Edupayala temple in Medak : ఆషాఢమాసం రెండో ఆదివారం సందర్భంగా మెదక్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారు శాకంబరీదేవీ రూపంలో దర్శనమిచ్చారు. వివిధ రకాల కూరగాయలతో ఆలయ అర్చకులు శంకర్శర్మ అమ్మవారిని శాకాంబరీగా అలంకరించారు. ఆషాఢమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తలు మంజీరా నదిలో స్నానమాచరించి పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
ఉదయాన్నే ఆలయ అర్చకులు అమ్మవారికి అభిషేకం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడు పాయలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో సారా శ్రీనివాస్ అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం లక్ష గాజులతో విశేష అలంకరణ చేయగా.. కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల ఏడుపాయల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.