ETV Bharat / bharat

ఒకేసారి అనేక టార్గెట్లు ఛేజ్- 'మిషన్‌ దివ్యాస్త్ర' సక్సెస్​- చైనాకు ఇక చుక్కలే!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 11, 2024, 7:31 PM IST

Updated : Mar 11, 2024, 8:43 PM IST

Mission Divyastra In India : రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ-డీఆర్​డీఓ మరో ఘనత సాధించింది. మిషన్‌ దివ్యాస్త్ర పేరుతో బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన అగ్ని-5 క్షిపణిని తొలిసారి విజయవంతంగా పరీక్షించింది.

Mission Divyastra In India
Mission Divyastra In India

Mission Divyastra In India : మిషన్‌ దివ్యాస్త్ర పేరుతో ఒకేసారి బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ). స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అధునాతన క్షిపణిని మల్టిపుల్‌ ఇండిపెండెంట్‌ టార్గెటబుల్‌ రీ-ఎంట్రీ వెహికల్‌ (MIRV) సాంకేతికతతో పదేళ్లు శ్రమించి డీఆర్‌డీఓ అభివృద్ధి చేసింది.

ప్రాజెక్ట్​లో అనేక మంది మహిళలు!
ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం MIRV సాంకేతికత కలిగిన అగ్ని-5 క్షిపణి సొంతం. ఒకే క్షిపణి దాదాపు 10 వార్‌హెడ్ల వరకు మోసుకెళ్లగలదు. వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. దేశీయంగానే ఎంఐఆర్‌వి సాంకేతికతను డీఆర్​డీఓ అభివృద్ధి చేసింది. ఈ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఒక మహిళ అని, ఇందులో అనేక మంది మహిళల పాత్ర ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇటీవలే తెలిపాయి. MIRV సాంకేతికత ప్రస్తుతం అమెరికా, బ్రిటన్‌, చైనా, రష్యా, ఫ్రాన్స్‌ దేశాల వద్ద ఉంది. ఇప్పుడు భారత్‌ కూడా ఆ జాబితాలో చేరింది.

చైనాకు చుక్కలే!
అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని-5కు ఐదు వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల సత్తా ఉంటుంది. పొరుగు దేశం చైనా వద్ద డాంగ్‌ ఫెంగ్‌-41 వంటి క్షిపణులు ఉన్నాయి. వీటి పరిధి 12,000 నుంచి 15,000 కి.మీ. ఉంటుంది. ఈ నేపథ్యంలో చైనాను దృష్టిలో పెట్టుకుని అగ్ని-5ను భారత్‌ తయారు చేసింది. ఆసియా యావత్తు కూడా అగ్ని-5 క్షిపణి పరిధిలోకి వస్తుంది.

ప్రధాని మోదీ హర్షం
అగ్ని-1 నుంచి అగ్ని-4 రకం క్షిపణులు 700 కి.మీ- 3,500 కి.మీ మధ్య దూరాన్ని చేరుకోగలవు. అవన్నీ మన రక్షణ బలగాలకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. అయితే మిషన్ దివ్యాస్త్ర పేరుతో అగ్ని-5 క్షిపణి తొలి ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలను ఎక్స్‌ (ట్విట్టర్​) వేదికగా అభినందించారు. మోదీపాటు కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్​నాథ్ సింగ్ కూడా అభినందనలు తెలిపారు.

Last Updated : Mar 11, 2024, 8:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.