Himayathnagar ATM Theft CC Footage : హైదరాబాద్లో సంచలనంగా మారిన హిమాయత్నగర్లోని ఏటీఎం సెంటర్లో పెప్పర్ స్ప్రే కొట్టి డబ్బులు చోరీ చేసిన కేసులో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును మొదటి నుంచి సవాల్గా తీసుకున్న నారాయణగూడ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితులను కేరళలో గుర్తించి.. అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 4వ తేదీన హిమాయత్నగర్లోని ఏటీఎం సెంటర్లో నగదు డిపాజిట్ చేయడానికి వచ్చిన వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి డబ్బులు లాక్కెళ్లారు. ఈ కేసులో మొదటి నుంచీ రోజుకో విషయం బయటకు వస్తోంది. ఈ కేసులో బాధితుడిగా ఉన్న కేరళకు చెందిన అబ్దుల్ ముజీబ్.. ట్రాఫిక్ కూడళ్లలో వస్తువులు విక్రయిస్తూ ఉంటాడు. అయితే ముజీబ్ రూ.10 లక్షల నగదును డిపాజిట్ చేయడంపై పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై విచారించిన పోలీసులు.. దుబాయ్ నుంచి నగరానికి చేరిన హవాలా సొమ్మును ఇక్కడి ఏజెంట్ల సాయంతో కొందరు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.