Minister Talasani About Chepa Mandu Distribution :మృగశిర కార్తె అంటే అందరికి గుర్తు వచ్చేది చేప మందు. అస్తమా రోగులకు ఈ మందు తీసుకుంటే రోగం నయమవుతుందని ప్రజల నమ్మకం. హైదరాబాద్లో ప్రతి సంవత్సరం మృగశిర కార్తె సందర్భంగా చేప మందును పంపిణీ చేస్తారు. కొవిడ్ కారణంగా గత 3 సంవత్సరాల నుంచి ఈ మందు పంపకం జరగడం లేదు. కొవిడ్ తరువాత పంపిణీ చేయడం ఇదే మొదటి సారి. ఈమృగశిర కార్తెను పురస్కరించుకొని ఆస్తమా బాధితులకు బత్తిని హరినాథ్గౌడ్ నేతృత్వంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా మంత్రి తలసాని ఈ చేప ప్రసాదం పంపిణీ ప్రారంభించారు.
నాంపల్లిలో బత్తిని కుటుంబం అందజేస్తున్న చేప ప్రసాదం హైదరాబాద్కు గర్వకారణమని... దేశవిదేశాల నుంచి ఇక్కడికి వస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 24 గంటలపాటు నిర్విరామంగా కొనసాగనున్న ఈ కార్యక్రమానికి నిన్న సాయంత్రం వరకే దేశం నలుమూలల నుంచి సుమారు 25 వేల మందికి పైగా ఆస్తమా బాధితులు తరలిరావడంతో మైదానం కిటకిటలాడుతోంది. వీరి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో జీహెచ్ఎంసీతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు అల్పాహారం, భోజనాలు, తాగునీరు సమకూరుస్తున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తలసాని తెలిపారు.