ETV Bharat / bharat

రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్- హిమాచల్​లో బీజేపీ అభ్యర్థి గెలుపు- టాస్​తో వరించిన విజయం

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2024, 4:14 PM IST

Updated : Feb 27, 2024, 8:05 PM IST

Rajya Sabha Election 2024 Live Updates
Rajya Sabha Election 2024 Live Updates

Rajya Sabha Election 2024 Live Updates : మూడు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ రసవత్తరంగా జరిగింది. యూపీ, కర్ణాటక, హిమాచల్‌లోని 15 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ పూర్తైంది. సాయంత్రం 5గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది.

  • 8.00 PM

హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి హర్ష్‌ మహాజన్ విజయం సాధించారు. ఒకే స్థానానికి జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష బీజేపీ గెలుపొందింది. హిమాచల్‌ప్రదేశ్‌లో అవసరమైన సంఖ్యాబలం లేనప్పటికీ, బీజేపీ తన అభ్యర్థిని నిలబెట్టడం వల్ల అక్కడ ఎన్నిక అనివార్యమైంది. మొత్తం 68మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్‌కు 40 మంది, బీజేపీకి 25 మంది సభ్యులు ఉన్నారు. స్వతంత్రులు మూడుచోట్ల గెలిచారు. అయితే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆరుగురు MLAలు, ముగ్గురు స్వతంత్రులు బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు. ఫలితంగా ఇద్దరు అభ్యర్థులకు చెరో 34 ఓట్లు వచ్చాయి. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ బబ్లూ ఓటు చెల్లదని ప్రకటించాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. ఈ క్రమంలో లెక్కింపు కేంద్రం వద్ద కాంగ్రెస్‌, బీజేపీ నేతలు గొడవకు దిగారు. చివరకు టాస్‌ ద్వారా బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు EC ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మరోవైపు రాజ్యసభ ఎన్నికల కోసం విప్‌ జారీచేశామన్న ముఖ్యమంత్రి సుక్విందర్‌సింగ్‌ సుక్కు, క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన వారిపై అనర్హత వేటు పడేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

  • 6.40 PM

కర్ణాటకలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ-జేడీఎస్​ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం నాలుగు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు పోటీ చేయడం వల్ల కర్ణాటకలో ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో కాంగ్రెస్‌ నిలబెట్టిన ముగ్గురు అభ్యర్థులు అజయ్‌ మాకెన్, సయ్యద్‌ నసీర్‌ హుస్సేన్‌, GC చంద్రశేఖర్‌ విజయం సాధించారు. బీజేపీ, JDS చెరో చోట పోటీచేయగా JDS అభ్యర్థి ఓటమి పాలయ్యారు. విజయానికి కావాల్సిన సంఖ్యా బలం లేకపోయినప్పటికీ బీజేపీ-జేడీఎస్ కూటమి ఒక అభ్యర్థిని అదనంగా నిలబెట్టింది. తాజా ఫలితాలతో బీజేపీ- జేడీఎస్ కూటమికి నిరాశ ఎదురైంది.

మరోవైపు, బీజేపీ ఎమ్మెల్యే సోమశేఖర్ కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటు వేశారు. మరో బీజేపీ ఎమ్మెల్యే శివరామ్‌ హెబ్బర్‌ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. తన అత్మ ప్రభోదానుసారం ఓటు వేసినట్లు ఎమ్మెల్యే సోమశేఖర్‌ చెప్పారు. ఆయనది రాజకీయ ఆత్మహత్య అని మండిపడ్డారు బీజేపీ నేత ఆర్‌. అశోక్. సోమశేఖర్​పై చర్యలు తీసుకోవాలని సభాపతిని కోరతామని చెప్పారు.

