MLA Rajasingh Comments on Rs 1 Lakh to BC communities : రాష్ట్రవ్యాప్తంగా బీసీ కులవృత్తులు, చేతి వృత్తులకు ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికోసం ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించగా.. రేపటి నుంచి సాయం అందించనున్నారు. అయితే ఈ ఆర్థిక సాయంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీసీ కులాలకు రూ.లక్ష పథకం ఓ మోసమని.. కేసీఆర్ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మొద్దని రాజాసింగ్ తెలిపారు. రాష్ట్రంలో బీసీల్లో 130 కులాలు ఉంటే.. కేవలం 41 కులాలకే రూ.లక్ష ఆర్థిక సాయం ఇస్తామని చెప్పడంలో ఉన్న ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఇది కేవలం ఎన్నికల కోసమే ఇస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికే అప్పుల పాలైందని.. ఇస్తామన్న రూ.1 లక్ష సాయం కచ్చితంగా అందుతుందన్న నమ్మకం లేదన్నారు. ఇలాంటి మాయమాటలు నమ్మి.. ప్రజలెవరూ మోసపోవద్దని సూచించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.