ETV Bharat / international

'ఇరాన్​పై ప్రతీకారం తీర్చుకుంటాం, 'ఆపరేషన్​ ఐరన్​ షీల్డ్​' అనివార్యం'- ఇజ్రాయెల్ ప్రకటన - Iran Israel War

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 16, 2024, 7:32 AM IST

Updated : Apr 16, 2024, 8:30 AM IST

Iran Israel War
Iran Israel War

Iran Israel War : తమ దేశంపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్​ జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ప్రతిదాడికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్​ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మరోవైపు అత్యవసరంగా సమావేశమైన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది.

Iran Israel War : పస్చిమాశియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తతంగా మారడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. తమ దేశంపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్‌ జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఆ దేశంపై ప్రతిదాడి తప్పదని ఇందుకోసం ఆపరేషన్‌ 'ఐరన్‌ షీల్డ్‌' చేపడతామని ఇజ్రాయెల్‌ రక్షణ బలగాల అధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ హెర్జిహలేవి స్పష్టం చేశారు. తమ వ్యూహాత్మక సామర్థ్యాలను దెబ్బతీయాలని ఇరాన్​ భావించిందని, ఇలాంటి ఘటనలు మునుపెన్నడూ జరగలేదని తెలిపారు.

Iran Israel War
ఇజ్రాయెల్​పై ఇరాన్​ దాడి

ప్రతిదాడి చేస్తే తీవ్రమైన పరిణామాలు
ఇప్పుడు స్పందించకుండా మౌనం వహిస్తే భవిష్యత్తులో ఇరాన్‌ నుంచి మరింత ముప్పు ఏర్పడే అవకాశం ఉందని టెల్‌ అవీవ్‌ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌ విషయం తేలేవరకు గాజాలోని రఫాపై ఆపరేషన్‌ను నిలిపివేయాలని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు నిర్ణయించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ప్రతిదాడి విషయంలో తాము ఇజ్రాయెల్‌ను నిర్దేశించలేమని నచ్చిన నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఆ దేశానికి ఉందని అమెరికా తెలిపింది. అయితే తమపై ప్రతిదాడికి ఇజ్రాయెల్‌ ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్‌ హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడిపై చర్చించేందుకు అత్యవసరంగా సమావేశమైన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది.

Iran Israel War
ఇజ్రాయెల్​పై ఇరాన్​ దాడి

ఇరాన్‌ దాడి సమయంలో తాము ఇజ్రాయెల్‌కు సాయం చేశామని సౌదీ అరేబియా తెలిపింది. ఇప్పటికే ఈ విషయాన్ని జోర్డాన్‌ బహిరంగంగానే అంగీకరించింది. శనివారం రాత్రి ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ జరిపిన డ్రోన్ల దాడిలో కొన్ని ఇరాక్‌ గగనతలంపై నుంచి వెళితే, మరికొన్ని జోర్డాన్‌, సౌదీ గగనతలాల మీదుగా దూసుకెళ్లాయి. తమ గగనతలంపైకి వచ్చిన వాటిని తాము నేలకూల్చామని సౌదీ అరేబియా తెలిపింది.

దాడి చేస్తామని ముందే చెప్పాం
ఇజ్రాయెల్‌పై దాడి సమాచారాన్ని అమెరికాకు 72 గంటలకు ముందే తెలిపామని ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రి హసేన్‌ అమీర్‌ అబ్దుల్ల్లా హియాన్‌ అన్నారు. 'పౌర లక్ష్యాలను మేం గురిపెట్టలేదు. వాణిజ్య, జనసమూహ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోలేదు. ఈ దాడి ఇజ్రాయెల్‌ను శిక్షించేందుకు, మమ్మల్ని రక్షించుకునేందుకు తీసుకున్న చర్య మాత్రమే. దీని గురించి మేం ముందుగానే అమెరికాకు సమాచారం ఇచ్చాం. మా దాడులు పరిమితంగా ఉంటాయని చెప్పాం' అని హసేన్​ పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై తమకు ఎలాంటి ముందస్తు సమాచారం అందలేదని అమెరికా పేర్కొంది. 'ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. లక్ష్యాలు ఇవి అని కూడా చెప్పలేదు. దాడి ప్రారంభమైన తర్వాతే సమాచారమిచ్చారు' అని పేర్కొంది. ఇరాక్‌, తుర్కీయే, జోర్డాన్‌ అధికారులు మాత్రం తమకు ముందస్తు సమాచారం ఇరాన్‌ నుంచి అందిందని తెలిపారు.

మహిళలే అతడి టార్గెట్​- దారుణంగా పొడిచి హత్యలు- చివరకు లేడీ పోలీస్​ చేతిలోనే హతం - Sydney Stabbing Attacker

కొండచరియలు విరిగిపడి 15మంది మృతి- 60మంది గల్లంతు - Landslide Accident In Congo

Last Updated :Apr 16, 2024, 8:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.