Sheep washed in the stream in Bhavanipet : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాలు గొర్రెల మంద పట్ల మృత్యుపాశంగా మారాయి. వాగు దాటే క్రమంలో వరద ఉద్ధృతిని తట్టుకోలేక గొర్రెలు వాగులో కొట్టుకుపోయిన ఘటన.. కామారెడ్డి జిల్లా భవానీపేటలో చోటుచేసుకుంది. నిర్విరామంగా కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు అలుగు పారుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని భవానీపేట- పోతారం గ్రామాల మధ్య ఉన్న వాగును.. దాటించే క్రమంలో గొర్రెలు కొట్టుకుపోయాయి. కాపరులు.. మందను గుంపుగా చేసి వాగును దాటిస్తుండగా.. కొద్దిదూరం బాగానే వెళ్లాయి. ముందుకు వెళ్లే కొద్దీ వరద ఉద్ధృతి పెరగడంతో మందలో ఉన్న పలు గొర్రెలు వాగులో కొట్టుకుపోయాయి. వరదలో కొట్టుకుపోయిన వాటిలో.. కొన్ని గొర్రెలను మాత్రమే స్థానికులు కాపాడగలిగారు. మిగతా గొర్రెలు వాగులో గల్లంతయ్యాయి. గొర్రెలు వాగులో కొట్టుకుపోవడంతో తమకు నష్టం వాటిల్లిందని గొర్రె కాపరులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.