ETV Bharat / business

డెడ్‌లైన్ మార్చి 31: ట్యాక్స్ బెనిఫిట్స్ కావాలా? ఈ ఏడు మార్గాలు పాటిస్తే చాలు! - Tax Saving Ways

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 21, 2024, 4:43 PM IST

Tax Saving Ways : ట్యాక్స్ బెనిఫిట్స్ పొందాలంటే త్వరపడండి! ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డెడ్‌లైన్ మార్చి 31తో ముగియనుంది. ఆలోగా పన్ను ఆదా కోసం ఉపయోగపడే చక్కటి మార్గాలను వాడుకోండి. అవేంటంటే?

tax saving schemes in india
tax saving schemes in india

Tax Saving Ways : ట్యాక్స్ బెనిఫిట్స్ పొందాలని ఎవరికి మాత్రం ఉండదు!! అందుకోసం దొరికే ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రతీ ఒక్కరు ప్రయత్నిస్తారు. అలాంటి కొన్ని అవకాశాలే ఇప్పుడు మన ముందు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకునేందుకు డెడ్‌లైన్ మార్చి 31తో ముగుస్తుంది. ఎందుకంటే ఆ తేదీతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పెట్టుబడులపై ముందుచూపుతో తగిన ప్లానింగ్ చేసుకునే వారంతా ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం అనుసరించాల్సి ఏడు విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. పన్ను ఆదా- ప్రయోజనకర ఆప్షన్లు
నెలవారీ శాలరీ పొందే వ్యక్తులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులను పొందొచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) వంటి ఆప్షన్లను వాడుకోవచ్చు. మన శాలరీ బేసిక్‌లో 12 శాతాన్ని నెలవారీ పెట్టుబడిగా ఈపీఎఫ్‌లోకి మళ్లించవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) అనేది 15 సంవత్సరాల సురక్షితమైన ప్రభుత్వ పెట్టుబడి పథకం. దీనిలో 7 సంవత్సరాల తర్వాత పాక్షిక లిక్విడిటీ లభిస్తుంది. అంటే అమౌంట్‌ను కొంతమేర విత్‌డ్రా చేయొచ్చు. మన పెట్టుబడిపై దాదాపు 8 శాతం రాబడిని పొందొచ్చు. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌లు కనీసం 3 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్‌తో వస్తాయి. ఇవి స్టాక్ మార్కెట్ లింక్డ్ రిటర్న్‌లను అందిస్తాయి. ఈ మార్గాల ద్వారా రూ. 1.5 లక్షల వరకు పన్ను ఆదా అవడంతో పాటు మీ పెట్టుబడులు క్రమంగా పెరుగుతాయి.

2. పన్ను ఆదా- ప్రభుత్వ పథకాలు
ప్రభుత్వ పథకాల్లో చేరడం ద్వారా మీరు పన్ను ప్రయోజనాలను పొందొచ్చు. రాబడిని కూడా గణనీయంగా పెంచుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C మీ మొత్తం వార్షిక ఆదాయం నుంచి రూ. 1.5 లక్షల వరకు తగ్గింపును అనుమతిస్తుంది. పన్ను మినహాయింపుల కోసం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), సుకన్య సమృద్ధి యోజన (SSY), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లను వాడుకోవచ్చు.

3. ఎలక్ట్రిక్ వాహనం లోన్‌పై వడ్డీ చెల్లింపులు
ఎలక్ట్రిక్ వాహనాన్ని లోన్‌పై కొన్నవారు కూడా పన్ను ప్రయోజనాలను అందుకోవచ్చు. అయితే 2019 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 31 మధ్యకాలంలో ఎలక్ట్రిక్ వాహనం కొన్నవారు ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 80EEB కింద పన్ను ప్రయోజనం పొందేందుకు అర్హులు.గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు లోన్ వడ్డీ చెల్లింపులపై ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుంది. ఈ వడ్డీని పన్ను చెల్లింపుదారుడు క్లెయిమ్ చేసుకోవచ్చు. వ్యక్తిగత లేదా వ్యాపార అవసరాల కోసం ఎలక్ట్రిక్ వాహనాన్ని కొన్న వారంతా ఈ ప్రయోజనాన్ని పొందొచ్చు.

