Heavy rains in Adilabad : రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. కేవలం ఈ నాలుగు రోజులలో కురిసిన వానతో.. ఈ సీజన్ లోటు వర్షపాతం తొలిగిపోయి అదనపు వర్షపాతం నమోదైందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా.. ఉపరితల ఆవర్తన ప్రభావంతో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు జలకళను సంతరించుకున్నాయి. నిండుకుండలా మారి అలుగు పారుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పిప్పల్ కోటి, అంతర్గావ్ గ్రామాల సమీపంలో అంతరాష్ట్ర రహదారిపై ఉన్న లోతట్టు వంతెన నీటమునిగింది. ఉరకలెత్తుత్తున్న వరద ఉద్ధృతికి.. రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. 30 గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. జనజీవనం ఎక్కడిక్కడ స్తంభించిపోయింది. ముఖ్యంగా ఏజెన్సీ పల్లెవాసులు తిప్పలు పడుతున్నారు. భీంపూర్ మండలంలో వరద నీటితో పంట చేలు నీట మునిగాయి. ఎగువ నుంచి వరదతో.. మరోవైపు మండల సరిహద్దున ఉన్న పెన్గంాగ నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో.. లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను ముంపు భయం వెంటాడుతోంది. ఎప్పుడేం జరుగుతుందోనని పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.