ETV Bharat / business

అంగన్వాడీలు, ఆశావర్కర్లకు ఆయుష్మాన్ భారత్ కార్డులు - గృహ రుణాలు!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 12:47 PM IST

Updated : Feb 1, 2024, 1:02 PM IST

Union Interim Budget 2024 In Telugu : ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ బడ్జెట్​ ప్రసంగంలో అంగన్వాడీలకు, ఆశావర్కర్లకు కూడా ఆయుష్మాన్ భారత్​ కార్డులు అందిస్తామని ప్రకటించారు. కానీ బీమా కవరేజీని రూ.5 లక్షలకు మించి పెంచలేదు. ఇది సామాన్యులను తీవ్ర నిరాశకు గురి చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు.

union interim budget 2024
ayushman bharat budget 2024

Union Interim Budget 2024 : ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ బడ్జెట్​ ప్రసంగంలో అంగన్వాడీలకు, ఆశావర్కర్లకు కూడా ఆయుష్మాన్ భారత్​ కార్డులు అందిస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్​ యోజన కింద ఇప్పటి వరకు రూ.5 లక్షల బీమా కవరేజీని అందిస్తోంది. అయితే దీనిని రూ.10 లక్షల వరకు పెంచుతారని అందరూ భావించారు. కానీ నిర్మలా సీతారామన్ ఆ ఊసే ఎత్తలేదు. ఇది పేదలందరినీ తీవ్ర నిరాశకు గురిచేసింది.

మహిళలు లక్షాధికారులు అయ్యారు!
83 లక్షల స్వయం సహాయక సంఘాల ద్వారా 9 కోట్ల మంది మహిళలు ఆర్థికంగా ఉన్నతి సాధించారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు. ఇప్పటికే ఒక కోటి మంది లక్షాధికారులుగా తయారయ్యారని పేర్కొన్నారు. మరో 2 కోట్ల నుంచి 3 కోట్ల మంది మహిళలు లక్షాధికారులు కావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని నిర్మలా సీతారామన్​ పేర్కొన్నారు.

గృహ నిర్మాణం
మధ్యతరగతి ప్రజల కోసం నూతన గృహ నిర్మాణ విధానం అందుబాటులోకి తెస్తున్నామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. మురికివాడలు, అద్దె ఇళ్లలో ఉంటున్నవారు ఇళ్లు కట్టుకోవడానికి, ఇళ్లు కొనుగోలు చేయడానికి మోదీ ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు. పీఎం ఆవాస్‌ యోజన కింద రానున్న ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె చెప్పారు.

సొంతింటి నిర్మాణం కోసం తీసుకొచ్చిన 'పీఎం ఆవాస్‌ యోజన గ్రామీణ్‌' కొవిడ్​ 19 సంక్షోభ కాలంలోనూ కొనసాగిందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. 3 కోట్ల ఇళ్ల నిర్మాణం లక్ష్యాన్ని త్వరలో చేరుకుంటామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్​
విద్యుత్‌ బిల్లుల నుంచి సామాన్య ప్రజలకు విముక్తి కలిగించేందుకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ఒక నూతన పథకాన్ని ప్రకటించారు. రూఫ్‌టాప్‌ సోలారైజేషన్‌ స్కీమ్‌ ద్వారా దేశంలోని కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని పేర్కొన్నారు. దీనివల్ల పేదలకు ఏటా రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు ఆదా అవుతుందని ఆమె తెలిపారు.

డిజిటల్ బడ్జెట్​
Digital Budget 2024 : ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గత పదేళ్లలో తమ సర్కారు సాధించిన విజయాలను తెలియజేశారు. ఇకపై తమ ప్రభుత్వం దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటుందో కూడా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. కానీ పేదలు, మహిళలు, వ్యవసాయదారులు, పారిశ్రామికవేత్తలు, సేవారంగానికి చెందినవారు ఆశించిన ఎలాంటి వరాలు ప్రకటించలేదు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ సర్కార్ ఈ మధ్యంతర బడ్జెట్లో పలు తాయిలాలు ప్రకటిస్తుందని అందరూ భావించారు. కానీ అలాంటివి ఏవీ ప్రకటించకపోవడం ఆశ్చర్యకరం.

బడ్జెట్ ప్రతులు చూడండిలా!
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్​ను డిజిటల్ రూపంలో అందుబాటులోకి తెచ్చింది. https://www.indiabudget.gov.in/ వెబ్​సైట్​ల్లో, యూనియన్ బడ్జెట్ యాప్​లో ఈ మధ్యంతర బడ్జెట్ పత్రాలను చూడవచ్చు.

బడ్జెట్​కు ముందు షాక్- గ్యాస్ సిలిండర్ ధర పెంపు

ఊరట ఇవ్వని కేంద్ర బడ్జెట్! పన్ను విధానంలో మార్పుల్లేవ్!

Last Updated : Feb 1, 2024, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.