4. ఆరోగ్య బీమా ప్రీమియంలపై తగ్గింపులు
ఆరోగ్య బీమా ప్రీమియంలపై మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవడం ద్వారా పన్నుభారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. మీరు మీకు, మీ జీవిత భాగస్వామికి, మీపై ఆధారపడిన పిల్లలకు ఆరోగ్య బీమా ప్రీమియంలను చెల్లిస్తున్నట్లయితే రూ.25,000 వరకు తగ్గింపును పొందొచ్చు. వీరితో పాటు మీ తల్లిదండ్రుల ఆరోగ్య బీమాను కూడా చెల్లిస్తున్నట్లయితే సీనియర్ సిటిజన్ కేటగిరీలో రూ.50వేల దాకా పన్నుమినహాయింపు లభిస్తుంది. ఈ లెక్కన మీ కుటుంబం కోసం చెల్లించే మొత్తం ఆరోగ్య బీమా ప్రీమియంలపై సగటున రూ.75వేల నుంచి రూ.లక్ష దాకా ట్యాక్స్ బెనిఫిట్స్‌ను పొందొచ్చు.

5. స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు
సామాజిక బాధ్యతలో భాగంగా స్వచ్ఛంద సేవా సంస్థలకు మీ వంతుగా సహకారాన్ని అందించినా పన్ను ఆదా ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రధానమంత్రి సహాయ నిధికి, మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని నియంత్రించే కార్యక్రమాలకు, క్లీన్ గంగా ఫండ్‌కు, సర్టిఫికెట్ పొందిన ఎన్జీఓలకు విరాళం ఇచ్చినా పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఈ సంస్థలకు అందించే విరాళాలు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80జీ కింద పూర్తి పన్ను మినహాయింపుకు అర్హతను కల్పిస్తాయి.

6. ప్రధానమంత్రి వయ వందన యోజన
ప్రధానమంత్రి వయ వందన యోజన(PMVVY) స్కీం ఎన్‌రోల్‌మెంట్ కోసం మార్చి 31 వరకు అవకాశం ఉంది. ఈ స్కీంలో సీనియర్ సిటిజెన్లు ఒకసారి పెట్టుబడి పెడితే స్థిరమైన ఆదాయం లభిస్తుంది. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన వ్యక్తులు ఈ పథకానికి అర్హులు. ప్రస్తుతం ఈ స్కీంలో పెట్టే పెట్టుబడులకు 7.4 శాతం వార్షిక వడ్డీని చెల్లిస్తారు. PMVVY స్కీం 10 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్‌ను కలిగి ఉంటుంది.

7. నాలుగో విడత అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్
ఒక ఆర్థిక సంవత్సరంలో మీ నికర ఆదాయపు పన్ను రూ.10,000 దాటితే మీరు ముందస్తు పన్నును పే చేయాల్సి ఉంటుంది. ప్రతీ ఏడాది నాలుగు విడతల్లో తప్పనిసరిగా అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్స్ చేయాలని ఆదాయపు పన్ను చట్టం-1961 చెబుతోంది. లేదంటే జరిమానాగా వడ్డీని విధిస్తారని అంటోంది. ప్రస్తుతం 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాలుగో విడత అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులకు మార్చి 15తోనే గడువు ముగిసింది.

మీకు ఇంటి మీద ఆదాయం వస్తోందా? కచ్చితంగా ఈ 'ట్యాక్స్'​ వివరాలు తెలుసుకోండి!

ఉద్యోగుల కోసం అదిరిపోయే స్కీమ్ - ఎఫ్​డీ కంటే అధిక వడ్డీ + ట్యాక్స్ బెనిఫిట్స్​ కూడా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.