Protest at Shadnagar in Ranga Reddy : రాష్ట్ర ప్రభుత్వం బీసీ కుల వృత్తులు, చేతివృత్తులకు అందిస్తున్న లక్ష రూపాయల ఆర్థిక సాయం గడువు నేటితో ముగియనుంది. దీంతో దరఖాస్తు చేసుకునేందుకు ఆశావహులు మీసేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. అయితే ఈ సాయం కోసం కుల ధ్రువీకరణ పత్రాలు కావాల్సి ఉండటంతో వాటి కోసం తంటాలు పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో అధికారులు కుల, ఆదాయ ధ్రువపత్రాల జారీ చేయడంలో జాప్యం చేస్తున్నారంటూ ఆశావహులు సోమవారం రాత్రి ఆందోళనకు దిగారు. వారికి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతుగా నిలిచి రోడ్డుపై బైఠాయించారు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో పాత జాతీయ రహదారి పై ఆశావహులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళన చేశారు. తహసీల్దార్ కార్యాలయ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతూ ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లక్ష రూపాయల సాయం ఇవ్వకూడదనే.. ఉద్దేశపూర్వకంగా పత్రాలు మంజూరు చేయడం లేదని ఆరోపించారు. దరఖాస్తుకు గడువు నేటితో ముగియనుండటం వల్ల.. ఇంకా ధ్రువపత్రాలు రాని వారంతా ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తు గడువును పెంచాలని డిమాండ్ చేశారు.