Parvati Barrage in Peddapalli : గత 4 రోజులుగా గోదావరికి వరద ప్రవాహం రావడంతో పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండంలో ఉన్న పార్వతి బ్యారేజ్ నిండుకుండలా మారింది. అధికారులు ముందస్తుగా నీటిని దిగువ ప్రాంతాలకి విడుదల చేశారు. బ్యారేజ్కు వరద ప్రవాహం తగ్గిపోవడంతో ఉదయం అధికారులు అన్ని గేట్లను మూసి వేశారు. ఈ విషయం తెలుసుకున్న గోదావరి నది తీర ప్రాంత ప్రజలతో పాటు పక్కనున్న గ్రామాల ప్రజలు తండోపతండాలుగా చేపలను పట్టడానికి వస్తున్నారు. చేపలు పడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఎటువంటి భయం లేకుండా ప్రజలు బ్యారేజ్లోని గేట్ల ముందరే నీటిలో దిగి ప్రమాదకర స్థితిలో చేపలు పడుతున్నారు. ఒక్కొక్కరికి సుమారు 25 కిలోల నుంచి 50 కిలోల వరకు అంతకు మించి చేపలు దొరకడంతో ఆనందం వ్యక్తం చేశారు. మరికొందరు ఒక అడుగు ముందుకు వేసి బ్యారేజ్ వద్దనే చేపల అమ్మకాలు కొనసాగిస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా ఇదే తంతు నడుస్తోందని స్థానికులు చెబుతున్నారు.