CM KCR gave Mahaharathi to Godavari River : ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరిఖని శివారు వంతెన వద్ద ఆగి గోదారమ్మకు ప్రత్యేక మహా హారతి సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య గోదారమ్మకి సీఎం జలహారతితో పాటు పూలు చల్లి గోదారి తల్లికి నమస్కరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సుసాధ్యమైన గోదావరి సజీవధారకు ముగ్దుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా పూజలు చేశారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కొరుకంటి చందర్తో పాటు నియోజక వర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి మంచిర్యాల జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో పాల్గొని ప్రతిపక్షాలపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధిని ఎత్తిచూపుతూ ప్రతిపక్షాలపై విమర్శలు సంధించారు.