Protest against Minister Mallareddy in Medchal : మంత్రి మల్లారెడ్డికి తన సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. మేడ్చల్ జిల్లా చింతలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు మంత్రి వెళ్లారు. ఈ క్రమంలో మల్లారెడ్డి కాన్యాయ్ని ఉషారుపల్లి గ్రామస్థులు అడ్డుకుని నిరసన తెలిపారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు అధ్వానంగా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అప్పుడు తప్ప మిగితా సమయంలో మా గ్రామాలు గుర్తురావంటూ మంత్రి మల్లారెడ్డిని నిలదీశారు. కనీస సౌకర్యాలు కల్పించాలంటూ గ్రామస్థులు మంత్రిని కోరారు. కనీసం ఉండడానికి ఇళ్లు కూడా లేవని.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పించాలంటూ కొందరు వృద్ధులు తమ సమస్యలను చెప్పుకున్నారు. మరికొందరు మహిళలు.. చాలా రోజుల తరువాత మంత్రి తమ ఊరికి వచ్చారని సమస్యలు చెప్పుకోవడానికి మంత్రి వద్దకు వెళ్తే స్థానిక ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను విన్న మంత్రి మల్లారెడ్డి వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.