జనం సంపద స్వాధీనంపై శ్యామ్​ పిట్రోడా కీలక వ్యాఖ్యలు- మరో వివాదంలో కాంగ్రెస్ - lok sabha elections 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 24, 2024, 12:12 PM IST

Updated : Apr 24, 2024, 1:33 PM IST

Sam Pitroda US Inheritance Tax
Sam Pitroda US Inheritance Tax ()

Sam Pitroda US Inheritance Tax : దేశంలో సార్వత్రిక సమరంలో సంపద పంపిణీపై అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాము అధికారంలోకి వస్తే దేశ సంపదను ప్రజలకు సమానంగా పంచుతామని కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ప్రస్తావించిందంటూ ప్రధాని మోదీ ఇప్పటికే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత శామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోశాయి. అమెరికా మాదిరిగా మరణానంతరం సంపదను 55-45శాతం పంచాలన్న పిట్రోడా వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై బీజేపీ మండిపడగా తమ పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. మరోవైపు ఈ వ్యాఖ్యలపై శామ్ పిట్రోడా వివరణ ఇచ్చారు

Sam Pitroda US Inheritance Tax : సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్‌ నేత శామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యలతో ఆ పార్టీ మరోసారి విమర్శల్లో చిక్కుకుంది. అమెరికాలోని ఓ విధానాన్ని ఉదహరిస్తూ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అమెరికాలో వారసత్వ పన్ను అమల్లో ఉందని దీని ప్రకారం ఒక వ్యక్తి సంపాదించిన సొమ్ములో అతని మరణానంతరం సుమారు 45 శాతం మాత్రమే వారసులకు బదిలీ అవుతుందని పిట్రోడా తెలిపారు. మిగిలిన 55 శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, ఇది తనకు న్యాయంగా అనిపిస్తోందని పిట్రోడా వ్యాఖ్యానించారు.

"అమెరికాలో వారసత్వపు పన్ను ఉంది. ఉదాహరణకు ఒకరి దగ్గర 100 మిలియన్‌ డాలర్ల విలువైన సంపద ఉంటే ఆయన మరణించిన తర్వాత వారసులకు 45 శాతం మాత్రమే ఇస్తారు. మిగిలిన 55 శాతం సొత్తును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఇదో ఆసక్తికరమైన చట్టం. ఈ చట్టం ప్రకారం మీ తరంలో మీరు సంపాదించిన సంపదను ప్రజల కోసం వదిలి వేయాలి. మొత్తం కాదు, కొంత సంపదను వదిలేయాలి. ఇది నాకు న్యాయంగా అనిపిస్తోంది. కానీ భారతదేశంలో ఇది లేదు. ఎవరైనా 10 బిలియన్ల సంపద సంపాదించి చనిపోతే అతని వారసులకు ఆ 10 బిలియన్లు వస్తాయి. ప్రజలకు ఏమీ లభించదు. ఇది ప్రజలు చర్చించాల్సిన విషయం. ఎలాంటి నిర్ణయం తీసకుంటారో తెలీదు కానీ సంపద పునఃపంపిణీ గురించి మాట్లాడేటప్పుడు కొత్త విధానాలు, కొత్త కార్యక్రమాల గురించి మాట్లాడాలి. ఈ విధానాలు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉండాలి. ధనవంతుల ప్రయోజనాల కోసం కాదు."
-శామ్‌ పిట్రోడా, కాంగ్రెస్‌ నేత

మాటల యుద్ధం
శ్యామ్‌ పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. అలాంటి విధానాలు పౌరులకు న్యాయం చేస్తాయా అని ప్రశ్నించింది. ఒక వ్యాపారవేత్త 55 శాతం సంపదకు, ఒక రైతు 55 శాతం సొత్తుకు భారీ వ్యత్యాసం ఉంటుందని వెల్లడించింది. పిట్రోడా వ్యాఖ్యలు దుమారం రేపడం వల్ల కాంగ్రెస్ స్పందించింది. ఆ మాటలకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, ఆయన వ్యక్తిగత అభిప్రాయమని వివరణ ఇచ్చుకుంది.

మరోవైపు ఈ వ్యాఖ్యలపై శామ్ పిట్రోడా ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. 'కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి ప్రధాని మోదీ చేస్తున్న అబద్ధాల నుంచి దృష్టి మరల్చడానికే ఒక వ్యక్తిగా నేను చెప్పిన మాటలను వక్రీకరించడం దురదృష్టకరం. ప్రధాని మోదీ చేసిన మంగళ సూత్రం, బంగారం దోచుకోవడం అవాస్తవం. 55శాతం తీసుకుంటామని ఎవరు చెప్పారు? భారతదేశంలో ఇలాంటివి చేయాలని ఎవరు చెప్పారు? నేను ఒక ఉదాహరణగా మాత్రమే చెప్పాను' అని శామ్​ పిట్రోడా వివరించారు.

'మంగళ సూత్రాలను కూడా వదలరు'
సంపద పంపిణీపై ఇటీవల ప్రధాని మోదీ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ వనరులపై మైనార్టీలకే తొలి హక్కు అని గతంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాజస్థాన్‌లో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దేశ సంపదంతా ముస్లింలకే పంచుతుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.

" ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా పంచుతామని కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో చెప్పింది. ఆ మేరకు దేశ సంపదనంతా చొరబాటుదారులకు, ఎక్కువమంది పిల్లలు ఉన్నవారికి పంచుతారు. మీ కష్టార్జితం చొరబాటుదారుల పాలు కావడం మీకు సమ్మతమేనా? మీ ఆస్తులను జప్తు చేసే అధికారం ప్రభుత్వాలకు ఉందా? అర్బన్‌ నక్సలిజం మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నాయకులు మహిళల మంగళ సూత్రాలను కూడా వదలరు"
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

మోదీ వ్యాఖ్యలకు ప్రియాంక గాంధీ కౌంటర్
కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మహిళల మంగళ సూత్రాలను కూడా వదలదన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలకు హస్తం పార్టీ అగ్ర నేత ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చారు. తన తల్లి సోనియా గాంధీ దేశం కోసం మంగళసూత్రం త్యాగం చేశారని, రాజీవ్‌ గాంధీని ఉద్దేశించి ప్రియాంక వ్యాఖ్యానించారు. మహిళల మంగళ సూత్రాన్ని కాంగ్రెస్ లాక్కుంటుందంటూ రెండు రోజుల క్రితం వ్యాఖ్యలు వచ్చాయన్న ప్రియాంకగాంధీ, భారత్‌ గత 75 ఏళ్లుగా స్వేచ్ఛగా ఉందని గుర్తు చేశారు. 55 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉందని ప్రజల బంగారాన్ని, మంగళసూత్రాన్ని ఎప్పుడైనా లాక్కుందా అని ప్రశ్నించారు. మంగళసూత్రం ప్రాధాన్యాన్ని ప్రధాని మోదీ అర్థం చేసుకుని ఉంటే అలా అనైతికంగా మాట్లాడేవారని విమర్శించారు.

ఓటర్లకు బంపర్​ ఆఫర్​- ఓటు వేస్తే హోటళ్లలో ఫ్రీ ఫుడ్​- హైకోర్టు గ్రీన్​ సిగ్నల్​ - Lok Sabha Elections 2024

'10 రోజుల్లోనే MBA'- ఇలాంటి వాటితో జాగ్రత్తంటూ UGC వార్నింగ్​ - ugc on fake degree certificate

Last Updated :Apr 24, 2024, 1:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.