Persons Fight Because Muggu in Hyderabad : ఇంటి ముందు వేసిన ముగ్గు చెరిగిపోయిందని పక్కింటి వారితో గొడవకి వెళ్లారు. వారి మధ్య వివాదం పెరిగి పోయింది. చివరికి అది ఒకరి ప్రాణాలు తీసేంత వరకు వెళ్లింది. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలోని ఛత్రినాక పీఎస్ పరిధిలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని పాతబస్తీలోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో శివాజీ నగర్ ప్రాంతం దగ్గర మాణిక్ ప్రభు, దుర్గేష్ కుటుంబాలు పక్కపక్కనే నివాసం ఉంటున్నారు. మాణిక్ ప్రభు తల్లి ఉదయం తన ఇంటి ముందు ముగ్గు పెట్టి ఇంటిలోకి వెళ్లింది. కాస్త సమయం గడిచిన అనంతరం పక్కనే ఉంటున్న దుర్గేష్ ఇంటి నుంచి నీళ్లు రావడంతో ఆమె వేసిన ముగ్గు నీళ్లతో కొట్టుకుపోయింది. ఈ విషయంలో మాణిక్ ప్రభు.. దుర్గేష్ ఇంట్లో వారిని ప్రశ్నించారు. ఇరువురి మధ్య మాట మాట పెరిగి కొట్టుకున్నారు. దుర్గేష్ వారి కుటుంబీకులు కలిసి పిడి గుద్దులు గుద్దడంతో.. మాణిక్ ప్రభు(36) ఆస్పత్రికి తరలించేలోపు చనిపోయాడు. సమాచారం అందుకున్న ఛత్రినాక పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.