Fire Broke Out in a Car in Sangareddy : ఏడుగురు ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి కారు దగ్ధమైన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పరిధిలోని పెద్దాపూర్ వద్ద కారులో మంటలు చెలరేగగా.. ప్రమాదంలో ఏడుగురు చాకచౌక్యంగా వ్యవహరించి ప్రాణాలు కాపాడుకున్నారు. స్థానికుల వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా మునిపల్లి నుంచి నర్సాపూర్కు రెనాల్ట్ డస్టర్ కారులో ఏడుగురు ప్రయాణిస్తున్నారు. పెద్దాపూర్ మదర్సా వద్దకు వచ్చేసరికి వారు ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో వారు గమనించి వెంటనే కారును రోడ్డు పక్కకు ఆపి.. కారు నుంచి దిగిపోయారు. మంటలు అదుపు చేసే ప్రయత్నం చేయగా.. దట్టమైన పొగతో మంటలు వ్యాపించడంతో వారు ఏం చేయలేకపోయారు. ప్రమాదంలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు సకాలంలో వచ్చి మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. అప్పటికే మంటలు కారు చుట్టూ వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటంతో ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.