ETV Bharat / bharat

'వచ్చే ఐదేళ్లలో జెట్​ స్పీడ్​లో అభివృద్ధి- ఇండియా కూటమికి నిద్రపట్టడం లేదు!'

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 11, 2024, 3:57 PM IST

PM Modi On Development In India : రాబోయే ఐదేళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగాన్ని అనేక రెట్లు పెంచుతామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూశాక ప్రతిపక్ష పార్టీ, ఇండియా కూటమికి నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు. మరోవైపు, కేంద్రంలో మూడోసారి తాను అధికారంలోకి వస్తే మహిళా శక్తి ఎదుగుదలలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తానని చెప్పారు మోదీ.

PM Modi On Development In India
PM Modi On Development In India

PM Modi On Development In India : భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు వచ్చే ఐదేళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగాన్ని అనేక రెట్లు వేగవంతం చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఈ క్యాలెండర్ ఇయర్‌లో ఇప్పటివరకు రూ. 10 లక్షల కోట్లు విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశామని చెప్పారు. దేశంలో మిగతా ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలకు సమయం చాలా తక్కువగా ఉందని తెలిపారు.

'కాంగ్రెస్​కు నిద్రపట్టడం లేదు'
దేశవ్యాప్తంగా సుమారు రూ.లక్ష కోట్లు విలువైన 114 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన అనంతరం హరియాణాలోని గురుగ్రామ్‌లో జరిగిన సభలో మోదీ ప్రసంగించారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వేగాన్ని చూశాక ప్రతిపక్ష పార్టీ, ఇండియా కూటమికి నిద్ర పట్టడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ప్రతి విషయాన్ని తప్పుడు కోణంలో చూస్తుందని మండిపడ్డారు.

'2047 నాటి దేశాన్ని వికసిత్​ భారత్​గా!'
2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని అత్యంత వేగంతో సాధించాలని తాను కోరుకుంటున్నానని మోదీ ఉద్ఘాటించారు. 2047 నాటి దేశాన్ని వికసిత్​ భారత్​గా చూడాలనుకుంటున్నట్లు చెప్పారు. 2014లో 11వ స్థానంలో ఉన్న భారత్​ ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని వెల్లడించారు. త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందని తెలిపారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ ప్రభుత్వం పని చేయడం లేదని, ఎప్పుడూ అభివృద్ధి పనులు జరుగుతూనే ఉన్నాయని చెప్పారు.

'మహిళా శక్తి ఎదుగుదలలో కొత్త అధ్యాయం'
మరోవైపు, కేంద్రంలో మూడోసారి తాను అధికారంలోకి వస్తే మహిళా శక్తి ఎదుగుదలలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తానని ప్రధాని మోదీ తెలిపారు. మహిళల స్థాయిని పెంపొందించి వారికి అవకాశాలను సృష్టించే సమాజం మాత్రమే ముందుకు సాగగలదని చెప్పారు. దిల్లీలో సశక్త్ నారి-వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు మహిళల జీవితాలు, వారి కష్టాలకు ప్రాధాన్యమిచ్చేవి కావని విమర్శించారు. మరుగుదొడ్లు లేకపోవడం, శానిటరీ ప్యాడ్‌ల వాడకం, పొగను కలిగించే ఇంధనాల వల్ల కలిగే దుష్పరిణామాలు ఇతర సమస్యల గురించి మొదట మాట్లాడిన ప్రధానిని తానేనని మోదీ పేర్కొన్నారు.

కోటి మంది మహిళలు 'లఖ్‌పతి దీదీ'లుగా!
తన ఇంటిలో, పరిసరాల్లో, ఇతర గ్రామాల్లో చూసిన మహిళల సమస్యల ఆధారంగానే వారి కోసం పథకాలను రూపొందించేలా చేశాయని మోదీ అన్నారు. వివిధ ప్రభుత్వ పథకాల కింద 8 లక్షల కోట్లకు పైగా డబ్బును బీజేపీ ప్రభుత్వం మహిళలకు పంపిణీ చేసిందని వివరించారు. ఇప్పటి వరకు కోటి మంది మహిళలు 'లఖ్‌పతి దీదీ'లుగా మారారని మోదీ చెప్పారు. సశక్త్ నారీ-వికసిత్ భారత్ కార్యక్రమంలో స్వయం సహాయక బృందాలకు బ్యాంకు రుణాలుగా సుమారు 8 వేల కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఆకాశంలో విమానం అయినా, వ్యవసాయం కోసం వినియోగిస్తున్న డ్రోన్ అయినా, భారతదేశపు బిడ్డలు ఎందులోనూ తక్కువ కారని మోదీ కొనియాడారు.

"ఈ 21వ శతాబ్దంలో భారత సాంకేతిక విప్లవానికి 'నారీ శక్తి' నాయకత్వం వహిస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ రోజు మనం ఐటీ రంగం, అంతరిక్ష రంగం , సైన్స్ రంగంలో భారత మహిళలు తమ పేరును ఎలా సంపాదించుకుంటున్నారో చూస్తున్నాం. మహిళా కమర్షియల్ పైలట్ల సంఖ్యలో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆకాశంలో విమానం అయినా, వ్యవసాయం కోసం వినియోగిస్తున్న డ్రోన్ అయినా, భారతదేశపు బిడ్డలు ఎందులోనూ తక్కువ లేరు. నమో డ్రోన్ దీదీ యోజన ద్వారా ఏ సోదరీమణులైతే డ్రోన్ పైలట్లు అవుతున్నారో వారికి భవిష్యత్తులో లెక్కలేనన్ని అవకాశాలుంటాయి" అని మోదీ తెలిపారు.

'మోదీ వారెంటీ ముగిసింది'
మరోవైపు, ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాని మోదీ ఏదైనా చెబుతారని, మోదీ కీ గ్యారెంటీ ప్రచారంతో సత్యాన్ని మార్చలేమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. మోదీ వారంటీ ముగిసిందని వ్యాఖ్యానించింది. మోదీ తన హామీల పుణ్యమా అని దేశమంతా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్. ఇప్పటికే దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉన్న మోదీ, తన హయాంలో ఇచ్చిన 10 హామీలను ఎంతవరకు నెరవేర్చాలో చెప్పాలని డిమాండ్ చేశారు.

'బంగాల్​లో టీఎంసీ లూటీ- కేంద్ర నిధులు దోచుకోవడానికి 25లక్షల ఫేక్ జాబ్ కార్డ్స్!'

జమ్ముకశ్మీర్​ అభివృద్ధికి హామీ ఇస్తున్నా- ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆగవ్​: ప్రధాని మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.