తాండవిస్తున్నాయి. ఈస్ట్ ఆనంద్బాగ్, షిరిడీనగర్, ఎన్ఎండీసీ కాలనీ, దీన్దయాళ్నగర్, పటేల్నగర్, దుర్గానగర్.. వర్షకాలంలో ముంపుసమస్యను ఎదుర్కొంటున్నాయి. దీన్దయాళ్నగర్లో 9 ఏళ్ల చిన్నారి సుమేధ.. నాళాలో పడి కొట్టుకుపోయిన ఘటన స్థానికుల్లో తీవ్ర విషాదం నింపింది. రైల్వే అండర్ బ్రిడ్జిలు చిన్నవిగా ఉండడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నియోజకవర్గంలో డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉంది.
Political Parties Focus On Malkajgiri : 2009లో ఏర్పడిన మల్కాజిగిరి నియోజకవర్గంలో.. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఒకసారి గెలిచిన అభ్యర్థి రెండోసారి విజయం సాధించలేదు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల రాజేందర్, 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు చింతల కనకారెడ్డి, మైనంపల్లి హన్మంతరావు గెలిచారు. వరసగా రెండుసార్లు మల్కాజిగిరిపై గులాబీ జెండా ఎగురవేసిన బీఆర్ఎస్.. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంతరావు పార్టీ మారినా.. బలంగా పుంజుకుని పోరాడుతోంది.
మర్రి రాజశేఖర్రెడ్డిని గెలిపిస్తే.. తాను నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని హరీశ్రావు ప్రచారం చేస్తున్నారు. మాల్కాజిగిరిలో తన గెలుపును ఎవరూ ఆపలేరని.. ఈసారి కూడా విజయం సాధిస్తాననే ధీమాతో మైనంపల్లి హన్మంతరావులో కనిపిస్తోంది. రెండుసార్లు ఓడిపోయిన తనపై సానుభూతి ప్రజల్లో ఉందని.. ఈసారి తనకు అవకాశం ఇస్తారని బీజేపీ అభ్యర్థి రాంచంద్రావు భావిస్తున్నారు.
