Student Union Leaders Tried Block KTR Convoy :నిజామాబాద్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ కాన్వాయ్ను అడ్డుకునేందుకు వివిధ విద్యార్థి సంఘం నేతలు ప్రయత్నించారు. మున్సిపల్ చౌరస్తాలో వారు కాన్వాయ్కు అడ్డుగా వెళ్లారు. దీంతో కాసేపు అక్కడ గందరగోళం నెలకొంది. వెంటనే పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. మరోవైపు బోధన్ పట్టణంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులను, గ్రామపంచాయతీ కార్మికులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటామని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు వారిని అరెస్ట్ చేసి.. మంత్రి కార్యక్రమం అనంతరం విడిచిపెట్టారు.
మరోవైపు డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంను కూడా పోలీసులు తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. కేటీఆర్ పర్యటనను.. విద్యార్థి సంఘం నాయకులు అడ్డుకుంటారన్న సమాచారంతో.. మంగళవారం రాత్రి నుంచి యూనివర్సిటీ ఎదుట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే పలువురిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నించారు. కానీ విద్యార్థులు తమకు సెమిస్టర్ పరీక్షలు ఉన్నాయని.. ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టమని తెలపడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఈ క్రమంలోనే ఎవ్వరూ గేట్ బయటకు రావొద్దని వస్తే కేసులు పెడతామని విద్యార్థులను.. పోలీసులు హెచ్చరించారు.