ETV Bharat / opinion

ఆ 10 నియోజకవర్గాలపైనే అందరి దృష్టి- కంచుకోటల్లో ఎవరు నెగ్గుతారో? - Lok Sabha Election 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 12, 2024, 8:02 PM IST

Legacy Seats Lok Sabha Polls 2024 : సార్వత్రిక ఎన్నికల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల దశాబ్దాలుగా తమ కుటుంబాలకు కంచుకోటలుగా ఉన్న చోట కొందరు వారసులు పోటీకి దూరంగా ఉన్నారు. మరికొన్ని కంచుకోటల్లో వారసులు మధ్యే ఆసక్తికర పోరు నెలకొంది. ఇంకొన్ని కంచుకోటల్లో గత ఎన్నికల్లో తమకు ఎదురైన పరాభవాన్ని మరచి సత్తాచాటాలని నేతలు కృతనిశ్చయంతో ఉన్నారు. మొత్తానికి అమేఠీ, బాగ్‌పత్‌, పీలీభీత్‌, గుణ, హజారీబాగ్‌ వంటి నియోజకవర్గాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Lok Sabha Polls 2024
Lok Sabha Polls 2024 (Etv Bharat)

Legacy Seats Lok Sabha Polls 2024 : రాజకీయ వారసులకు కంచుకోటలుగా నిలుస్తున్న నియోజకవర్గాల్లో ఆసక్తికర పోరు నెలకొంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ లోక్‌సభ స్థానంలో గత పాతికేళ్లలో తొలిసారిగా గాంధీ, నెహ్రూ కుటుంబ సభ్యుల్లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయి.

