MLC Kadiam Srihari hot comments : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రాపాకపల్లిలో అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి హాజరయ్యారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం మాట్లాడిన కడియం.. హాట్ కామెంట్స్ చేశారు. అవకాశం వచ్చిందని దండుకొని దోచుకోవద్దని.. తప్పుడు పనులు చేస్తూ ప్రజల్లో చెడ్డ పేరు తీసుకురావద్దంటూ స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. అవకాశం వస్తే పది మందికి ఉపయోగపడాలి.. పది కుటుంబాలకు సహాయం చేయాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో మాట్లాడిన ఆయన.. 'ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన పనులను ప్రజలు గుర్తించుకోవాలి తప్ప.. అవకాశం వచ్చిందని విర్రవీగొద్దని' హితవు పలికారు. ఈ కామెంట్స్తో జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కొందరు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని అంటుండగా.. మరి కొందరు ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు. ఆయన స్థానిక ప్రజా ప్రతినిధులందరిని ఉద్దేశించి మాట్లాడారని అంటున్నారు. ఈ వ్యాఖ్యలు అనంతరం అటు కడియం శ్రీహరి గానీ.. ఇటు తాటికొండ రాజయ్య గానీ ఏ మాత్రం స్పందించలేదు.