ETV Bharat / opinion

నిరుద్యోగులే కాంగ్రెస్ టార్గెట్​​- రాహుల్​ 5హామీలపై హస్తం పార్టీ మెయిన్ ఫోకస్

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 9, 2024, 2:26 PM IST

Congress Unemployment Guarantees : కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ ప్రకటించిన ఐదు హామీలను ముఖ్యంగా యువత సహా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించింది పార్టీ అధిష్ఠానం. మార్చి 8, 9 తేదీల్లో మీడియా సమావేశాలు నిర్వహించి హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ముఖ్య నేతలకు లేఖలు రాసింది.

Congress Unemployment Guarantees :
Congress Unemployment Guarantees :

Congress Unemployment Guarantees : త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్​ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ ప్రకటించిన ఐదు హామీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఈ మేరకు జాతీయ నేతలతో పాటు పీసీసీ అధ్యక్షులు, సీఎల్​పీ నేతలు, ఏఐసీసీ కార్యదర్శులకు లేఖలు రాసింది అధిష్ఠానం. వారి రాష్ట్రాల్లో మార్చి 8, 9 తేదీల్లో మీడియా సమావేశాలు నిర్వహించి రాహుల్​ ప్రకటించిన ఐదు హామీలను ప్రజలకు వివరించాలని సూచించింది. దేశంలోని ప్రతి మూలకు ఐదు హామీలను తీసుకెళ్లాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ లేఖలో పేర్కొన్నారు.

"దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువకుల పాత్ర కీలకం. ఈ విషయాన్ని అర్థం చేసుకుని నిరుద్యోగం, సామాజిక భద్రత సమస్యలపై దృష్టి సారించాం. దేశంలో యువకులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోదీ 2014లో అధికారంలోకి వచ్చారు. కానీ తర్వాత ఆ హామీని పట్టించుకోలేదు. ఇప్పుడు మేము ఉద్యోగాల అంశాన్ని తీసుకువస్తే, దృష్టి మార్చేందుకు పాకిస్థాన్​ గురించి మాట్లాడుతున్నారు. గత 45 ఏళ్లను గమనిస్తే ఇదే అత్యధిక నిరుద్యోగ రేటు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలే ఈ పరిస్థితికి కారణం. ఉపాధి లేకపోవడం వల్ల యువత నేరాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు లేక మన దేశ యువత సుమారు 10 గంటలపాటు సోషల్​ మీడియా​లోనే ఉంటుందని రాహుల్ గాంధీ ఇప్పటికే చెప్పారు. ఈ ఐదు హామీలు యువతను మా పార్టీవైపు తిప్పుతాయి."

--అభిషేక్​ దత్​, ఏఐసీసీ కార్యదర్శి

భారత్‌ జోడో న్యాయ్‌యాత్ర మధ్యప్రదేశ్‌ నుంచి రాజస్థాన్‌లోకి ప్రవేశించగా, బాన్స్‌వారాలో నిర్వహించిన సభలో ఐదు హామీలను ప్రకటించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. వచ్చే ఎన్నికల్లో తాము గెలిస్తే దేశవ్యాప్తంగా 30 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. డిప్లొమా/ డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్న యువతకు అప్రంటీస్‌షిప్‌ శిక్షణ ఇప్పించి వారిలో నైపుణ్యాన్ని కల్పిస్తామన్నారు. అప్రంటీస్‌షిప్‌ హక్కు చట్టాన్ని తీసుకురావడం ద్వారా 25 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నవారికి శిక్షణ కల్పించి ప్రభుత్వ/ ప్రైవేటురంగంలో ఉపాధి లభించేలా చూస్తామన్నారు. ఉద్యోగ నియామక పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీలను అరికట్టేందుకు కఠినమైన చట్టాన్ని అమలుచేస్తామని హామీ ఇచ్చారు. గిగ్‌ వర్కర్లకు సామాజిక భద్రత కల్పిస్తామని తెలిపారు. అలాగే, స్టార్టప్‌ల కోసం రూ.5వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేసి జిల్లాల వారీగా పంపిణీ చేస్తామని వివరించారు. యువత సొంత వ్యాపారాలు ప్రారంభించేందుకు ఈ నిధి ఉపయోగపడుతుందన్నారు. 30లక్షల ఉద్యోగాల భర్తీపై నమ్మకాన్ని కల్పించేందుకు పూర్తి సమాచారంతో వివరణ ఇచ్చింది కాంగ్రెస్​.