  • అమేఠీలో కాంగ్రెస్‌ 18సార్లు పోటీ చేస్తే ఏకంగా 15 సార్లు జయకేతనం ఎగరవేసింది. 2004 నుంచి 2014 వరకూ ఇక్కడ గెలుస్తూ వచ్చిన రాహుల్‌ గాంధీ 2019లో ఓడిపోయారు. దీంతో ఈసారి ఆయన తన తల్లి సోనియా గాంధీ ఖాళీ చేసిన రాయ్‌బరేలీకి మారారు.
  • తమ కుటుంబానికి సన్నిహితుడైన కిశోరీలాల్‌ శర్మను అమేఠీలో బరిలోకి దించారు. గాంధీ, నెహ్రూ కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడం వల్ల అమేఠీలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ గెలుపు సులువు అవుతుందన్న అంచనాలు నెలకొన్నాయి. అదే జరిగితే కాంగ్రెస్‌ తమ కంచుకోటను కోల్పోయినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
  • అటు బాగ్‌పత్‌ లోక్‌స్థానం నుంచి మాజీ ప్రధాని చరణ్‌ సింగ్‌ మనవడు, రాష్ట్రీయ లోక్‌ దళ్‌-RLD అధినేత జయంత్‌ చౌధరీ ఈసారి పోటీ చేయడం లేదు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సత్యపాల్‌ సింగ్‌ చేతిలో జయంత్‌ ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లోనూ తన తండ్రి అజిత్‌ సింగ్‌ సైతం ఓటమి పాలయ్యారు. దీంతో ఈసారి బాగ్‌పత్‌ స్థానాన్ని వదులుకున్న జయంత్‌ తన పార్టీ నుంచి రాజ్‌కుమార్‌ సాంగ్వాన్‌ను బరిలో దింపారు.
  • ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌ లోక్‌సభ స్థానం బీజేపీ మాజీ సీనియర్‌ నేత యశ్వంత్‌ సిన్హా కుటుంబానికి కంచుకోట. హజారీబాగ్‌కు యశ్వంత్‌ సిన్హా ప్రాతినిధ్యం వహించేవారు. ఆ తరువాత ఆయన కుమారుడు జయంత్‌ సిన్హా అక్కడి నుంచి గెలిచారు. 2019లోనూ జయంత్‌ ఘనవిజయం సాధించారు. ఈసారి ఆయనకు బీజేపీ అధిష్ఠానం టికెట్‌ నిరాకరించింది. దీంతో హజారీబాగ్‌ నియోజకవర్గంపై ఆ కుటుంబానికి పట్టు తప్పింది.
  • ఉత్తర్‌ప్రదేశ్‌లోని పీలీభీత్‌ మేనకా గాంధీ, వరుణ్‌ గాంధీలకు కంచుకోట. గతకొంతకాలంగా సొంత పార్టీపై విమర్శలు చేస్తుండడం వల్ల బీజేపీ ఈసారి వరుణ్‌ గాంధీకి టికెట్‌ ఇవ్వలేదు. దీంతో 3 దశాబ్దాల్లో తొలిసారి మేనకా గాంధీ, వరుణ్‌ గాంధీ లేకుండా పీలీభీత్‌లో ఎన్నికలు జరిగాయి.
  • సింధియాలకు కంచుకోటైన మధ్యప్రదేశ్‌లోని గుణ స్థానంలో మరోసారి సత్తాచాటాలని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పట్టుదలగా ఉన్నారు. తమ కుటుంబానికి పెట్టని కోట అయిన మధ్యప్రదేశ్‌లోని గుణలో జ్యోతిరాదిత్య సింధియా 2019లో కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగి ఓడిపోయారు. ఈసారి ఆయన బీజేపీ తరఫున మళ్లీ అక్కడి నుంచే పోటీ చేశారు. గత ఎన్నికల్లో పరాజయానికి ప్రతీకారం తీర్చుకుని పట్టు నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో సింధియా ఉన్నారు.
  • హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీలో విక్రమాదిత్య సింగ్‌ పోటీకి దిగారు. ఆ రాష్ట్ర మంత్రిగా ఉన్న ఆయన, తమ కుటుంబానికి ఆ నియోజకవర్గంపై ఉన్న పట్టును కాపాడుకోవాలని తలపోస్తున్నారు. ఇక్కడ బీజేపీ తరఫున సినీ నటి కంగనా రనౌత్‌ పోటీలో ఉన్నారు.
  • ఎన్సీపీ వ్యవస్థాపకులు శరద్‌ పవార్‌ కుటుంబానికి కంచుకోటగా ఉన్న మహారాష్ట్రలోని బారామతిలో కుటుంబ సభ్యుల మధ్యే పోరు జరిగింది. శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సూలే, అజిత్‌ పవార్‌ భార్య సునేత్రా పవార్‌ ఇక్కడ నుంచి పోటీపడ్డారు.
  • కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌లది మరో తీరు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే గెలవాలనే ఉద్దేశంతో తమ కంచుకోటల్లో మళ్లీ బరిలోకి దిగారు. 2019లో దిగ్విజయ్‌ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. దీంతో ఈసారి తమ సొంత నియోజకవర్గం రాజ్‌గఢ్‌లో పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆయన కుటుంబ సభ్యులే చాలాకాలంపాటు ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో ఈ సీటును పోగొట్టుకున్నారు. మళ్లీ ఇప్పుడు దిగ్విజయ్‌ బరిలో నిలిచి పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు.
  • ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో 2019 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ ఓటమి పాలయ్యారు. సమాజ్‌వాదీకి కంచుకోటైన కన్నౌజ్‌లో 1999 వరకూ అక్కడ ములాయం కుటుంబ సభ్యులే గెలిచారు. ఆ తర్వాత బీజేపీ వశమైంది. మళ్లీ ఇప్పుడు పట్టు సాధించేందుకు స్వయంగా అఖిలేశ్‌ యాదవ్‌ రంగంలోకి దిగారు.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

అధీర్​ టు అఖిలేశ్​- నాలుగో విడత బరిలో ప్రముఖులు- పై చేయి ఎవరిదో? - Lok Sabha Elections 2024

బిహార్‌పైనే ఆ ఏడుగురి ఆశలు- ఫేజ్​4లో కీలక నేతలు- ఓటర్లను పోలింగ్‌ బూత్‌లకు రప్పించడమే పెద్ద సవాల్! - Lok sabha elections 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.