ETV Bharat / international

పాక్​ మాజీ ప్రధానికి మరో షాక్​- చట్టవిరుద్ధ వివాహం కేసులో ఏడేళ్లు జైలు శిక్ష

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 3, 2024, 6:17 PM IST

Updated : Feb 3, 2024, 7:04 PM IST

Imran Khan Marriage Case Update
Imran Khan Marriage Case Update

Imran Khan Marriage Case Update : పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​కు వరుస షాక్​లు తగులుతున్నాయి. ఇటీవలే 14 జైలు శిక్ష పడిన ఇమ్రాన్​కు మరో ఏడేళ్లు కారాగార శిక్ష విధించింది కోర్టు. ఆయన భార్య బుష్రా బీబీకి కూడా శిక్ష పడింది. మరో ఐదు రోజుల్లో ఎన్నికల జరగనున్ తరుణంలో ఇలా వరుస శిక్షల పడటం ఆయన నేతృత్వంలో పీటీఐ పార్టీని కలవరపాటుకు గురిచేస్తోంది.

Imran Khan Marriage Case Update : పాకిస్థాన్​ మాజీ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తోషఖానా కేసులో ఇటీవలే ఇమ్రాన్​ దంపతులకు 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. తాజాగా 'చట్ట విరుద్ధమైన వివాహం' కేసులో ఇమ్రాన్, ఆయన భార్య బుష్రా బీబీకి ఏడేళ్ల జైలు శిక్ష పడింది. అంతేకాకుండా ఇద్దరికీ రూ.5 లక్షల చొప్పున కోర్టు జరిమానా విధించింది. ఈ మేరకు సుదీర్ఘ వాదనల తర్వాత కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది.
అయితే ఈ నెల 8న పాకిస్థాన్‌లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇమ్రాన్‌కు వరుసగా శిక్షలు పడడం ఆయన నేతృత్వంలోని పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఏ-ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టివేసింది. మరోవైపు ఇప్పటివరకు ఆయనపై 150 కేసులు నమోదైనట్లు సమాచారం.

ఇదీ కేసు!
బుష్రా బీబీ, ఇమ్రాన్​ ఖాన్​ను రెండో పెళ్లి చేసుకున్నారు. దీన్ని ఆమె మొదటి భర్త ఖవార్​ మనేకా వ్యతిరేకించారు. రెండు వివాహాల మధ్య తప్పనిసరిగా విరామం పాటించే ఇస్లామిక్​ ఆచారాన్ని (ఇద్దత్​) బుష్రా బీబీ ఉల్లంఘించారని కేసు వేశారు. వారిద్దరు పెళ్లి చేసుకోకముందే వివాహేతర బంధంలో ఉన్నారని ఆరోపించారు. అది రాళ్లతో కొట్టి చంపే శిక్ష విధించే స్థాయి నేరమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖవార్​ మనేకా వేసిన కేసుపై శుక్రవారం 14 గంటల సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు ఇమ్రాన్​, బుష్రాకు ఏడేళ్ల చొప్పున శిక్ష విధిస్తూ శనివారం తీర్పు వెలువరించింది. తీర్పు వెలువడే క్రమంలో వారిద్దరూ కోర్టు హాలులోనే ఉన్నారు.

'ఇది మాకు అవమానకరం'
చట్టవిరుద్ధ కేసులో దోషిగా తేలిన తర్వాత ఇమ్రాన్​ ఖాన్ మీడియాతో మాట్లాడారు. తమను అవమానించడానికే ఈ కేసు పెట్టారని విమర్శించారు. చరిత్రలో ఇద్దత్​కు సంబంధించిన కేసు విచారించడం ఇదే మొదటి సారి అని అన్నారు. దీంతో పాటు తోషఖానా అవినీతి కేసులో 14 ఏళ్ల శిక్ష విధించడం కూడా మొదటిసారేనని చెప్పారు.

'ప్రజలు ప్రతీకారం తీర్చుకుంటారు'
ఈ తీర్పుపై ఇమ్రాన్​ పార్టీ పీటీఐ స్పందించింది. ఈ తీర్పును హై కోర్టులో సవాల్ చేస్తామని తెలిపింది. ఇమ్రాన్​కు జరిగిన అన్యాయానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ప్రతీకారం తీర్చుకుంటారని చెప్పింది.

అప్పటినుంచి జైలులోనే
ఇమ్రాన్ ఖాన్​ తోషఖానా కేసులో గతేడాది ఆగస్టు 5న అరెస్టయ్యారు. అప్పటినుంచి కొద్దిరోజులు అట్టాక్​ జైలులో ఉన్నారు. ఆ తర్వాత అదియాలా జైలుకు ఇమ్రాన్​ను మార్చారు. ఇటీవల ఈ కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. ఇమ్రాన్​, అతడి భార్య బుష్రా బీబీకి 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

అయితే అంతకు కొద్ది గంటల ముందే అధికారిక రహస్య పత్రాల దుర్వినియోగం (సైఫర్‌ ) కేసులో ఆయనకు పదేళ్ల శిక్ష పడింది. ఈ కేసులో పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి మహమూద్‌ ఖురేషీకి కూడా 10 ఏళ్ల జైలుశిక్షను విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. రావల్పిండిలోని అడియాలా జైలులో జరిగిన కేసు విచారణ సందర్భంగా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అబుల్ హస్నత్ జుల్కర్నైన్‌ ఈ తీర్పును ఇచ్చారు.

అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్​ దంపతులకు 14 ఏళ్లు జైలు శిక్ష

పాక్​ మాజీ ప్రధానికి బిగ్ షాక్​ - ఇమ్రాన్ ఖాన్​కు 10 ఏళ్ల జైలుశిక్ష

Last Updated :Feb 3, 2024, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.