ఏయే శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ

  • కేంద్ర మంత్రిత్వ శాఖల్లో 9లక్షలు
  • ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2లక్షలు
  • ఆరోగ్య శాఖలో 1.6లక్షలు
  • 1.76లక్షల అంగన్​వాడీ కార్మికులు
  • కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో 16,329
  • రాష్ట్ర పాఠశాలల్లో 8.3లక్షల
  • ఉన్నత విద్యాసంస్థల్లో 18,000
  • ఐఐటీ, ఐఐఎమ్​, నిట్​ లాంటి సంస్థల్లో 16,687
  • ఆర్మీలో లక్ష, కేంద్ర సాయుధ బలగాల్లో 91,929
  • రాష్ట్ర పోలీసు శాఖల్లో 5.3లక్షలు
  • సుప్రీం కోర్టులో 4, హైకోర్టులో 419
  • జిల్లా స్థాయి, దిగువ కోర్టుల్లో 4,929

అమేఠీపైనే అందరి దృష్టి
మరోవైపు ఉత్తర్​ప్రదేశ్​లోని అమేఠీ లోక్​సభ స్థానంపై కాంగ్రెస్​ పార్టీ ఇప్పటివరకు స్పష్టతనివ్వలేదు. కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేరళలోని వయనాడ్​ స్థానం పోటీ చేస్తుండడం వల్ల ఇప్పుడు అందరి దృష్టి అమేఠీకి మళ్లింది. తొలి జాబితాను ప్రకటించకముందు రాహుల్​, ఈసారి అమేఠీ నుంచే బరిలో దిగుతున్నారని జోరుగా ప్రచారం సాగింది. కానీ, వాటన్నింటికి చెక్​ పెడుతూ కేరళలోని వయనాడ్​ నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు రాహుల్​. మరోవైపు అమేఠీ అభ్యర్థిని ప్రకటించకపోవడం వల్ల అక్కడ కూడా పోటీ చేస్తారా అన్న సందేహం వస్తుంది. దక్షిణ, ఉత్తర భారతాన్ని సమతూకం చేసేందుకు 2019 సార్వత్రిక ఎన్నికల్లో లాగా రెండు స్థానాల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

అమేఠీ కాంగ్రెస్‌కు కంచుకోట. 1967లో ఈ స్థానం ఏర్పాటు చేసిన నాటి నుంచి వరుసగా 2019 వరకు ఆ పార్టీకి చెందిన అభ్యర్థులే విజయం సాధించారు. ఇక్కడి నుంచి సంజయ్‌ గాంధీ రెండు సార్లు, రాజీవ్‌ గాంధీ మూడు సార్లు, సోనియా గాంధీ ఒకసారి బరిలో నిలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. 2002 నుంచి ఆ పార్లమెంట్‌ స్థానంలో రాహుల్‌ పోటీ చేస్తున్నారు. 2019 మినహా మిగిలిన అన్ని సార్లు ఆయనే గెలిచారు. గత ఎన్నికల్లో మాత్రం బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో తొలిసారి ఈ స్థానం కాంగ్రెస్‌ చేజారినట్లైంది. మరోవైపు ఈ సారి కూడా బీజేపీ తరపున స్మృతి బరిలో నిలిచారు.

"2019లో రాహుల్​ గాంధీ వయనాడ్​ నుంచి పోటీ చేయడం వల్ల రాష్ట్రంలోని 20 స్థానాల్లో 19 గెలిచాం. ఆయన అభ్యర్థిగా పోటీలో ఉండడం వల్ల పక్క స్థానాలైన కాసర్​గోడ్​, పాలక్కాడ్, కన్నూర్​, వడగరలో ఎంతో ప్రభావం చూపింది. అంతకుముందు 13-14 స్థానాలే గెలిచేవాళ్లం. 2019లో రాహుల్​ నాలుగు లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. వయనాడ్​ రాహుల్​ గాంధీకి రెండో ఇల్లు. సీపీఐ అభ్యర్థి అన్నీ రాజా మాకు పోటీ కాదు. ఏ పార్టీకైనా అభ్యర్థిని నిలబెట్టే హక్కు ఉంటుంది. వారిని మేము గౌరవిస్తాం. కానీ కచ్చితంగా రాహుల్ గాంధీ అదే మెజారిటీతో ఘన విజయం సాధిస్తారు. ఒకవేళ 2019లో అళప్పుజ అభ్యర్థిగా కేసీ వేణుగోపాల్​ను ప్రకటిస్తే 20 స్థానాల్లో గెలిచేవాళ్లం"

--పీసీ విష్ణునథ్​, ఏఐసీసీ కార్యదర్శి

అంతకుముందు శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్‌, AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేశ్‌ బఘేల్‌ సహా 39 మంది పేర్లతో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల చేసింది. ఈ తొలి జాబితాలో ప్రకటించిన 39 మందిలో 15 మంది జనరల్‌, 24 మంది ఎస్​సీ/ఎస్​టీ/ఓబీసీ/మైనార్టీ కేటగిరీకి చెందినవారు ఉన్నారు. తొలి జాబితాలో 12 మంది అభ్యర్థులు 50 ఏళ్లు లోపువారే ఉన్నారు. అయితే, ఉత్తర్​ప్రదేశ్​ సహా పలు రాష్ట్రాల్లో అభ్యర్థుల పేర్లను ఇంకా వెల్లడించలేదు. కాగా, గతవారం భారతీయ జనతా పార్టీ 195మంది పేర్లతో తొలిజాబితా విడుదల చేసింది.

హిమాచల్​లో ఎందుకిలా? బీజేపీ 'ఆపరేషన్ కమలం' అప్పుడే స్టార్ట్ చేసిందా?

యంగ్​ ఓటర్లే టార్గెట్​గా కాంగ్రెస్​ మ్యానిఫెస్టో- యువతకు 'ఉపాధి హక్కు' హామీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.