Harish Rao tweet Telangana Haritha Utsavam :ప్రపంచంలోనే అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతున్న అరుదైన ప్రదేశాలలో తెలంగాణ ఒకటి అని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో చక్కని గ్రీన్ కవర్ ఉందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ హరితహారాన్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. హరితహారంలో అద్భుతమైన ఫలితాలతో 7.7 శాతం వృద్ధిని సాధించామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టి వల్ల ఈ కార్యక్రమం సాధ్యమైందని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 14 వేల 8వందల 64 నర్సరీలు, 19వేల 4వందల 72 పల్లె ప్రకృతి వనాలు అభివృద్ధి చేశామని వెల్లడించారు.
13.44 లక్షల ఎకరాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 273కోట్ల మొక్కలు నాటించామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. కేసీఆర్ వంటి నిజమైన పర్యావరణవేత్తకు మాత్రమే ఇది సాధ్యమవుతుందని కొనియాడారు. నేడు తెలంగాణ ఏం చేస్తుందో దేశం అదే అనుసరిస్తోందని పునరుద్ఘాటించారు. మరోవైపు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు తెలంగాణ హరితోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. తొమ్మిదో విడత హరితహారంలో భాగంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని తుమ్మలూరు అర్బన్ ఫారెస్ట్ పార్కులో ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు.