ETV Bharat / entertainment

సావిత్రి ముందు డాన్స్ చేస్తూ కాలుజారి పడ్డా- నాగుపాము స్టెప్ అదే: చిరు - Chiranjeevi Savithri

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 3, 2024, 7:42 AM IST

Updated : Apr 3, 2024, 7:48 AM IST

Chiranjeevi Savithri: మహానటి సావిత్రి సినీ ప్రస్థానంపై సంజయ్ కిషోర్ రచించిన 'సావిత్రి క్లాసిక్స్' అనే పుస్తకావిష్కరణ వేడుక హైదరాబాద్​లో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్​హా హాజరైన మెగాస్టార్ చిరంజీవి సావిత్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

chiranjeevi
chiranjeevi

Chiranjeevi Savithri: మహానటి సావిత్రి సినీ ప్రస్థానంపై రచయిత సంజయ్ కిషోర్ 'సావిత్రి క్లాసిక్స్' అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకావిష్కరణ వేడుక మంగళవారం హైదరాబాద్​లో ఘనంగా జరిగింది. సావిత్రి కుమార్తె విజయ ఛాముండేశ్వరి సమక్షంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్​లో ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ ఈవెంట్​కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహానటితో ఆయనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా చిరంజీవి గుర్తుచేసుకున్నారు.

మహానటి సావిత్రి కళ్లతో హావభావాలు పలికించగలిగే ఏకైక తెలుగు నటి అని చిరంజీవి కొనియాడారు. అలాంటి నటితో మంచి నటుడు అవుతానని అనిపించుకోవడం తనకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందని చిరంజీవి అన్నారు. ఆమెతో కలిసి నటించడం తన పూర్వజన్మ సుకృతంగా భావించినట్లు పేర్కొన్న చిరంజీవి ఆమెను తొలిసారి కలిసిన సందర్భాన్ని గుర్తుచేశారు.

'1978లో పునాదిరాళ్లు సినిమా కోసం మేం రాజమండ్రి వెళ్లాం. అప్పుడు నాకు తెలీదు ఆ సినిమాలో మహానటి సావిత్రి గారు నటిస్తున్నారని. ఆ విషయం ఎవరో మూవీ టీమ్​ వాళ్లు నాకు చెప్పే సరికి నా ఒళ్లు జలదరించింది. ఇక రాజమండ్రిలో మూవీటీమ్ వాళ్లు ఓ రోజు సావిత్రి గారిని పరిచయం చేసినప్పుడు నా ఆనందం అంతా ఇంతా కాదు. ఆవిడను డైరెక్ట్​గా చూసేసరికి ఏమీ మాట్లాడలేకపోయాను. 'నీ పేరేంటి? బాబు' అని సావిత్రిగారు అడగ్గానే చిరంజీవి అని చెప్పేశా' అని చిరంజీవి తొలిసారి సావిత్రిని కలిసిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు.

'ఆ సినిమా షూటింగ్​లో ఓ రోజు వర్షం కురిసింది. దీంతో సినిమాలో నటిస్తున్న ఆర్టిస్ట్​లు అంతా ఓ చోట కూర్చున్నాం. అప్పుడు సావిత్రిగారు 'మీకు తెలుసా, ఈ అబ్బాయి చిరంజీవి, డాన్స్ బాగా చేస్తాడు. ఎయ్ చిరంజీవి డాన్స్ చేయవయ్య' అని అడిగారు. ఆవిడ అడగటమే ఆలస్యం నేను రెడీ అయ్యాను. వెంటనే నా దగ్గర ఉన్న టేప్ రికార్డర్​లో పాట పెట్టి డాన్స్ చేశా. ఫ్లోర్​పై వర్షం నీరు కారణంగా డాన్స్ చేస్తుండగా కాలుజారి నేను కింద పడ్డాను. అయినా దాన్నికూడా డాన్స్ స్టెప్​గా కవర్ చేసేసరికి అందరూ మెచ్చుకున్నారు. వెంటనే సావిత్రిగారు నన్ను దగ్గరితి తీసుకొని భవిష్యత్​లో మంచి నటుడివి అవుతావు అని అన్నారు' అని చిరంజీవి పేర్కొన్నారు.

ఇక ఈ కార్యక్రమంలో సినీ విశ్లేషకులు, సీనియర్ నటీనటులు మురళీమోహన్, జయసుధ, హాస్యనటులు బ్రహ్మానందం, తనికెళ్ల భరిణి, అల్లు అరవింద్ హాజరై సినీ రంగంలో సావిత్రి సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ పుస్తకావిష్కరణ వేడుకలో చిరంజీవి సతీమణి సురేఖ, సావిత్రి కుమార్తె విజయ ఛాముండేశ్వరి మధ్య జరిగిన సంభాషణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కోపంతో ఊగిపోయి నాగబాబును కొట్టిన చిరంజీవి! - Chiranjeevi Nagababu

జమున సినీ ఎంట్రీ వెనక మహానటి సావిత్రి హస్తం.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

Last Updated : Apr 3, 2024, 7:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.