ETV Bharat / international

'పూర్తి కాల్పుల విరమణ పాటిస్తే బందీల విడుదలకు రెడీ'- స్పష్టం చేసిన హమాస్

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2024, 10:12 AM IST

Israel Gaza Ceasefire : సంపూర్ణ కాల్పుల విరమణ పాటిస్తేనే బందీల విడుదల ఒప్పందానికి అంగీకరిస్తామని హమాస్​ తేల్చిచెప్పింది. మరోవైపు, గాజాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు శ్మశాన వాటికల్లోనే శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ కూడా తలదాచుకునేందుకు పోటీ పడుతున్నారు.

Israel Gaza Ceasefire
Israel Gaza Ceasefire

Israel Gaza Ceasefire : గాజా పట్టీపై జరుగుతున్న దాడుల్ని ఆపేసి సంపూర్ణ కాల్పుల విరమణ పాటిస్తేనే బందీల విడుదల ఒప్పందానికి తాము అంగీకరిస్తామని ఇజ్రాయెల్‌కు హమాస్‌ స్పష్టం చేసింది. అయితే ఈ హెచ్చరికను​ బేఖాతరు చేస్తూ హమాస్‌ డిమాండ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఇజ్రాయెల్ తెగేసి చెబుతోంది. దీంతో యుద్ధం కారణంగా నెలకొన్న సంక్షోభం ఇప్పట్లో పరిష్కారం అయ్యే సూచనలు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు.

'మా పౌరులపై ఇజ్రాయెస్​ చేస్తున్న దాడుల్ని వెంటనే ఆపేయాలి. అంతేకాకుండా విస్తృత, సమగ్ర కాల్పుల విరమణను పాటించాలి. గాజా పునర్నిర్మాణాన్ని చేపట్టాలి. ఇజ్రాయెల్‌ జైళ్లలో బందీలుగా ఉన్న పాలస్తీనా ఖైదీలను తక్షణమే విడుదల చేయాలి. వీటికి అంగీకరిస్తేనే మేం ఒప్పందాన్ని సానుకూలంగా స్వీకరిస్తాం' అని హమాస్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, హమాస్‌ చెరలో ఉన్న ఇజ్రాయెలీల విడుదల కోసం అమెరికా, ఖతార్‌ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో హమాస్​ మిలిటెంట్లు ఈ వ్యాఖ్యలు చేశారు.

ఖతార్​ ప్రధాని భిన్న ప్రకటన
ఒకవైపు హమాస్​ మిలిటెంట్లు సంపూర్ణ కాల్పుల విరమణ పాటిస్తేనే తప్ప బందీల విడుదల ఒప్పందానికి అంగీకరించబోమని తేల్చిచెప్పిన నేపథ్యంలో దీనిపై భిన్న ప్రకటన చేశారు ఖతార్​ ప్రధాని షేక్​ మహమ్మద్​ బిన్​ అబ్దుల్​రెహమాన్ అల్ థానీ. గాజా పట్టీపై సంపూర్ణ కాల్పుల విరమణ ప్రతిపాదన అంగీకారానికి హమాస్​ గ్రూప్​ సానుకూలంగా ఉందని ఆయన మంగళవారం ఓ ప్రకటనలో చెప్పారు.

'ఖాళీ చేసి వెళ్లిపోండి'
Gaza Strip Conflict : గతేడాది అక్టోబరు 7న హమాస్‌ దాడులతో ఉలిక్కిపడ్డ ఇజ్రాయెల్‌ ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా గాజాపై ఎదురుదాడులకు దిగుతోంది. ఇందులో భాగంగా పాలస్తీనీయులు తమ ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశిస్తోంది. గాజా భూభాగంలో 246 చ.కి.మీల మేర ప్రాంతంలో ప్రస్తుతం ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయని ఐరాస మానవతా వ్యవహారాల సంస్థ వెల్లడించింది. యుద్ధం ప్రారంభానికి ముందు ఇక్కడ 17 లక్షల మంది ఉండేవారని, మొత్తం జనాభాలో వీరు 77 శాతమని పేర్కొంది.

ఈజిప్టు అలర్ట్​
మరోవైపు గాజా నగరం తమ దేశ సరిహద్దులో ఉండటం వల్ల ఈజిప్టు అలర్ట్​ అయింది. సరిహద్దు వెంబడి పెద్ద ఎత్తున బలగాలను మోహరించడమే కాకుండా గతంలో చేసుకున్న శాంతి ఒప్పందానికి విఘాతం కలిగిస్తుందని టెల్‌ అవీవ్‌ను హెచ్చరించింది. దాడుల భయంతో పాలస్తీనాకు చెందిన పౌరులు తమ భూభాగంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది ఈజిప్టు. ఒకవేళ ఇదే జరిగితే అక్రమ చొరబాట్లను అడ్డుకుంటామని స్పష్టం చేసింది.

శ్మశాన వాటికల్లోనే శిబిరాలు
ఇజ్రాయెల్‌పై హమాస్‌ సృష్టించిన మారణహోమంతో లక్షల మంది ప్రజలు నిరాశ్రయులైయ్యారు. ప్రస్తుతం వీరంతా శరణార్థుల శిబిరాలతో పాటు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజల దయనీయ స్థితిని తెలియజేసే విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు శ్మశాన వాటికల్లోనే శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ కూడా తలదాచుకునేందుకు పోటీ పడుతున్నారు.

'సమాధులపైనే నిద్రిస్తున్నాం'
తాము ఎదుర్కొంటున్న భయానక పరిస్థితులను వివరిస్తూ మీడియా ముందు కన్నీరు పెట్టుకుంది బాధిత మహమూద్‌ అమెర్‌ కుటుంబం. ఆశ్రయం పొందడానికి శిబిరాలు కూడా అందుబాటులో లేకపోవడం వల్ల తమ కుటుంబాలతో కలిసి శ్మశానంలోని సమాధుల మధ్యే నివస్తున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. సరైన ఆహారం, నీరు దొరక్క గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నామని మరో కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. 'మేమంతా సమాధులపైనే నిద్రిస్తున్నాం. పిల్లలు కూడా వాటిపైనే ఆడుకుంటున్నారు. ప్రతి క్షణం కళ్ల ముందే మరణాలను చూస్తూ బతుకుతున్నాం' అని ఓ పౌరుడు వాపోయాడు. కాగా, ఇజ్రాయెల్‌ దాడులవల్ల గాజాలో ఇప్పటి వరకూ 27,478 మంది మృతి చెందారు.

రష్యా ఆక్రమిత ప్రాంతంలో భీకర దాడి - 28 మంది మృతి

క్యాన్సర్‌ బారిన పడిన బ్రిటన్‌ రాజు- బహిరంగ కార్యక్రమాలకు దూరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.