  • 5.00 PM

దేశవ్యాప్తంగా జరిగిన రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మరోవైపు, హిమాచల్ ప్రదేశ్​లో ఒక స్థానానికి జరిగిన రాజ్యసభ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఆరు నుంచి 9 మంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటేసినట్లు సమాచారం. వీరిలో స్వతంత్ర ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు. ప్రస్తుతం హిమాచల్ అసెంబ్లీలోని మొత్తం 68 మంది ఎమ్మెల్యేలలో 40 మంది కాంగ్రెస్‌, బీజేపీకి 25, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా ఆరు నుంచి 9 మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వికి బదులుగా బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్‌కు ఓటు వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే బీజేపీ 25 ఓట్లు ఉండగా, మరో 9 అదనంగా కలిస్తే 34 అవుతాయి. అలాగే కాంగ్రెస్​ 40 నుంచి 34కు పడిపోతుంది. దీంతో ఓట్లు సమం అవుతాయి. అప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఓట్లు సమం అయితే ఏం చేస్తారు?
బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థికి సమానంగా ఓట్లు వస్తే 'లాట్ డ్రా' ద్వారా విజేతను ప్రకటిస్తామని హిమాచల్​ప్రదేశ్ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ మనీశ్ గార్గ్ తెలిపారు. ఈ ప్రక్రియను ఇరువురు అభ్యర్థుల సమ్మతి తీసుకోనున్నారు. ఆ తర్వాత ఇద్దరు అభ్యర్థుల పేర్లపై స్లిప్‌ రాసి లాటరీ వేస్తారు. అప్పుడు విజేతను ప్రకటిస్తారు.

Rajya Sabha Election 2024 Live Updates : దేశంలోని 15 రాజ్యసభ స్థానాల భర్తీకి మంగళవారం జరిగిన ఎన్నికల పోలింగ్ పూర్తైంది. కర్ణాటక, ఉత్తర్​ప్రదేశ్​, హిమాచల్‌ప్రదేశ్‌లోని 15 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో మూడు రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. కాగా, కర్ణాటక రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే ఎస్టీ సోమశేఖర్ క్రాస్ ఓటింగ్​కు పాల్పడినట్లు నిర్ధరణ అయ్యిందని ఆ పార్టీ చీఫ్ విప్ దొడ్డనగౌడ పాటిల్ తెలిపారు. సోమశేఖర్​పై ఏ చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చిస్తున్నామని చెప్పారు. అలాగే హిమాచల్ ప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల్లో 6 నుంచి 9 మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్​కు వీరు ఓటు వేసినట్లు సమాచారం.

ఉత్తర్‌ప్రదేశ్​లో 10, కర్ణాటకలో నాలుగు, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఒక స్థానానికి పోలింగ్‌ జరిగింది. యూపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి బీజేపీకి ఏడు, సమాజ్‌వాదీ పార్టీకి మూడు స్థానాలు దక్కడం ఖాయంగా కన్పిస్తోంది. కానీ బీజేపీ ఎనిమిదో అభ్యర్థిని నిలబెట్టడం వల్ల గట్టి పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే విపక్ష ఎస్​పీకి క్రాస్‌ ఓటింగ్‌ భయం పట్టుకుంది. పోలింగ్‌ కొనసాగుతున్న వేళ ఎస్​పీ చీఫ్‌ విప్‌ మనోజ్‌ కుమార్‌ పాండే రాజీనామా చేయడం కలకలం రేపింది. సోమవారం పార్టీ నిర్వహించిన సమావేశానికి పాండే సహా 8 మంది ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. మంగళవారం ఆయన ఏకంగా తన పదవి నుంచి వైదొలిగారు. ఫలితంగా 8 మంది క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడతారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే బీజేపీకి ఎనిమిదో స్థానం దక్కుతుంది. ఈ క్రమంలో అఖిలేశ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. లబ్ధి పొందాలని చూస్తున్న వారు పార్టీ నుంచి వెళ్లిపోతారని అన్నారు. ఎన్నికల్లో గెలవడానికి అధికార బీజేపీ ఎలాంటి మార్గాలనైనా ఎంచుకుంటుందని ఆరోపించారు. క్రాస్ ఓటింగ్​కు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

హిమాచల్‌లో ఒక్క స్థానానికి బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులను నిలబెట్టాయి. కర్ణాటకలో నాలుగు ఖాళీలకు ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. హస్తం పార్టీ చెందిన అజయ్‌ మాకెన్‌, సయ్యద్‌ నజీర్‌ హుస్సేన్‌, జీసీ చంద్రశేఖర్‌ బరిలో ఉండగా బీజేపీ నుంచి నారాయణ్‌ భాండగే, జేడీఎస్‌కు చెందిన కుపేంద్ర రెడ్డి పోటీ చేస్తున్నారు.

Last Updated :Feb 27, 2024, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.