MLC Jeevan Reddy on BRS Govt : ఎన్నికల కోడ్ రావడంతో కేసీఆర్ శకం ముగిసింది : ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
Published : Oct 11, 2023, 3:56 PM IST
MLC Jeevan Reddy on BRS Govt : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావటంతో.. దశాబ్ద కాలం కేసీఆర్ శకం ముగిసినట్లేనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి దుయ్యబట్టారు. జగిత్యాలలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన ఆయన ఎన్నికల కోడ్ వస్తుందని ఆగమేఘాల మీద బీసీ బంధు, దళిత బంధు, ఇళ్ల మంజూరు పత్రాలు ఇచ్చారన్నారు. ఈ అయిదేళ్లలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేటాయించిన నిధులను ఆ ఏడాదే ఖర్చు పెట్టే విధంగా చట్టం తెస్తామని హామీ ఇచ్చారు.
గృహ నిర్మాణానికి రూ.12 వేల కోట్లు కేటాయించి ఒక ఇళ్లు కూడా ఇవ్వలేదన్నారు. బీసీ బంధు కూడా ఇవ్వలేదన్నారు. దళిత బంధుకు రూ.17 వేల కోట్లు కేటాయించి గతేడాది ఎందుకు ఇవ్వలేదని.. ఈ ఏడాది నిధులు కేటాయించి ఆరు నెలలు అయినా ఇంత వరకు లబ్దిదారుల ఎంపిక కూడా చేయకుండా దళితులను మోసం చేశారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని వ్యాఖ్యానించారు.