ETV Bharat / bharat

'6 ట్రంకు పెట్టెలు తెచ్చుకోండి'- జయలలిత ఆభరణాలు తమిళనాడు ప్రభుత్వానికే!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2024, 7:47 AM IST

Updated : Feb 20, 2024, 9:16 AM IST

Jayalalitha Gold Jewellery
Jayalalitha Gold Jewellery

Jayalalitha Gold Jewellery : తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన బంగారు ఆభరణాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు బెంగళూరు కోర్టు తేదీని ఖరారు చేసింది. వాటికి తీసుకువెళ్లడానికి ఆరు ట్రంకు పెట్టెలను తెచ్చుకోవాలని స్పష్టం చేసింది.

Jayalalitha Gold Jewellery : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమంగా సంపాదించిన బంగారు, వజ్రాభరణాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు కర్ణాటకలోని బెంగళూరు కోర్టు తేదీని నిర్ణయించింది. మార్చి 6,7 తేదీల్లో ఆ ఆభరణాలను తీసుకోవడానికి 6 ట్రంకు పెట్టెలతో రావాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసును విచారించిన సివిల్ అండ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి మార్చి 6,7 తేదీలను ప్రకటిస్తూ, ఆ రెండు రోజుల్లో ఇతర కేసుల విచారణ చేపట్టకూడదని నిర్ణయించారు.

'ఆ బంగారు ఆభరణాలు తీసుకోవడానికి ఒక అధికారిని నియమించాం. తమిళనాడు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐజీపీ ఆ అధికారితో సమన్వయం చేసుకోవాలి. ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, ఆరు పెద్ద ట్రంకు పెట్టెలు, అవసరమై భద్రత సిబ్బందితో వచ్చి బంగారు ఆభరణాలను తీసుకోవాలి. తమిళనాడు డిప్యూటీ ఎస్​పీ ఈ విషయాన్ని హోంశాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లాలి. ఆ రోజుల్లో భద్రతకు స్థానిక పోలీసులను ఏర్పాటు చేసుకోనేలా చర్యలు తీసుకోవాలి' అని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

ఈ కేసు విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం రూ.5కోట్లు ఖర్చు చేసిందని న్యాయవాది ఈటీవీ భారత్​కు తెలిపారు. ఇందుకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం రూ.5కోట్ల డీడీని కర్ణాటకకు ఇదివరకే అందించిందని చెప్పారు. అయితే, ఆ మొత్తం ఇంకా కర్ణాటక ఖజానాలో జమ అవ్వలేదని వివరించారు.

కర్ణాటక ప్రభుత్వం దగ్గర ఉన్న వస్తువులు
అక్రమార్జన కేసులో 1996లో చెన్నైలోని జయలలిత నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులన్నీ ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి. అందులో 7,040 గ్రాముల 468 రకాల బంగారు, వజ్రాభరణాలు; 700 కిలోల వెండి వస్తువులు; 740 ఖరీదైన చెప్పులు ఉన్నాయి. వాటితో పాటు 11,344 పట్టు చీరలు, 250 శాలువాలు, 12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీ సెట్లు, 8 వీసీఆర్‌లు, 1 వీడియో కెమెరా, 4 సీడీ ప్లేయర్లు, 2 ఆడియో డెక్, 24 టూ ఇన్ వన్ టేప్ రికార్డర్లు, 1040 వీడియో క్యాసెట్లు, 3 ఐరన్ లాకర్లు, రూ.1,93,202 నగదును స్వాధీనం చేసుకున్నారు.

అక్రమ ఆస్తుల కేసులో జయలలితకు 2014లో బెంగళూరు కోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష, రూ.100 కోట్లు జరిమానా విధించింది. అలాగే స్వాధీనం చేసుకున్న వస్తువులను ఆర్​బీఐ, ఎస్​బీఐ లేదా బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని స్పష్టం చేసింది. అయితే ఇంతలోనే జయలలిత మరణించారు. ఈ క్రమంలోనే దీనిపై మరోసారి విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు ఆ ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని ఆదేశించింది.

'సందేశ్​ఖాలీ కేసును మణిపుర్‌ పరిస్థితులతో పోల్చొద్దు'- CBI దర్యాప్తునకు సుప్రీం నో

కేంద్రం ప్రతిపాదనకు రైతులు నో- మరోసారి దిల్లీ చలోకు పిలుపు

Last Updated :Feb 20, 2024, 9:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.