ETV Bharat / international

'పాకిస్థాన్​కు మోదీ లాంటి నాయకుడు కావాలి- మూడోసారి ఆయనే ప్రధాని'- పాక్​ అమెరికన్​ వ్యాపారవేత్త - pakistan businessman on modi

author img

By ETV Bharat Telugu Team

Published : May 15, 2024, 10:27 AM IST

Updated : May 15, 2024, 11:02 AM IST

Pakistan Businessman On Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీ చాలా బలమైన నాయకుడని, అలాంటి నాయకత్వం యావత్​ ప్రపంచానికి మంచి చేస్తుందని పాక్‌-అమెరికన్‌ వ్యాపారవేత్త సాజిద్‌ తరార్‌ అన్నారు. పాకిస్థాన్​లో కూడా అలాంటి నాయకుడు రావాలని పేర్కొన్నారు.

India Next PM Modi
India Next PM Modi (ANI)

Pakistan Businessman On Modi : భారత ప్రధానిగా మూడోసారీ నరేంద్ర మోదీయే ఎన్నికవుతారని, అలాంటి బలమైన నాయకుడు ఉండటం యావత్ ప్రంచానికి మంచి చేస్తుందని పాక్‌-అమెరికన్‌ వ్యాపారవేత్త సాజిద్‌ తరార్‌ అన్నారు. దేశాన్ని ఆయన సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లారని కొనియాడారు. పాకిస్థాన్​లో సమస్యలన్నింటినీ పరిష్కరించగలిగే ఇలాంటి నాయకుడొకరు రావాలని ఆకాంక్షించారు.

'మోదీ అద్భుతమైన నాయకుడు. పుట్టుకతోనే లీడర్‌. ఆయన నాయకత్వం కేవలం భారత్‌కే కాదు, మొత్తం ప్రపంచానికీ మంచి చేస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ పాకిస్థాన్‌లో పర్యటించి, తన రాజకీయ భవితవ్యాన్ని పణంగా పెట్టిన ఏకైక ప్రధాని. మాకూ అలాంటి నాయకుడు రావాలని ఆశిస్తున్నాం. పాకిస్థాన్‌తో చర్చలు జరిపి వాణిజ్యం ప్రారంభిస్తారని అనుకుంటున్నాం. శాంతియుత వాతావరణం ఇరుదేశాలకూ మంచిది' అని సాజిత్ తరార్‌ అన్నారు.

సాజిత్ తరార్​ 1990లో అమెరికాకు వెళ్లారు. ఇప్పటికీ పాకిస్థాన్​ రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. భారత్‌లో 97 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోవడం ఓ అద్భుతమని సాజిత్​ తరార్‌ పేర్కొన్నారు. 'మోదీ ఆదరణ రోజురోజుకీ పెరుగుతోంది. 2024లో భారత పురోగతి అత్యద్భుతం. ఆ దేశ విజయాన్ని అందరూ చెప్పుకొంటారు. భవిష్యత్తులో ప్రతిఒక్కరూ భారత ప్రజాస్వామ్యాన్ని చూసి నేర్చుకుంటారు' అని తరార్‌ అభిప్రాయపడ్డారు.

పీవోకే నిరసనలకు కారణమిదే
పాకిస్థాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోందని తరార్‌ గుర్తుచేశారు. ఇది పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ సహా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సామాజిక అస్థిరతకు దారితీసిందని పేర్కొన్నారు. విద్యుత్తు బిల్లులు పెరగడమే పీవోకేలో నిరసనలకు ప్రధాన కారణమని వెల్లడించారు. పీవోకేకు ఆర్థిక సాయం అందజేయాలన్న పాక్‌ ప్రధాని నిర్ణయాన్ని తరార్‌ ప్రశ్నించారు. డబ్బు ఎక్కడి నుంచి వస్తోందని నిలదీశారు.

'పాక్‌లో సమస్యల్ని ఎలా పరిష్కరించాలనే దానిపై ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. ఉగ్రవాదాన్ని ఎలా అదుపులోకి తేవాలి? శాంతి భద్రతలను ఎలా మెరుగుపర్చాలి? పీవోకేలో అస్థిరత కొనసాగుతోంది. అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ సమస్యలన్నింటి నుంచి గట్టెక్కించే నాయకొడకరు రావాలని ఆశిస్తున్నాం' అని తరార్‌ అన్నారు.

పీవోకేలో ఆగని హింస
మరోవైపు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)లో మళ్లీ హింస చెలరేగింది. పెరిగిన గోధుమ ధరలు, విద్యుత్తు బిల్లులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా అక్కడి ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇటీవల పాక్‌ ప్రభుత్వం 2,300 కోట్ల పాకిస్థానీ రూపాయల సబ్సిడీని ప్రకటించడం వల్ల శాంతి నెలకొంటుందని అంతా భావించారు. అయితే తాజాగా సైన్యం జరిపిన కాల్పుల్లో మరో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 100 మందికిపైగా గాయపడ్డారు. పీవోకేలో శాంతి భద్రతలు నెలకొల్పడానికి వచ్చిన సైన్యం తిరిగి వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మొత్తం 11 వాహనాలతో సైనిక బృందం ముజఫరాబాద్‌ మీదుగా వెళుతున్నపుడు ఆందోళనకారులు భారీస్థాయిలో రాళ్లు రువ్వారు. దీంతో సైన్యం కాల్పులు జరిపింది. బాష్పవాయువును ప్రయోగించింది.

'రెండేళ్ల యూకే గ్రాడ్యుయేట్ వీసాను కొనసాగించాల్సిందే'- విదేశాలకు వెళ్లే విద్యార్థులకు గుడ్​ న్యూస్​ - UK Graduate Visa

'గేట్స్' ఫౌండేషన్‌కు మెలిండా రాజీనామా- రూ.లక్ష కోట్ల వాటా- బాధగా ఉందన్న మాజీ భర్త! - Melinda Gates Foundation

Last Updated : May 15, 2024, 11:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.